475మంది ఎంపీలు కోటీశ్వరులే: అందులో జగన్ పార్టీ టాప్, మాధవి ఆస్తి రూ.1 లక్ష, ఏపీ-టీ నుంచి వీరే..
ఈసారి గెలిచిన లోకసభ సభ్యుల్లో 475 మంది (88) ఎంపీలు కోటీశ్వరులు. 2014లో గెలిచిన వారిలో 442 మంది (82 శాతం) ఉండగా, ఇప్పుడు అది మరింత పెరిగింది. 2009లో ఇది కేవలం 58 శాతమే (315 మంది కోటీశ్వరులు). అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ప్రకారం గెలిచిన దాదాపు అన్ని పార్టీల్లో రూ.1 కోటికి పైగా ఆస్తిపరులు ఉన్నారు.
మీ పర్సనల్ ఫైనాన్స్పై ఎలా ప్రభావం పడుతుంది?
ఏ పార్టీలో ఎంతమంది కోటీశ్వరులు?
303 మంది బీజేపీ ఎంపీల్లో 265 మంది, 52 మంది కాంగ్రెస్ ఎంపీల్లో 43 మంది, డీఎంకేలో 23 మంది, తృణమూల్ కాంగ్రెస్లో 22 మంది, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో 19 మంది, తెలంగాణ రాష్ట్ర సమితిలో 9 మంది, శివసేనలో 18 మంది, తెలుగుదేశం పార్టీలో ముగ్గురు కోటీశ్వరులే. లోకసభ ఎంపీల సరాసరి ఆస్తులు రూ.20.93 కోట్లు. కోటీశ్వరుల విజయావకాశాలు 21 శాతం ఉండగా, రూ.కోటి లోపు ఆస్తులు ఉండి గెలిచిన వారి సంఖ్య ఒక్క శాతం మాత్రమే.
సరాసరి ఆస్తుల్లో జగన్ పార్టీ టాప్
పార్టీల పరంగా యావరేజ్ చూస్తే బీజేపీ ఎంపీల సరాసరీ ఆస్తులు రూ.14.52 కోట్లు, కాంగ్రెస్ ఎంపీల సరాసరి ఆస్తులు రూ.38.71 కోట్లు, డీఎంకే ఎంపీల సరాసరి ఆస్తులు 24.51 కోట్లు, వైసీపీ ఎంపీల సరాసరి ఆస్తులు రూ.54.85 కోట్లు, తృణమూల్ ఎంపీల సరాసరి ఆస్తులు రూ.6.15 కోట్లు. రూ.5 కోట్లకు మించి ఆస్తులు ఉన్న ఎంపీలు 266 మంది. ఇది 30.1 శాతం. రూ.పది లక్షల లోపు ఆస్తులు ఉన్న వారు కేవలం 9 మంది మాత్రమే. అంటే 0.03 శాతం.
ఏపీలో టాప్ ధనవంతులు వీరే.. మాధవి ఆస్తు కేవలం 1.41 లక్షలే
లోకసభకు ఎన్నికైన వారిలో అత్యంత ధనవంతుడు మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ తనయుడు నకుల్ నాథ్. ఆయన మొత్తం ఆస్తులు రూ.660 కోట్లు. ఏపీ నుంచి నర్సాపురం నుంచి గెలిచిన రఘురామ కృష్ణం రాజు అత్యంత ధనికులు. ఆయన ఆస్తులు రూ.325 కోట్లు. ఆ తర్వాత గల్లా జయదేవ్ (రూ.305 కోట్లు), ఆదాల ప్రభాకర్ రెడ్డి (రూ.221 కోట్లు) ఉన్నారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఆస్తులు కేవలం రూ.1.41 లక్షలు. తెలంగాణ నుంచి చూస్తే జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఆస్తులు రూ.126.91 కోట్లు, కొత్త ప్రభాకర్ రెడ్డి రూ.126.65 కోట్లు, నామా నాగేశ్వర రావు రూ.100 కోట్ల ఆస్తులతో ఉన్నారు.
అప్పుల్లోను ఏపీ ఎంపీలు ఇలా...
కన్యాకుమారి లోకసభ స్థానం నుంచి గెలిచిన వసంత్ కుమార్కు రూ.154 కోట్ల అప్పులు, ఏపీకి చెందిన రఘురామ కృష్ణం రాజుకు రూ.101 కోట్ల అప్పులు, వల్లఫనేని బాలశౌరికి రూ.74 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇక, ఎక్కువ వ్యక్తిగత ఆదాయం చూపిన వారిలో గల్లా జయదేవ్ టాప్. 2017-18 ఆర్థిక సంవత్సరంలో గల్లా రూ.43 కోట్ల వార్షిక ఆదాయం చూపగా, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రూ.33 కోట్లు చూపారు. కన్యాకుమారి ఎంపీ వసంత్ కుమార్ రూ.28 కోట్లు చూపారు.