లోకసభ ఎన్నికలు: పెట్టుబడులపై ఫలితాల ప్రభావం
ఇన్వెస్టర్లు రేపటి (మే 23) తేదీ ఎన్నికల ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. దిగ్గజ కంపెనీలు మొదలు ఆయా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేవారు, విదేశీ టెక్ కంపెనీలు మొదలు మార్కెట్ వర్గాలు అన్నీ ఎవరు గెలుస్తారనే ఆసక్తితో ఉన్నారు. ఇప్పటికే ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఓ అంచనాకు వచ్చారు. అసలైన పరీక్ష గురువారం ఉంది. దీంతో మార్కెట్ వర్గాలు ఫలితాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాయి.
ఎకనామిక్, బిజినెస్ యాక్టివిటీస్ విస్తృతం కావాలంటే స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని మార్కెట్లు కోరుకుంటున్నాయి. దీంతో పాటు ఆ ప్రభుత్వం విధానాలు కూడా పెట్టుబడులపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉండాలని చెబుతున్నారు. అందుకే ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీజేపీ ప్రభుత్వం వస్తుందని చెప్పగానే మార్కెట్లు దూసుకెళ్లాయని గుర్తు చేస్తున్నారు.
ఇటీవల మే 2వ తేదీ నుంచి 17వ తేదీ మధ్య 6వేల కోట్లకు పైగా ఫారన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి తీసుకున్నారు. అలాగే, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి దిగ్గజ సంస్థలు భారత్లో పెట్టుబడులపై వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నాయి. స్థిరమైన ప్రభుత్వం వస్తే విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు రానున్నాయి.