మోడీ హయాంలో అంబానీ, అదానీ స్టాక్స్ ఎంత పెరిగాయో తెలుసా ?
నరేంద్ర భాయ్ మోడీ.. అన్నీ అనుకూలిస్తే రేపు ఈ సమయానికి దేశానికి రెండోసారి ప్రధాన మంత్రిగా ఆయన దాదాపుగా ఖరారైపోయి ఉండొచ్చు. అయితే ఆయన రాకను, బిజెపి మెజార్టీని ఈ పాటికే ఎగ్జిట్ పోల్స్ అంచనా కట్టాయి. నాలుగు రోజుల ముందు నుంచే వాళ్ల పార్టీల్లో సంబరాలు మొదలయ్యాయి. అంతే కాదు స్టాక్ మార్కెట్లో కొన్ని అనుకూల కంపెనీలు కూడా ఎగిరి గంతేశాయి. వాటిల్లో ప్రధానంగా అదానీలు, అంబానీలు సహా మరికొన్ని గ్రూపు సంస్థల షేర్లు భారీగా పెరిగాయి. ఇదే కాదు.. ఈ ఐదేళ్ల కాలంలో కొన్ని గ్రూపులు అనూహ్యంగా ఎవరూ ఊహించని విధంగా లాభపడ్డాయి. దీనికి ఆర్థిక వ్యవస్థ, బూమింగ్ మార్కెట్ వంటివి సహకరించినా.. మోడీ మ్యాజిక్కే అంటారు. ఈ నేపధ్యంలో యూపీఏ-2, ఎన్డీఏ హయాంలో ఏ గ్రూప్ కంపెనీలు ఎంత సంపాదించాయో చూద్దాం.
ముఖేష్ అంబానీ మామూలుగా పెరగలేదు
ఏ కంపెనీ, ఏ గ్రూప్ అయినా ఎలా వృద్ధి చెందింది అని లెక్కించాల్సి వస్తే ముందుగా మార్కెట్లో లెక్కగట్టేది సదరు సంస్థల మార్కెట్ క్యాపిటలజైషన్. ఇక్కడ కూడా మనం అదే అంశాన్ని పరిగణలోకి తీసుకుందాం. యూపీఏ-2లో రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ మార్కెట్ కేయాపిటలైజేషన్ రూ.11,684 కోట్లు పెరిగింది. అదే ఎన్డీఏ హయాంలో ముకేష్ అంబానీ సంస్థల మార్కెట్ విలువ ఏకంగా రూ.4.84 లక్షల కోట్లు పెరిగింది. అవును మీరు చదివింది నిజమే. ఈ సంస్థల మార్కెట్ విలువ ఏకంగా రూ.5 లక్షల కోట్ల వరకూ పెరిగింది.
టెలికాం మార్కెట్లో పెట్టుబడులు, రిటైల్ రంగంలో మార్పులు వంటివి ముకేష్ అంబానీకి బాగా సహకరించాయి.
అనిల్ అంబానీకి ఎదురుదెబ్బలు
అనిల్ ధీరూబాయ్ అంబానీ మార్కెట్ లాభనష్టాల కంటే ఎక్కువగా స్వయం కృతాపరాధాల వల్లే ఇబ్బందిపడ్డారు. ఎన్డీఏ హయాంలో అనిల్ సంస్థ మార్కెట్ విలువ లాభాలకు బదులు ఏకంగా రూ.65130 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. అదే సమయంలో యూపీఏ2లోని గత ప్రభుత్వ హయాంలో కూడా రూ.64873 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను పోగొట్టుకుంది.
టాటా గ్రూపునకు లాభాలే లాభాలు
టాటా గ్రూప్ స్టాక్స్ ఎన్డీఏ హయాంలోనూ ఎగిరి గంతేశాయి. పెద్ద సంఖ్యలో ఉన్న గ్రూపుల నేపధ్యంలో ఈ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.22 లక్షల కోట్లు వృద్ధి చెందింది. టాటా మోటార్స్, టాటా కమ్యూనికేషన్స్, టీసీఎస్ వంటివి దెబ్బకొట్టాయి కానీ లేకపోతే ఈ గ్రూప్ మరింతగా లాభపడి ఉండేది.
అదే యూపీఏ హయాంలో ఈ సంస్థల మార్కెట్ విలువ రూ.5.33 లక్షల కోట్లు పెరిగింది.
ఇక అదానీల వంతు
అదానీ గ్రూపునకు చెందిన ఆరు లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.63 లక్షల కోట్లు. అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ వంటివి ప్రధానంగా ఉన్న సంస్థలు. యూపీఏ-2లో అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాప్ రూ.43651 కోట్లు ఉంటే.. అది మోడీ హయాంలో రూ.1.63 లక్షల కోట్లకు ఎగబాకింది. అంటే నాలుగు రెట్ల వృద్ధి అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
ఇవన్నీ బేరీజు వేసి చూస్తే.. మీకే అర్థమై ఉంటుంది. ఎవరు.. ఎవరికి సన్నిహితులో! ఎందుకు సదరు గ్రూప్ స్టాక్స్ మాత్రమే పెరిగాయో అర్థమయి ఉంటుంది.