2014లో మోడీ ప్రధాని పదవి చేపట్టిన రోజున ఇందులో రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రూ.56 లక్షలు
న్యూఢిల్లీ: కేంద్రంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని, నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని అవుతారని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. అన్ని సర్వేలు కూడా ఎన్డీయేకు 280 నుంచి 370 వరకు లోకసభ స్థానాలు వస్తాయని వెల్లడించాయి. దీంతో సోమవారం నాడు మార్కెట్లు దూకుడుగా కనిపించాయి. పదేళ్ల తర్వాత నిన్న సూచీలు పరుగులు పెట్టాయి. 2014లో కూడా మోడీ గెలిచిన తర్వాత మార్కెట్లు జోరుగా కనిపించాయి. ఇప్పుడు మరోసారి ఆయనే వస్తారని ఎగ్జిట్ సర్వేలు వెల్లడించడంతో నిఫ్టీ ఒక్క రోజులోనే పొందిన లాభాల విషయంలో పదేళ్లలోనే అత్యుత్తమం. జనవరి 25, 2009 తర్వాత 421 పాయింట్లు పొందటం నిన్ననే మొదటిసారి. సెన్సెక్స్ కూడా ఆరేళ్లలోనే ఇది అత్యధికం.
మోడీ ఎఫెక్ట్: నిమిషంలో 3.18 లక్షల కోట్లు సంపాదించారు
ఒక్క నిమిషంలో రూ.3.2 లక్షల కోట్ల లాభం, రోజులో రూ.5.33 లక్షలు
సోమవారం స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన ఒకే ఒక్క నిమిషం వ్యవధిలో మదుపర్ల సంపద రూ.3.2 లక్షల కోట్లు పెరిగింది. సూచీలు రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. దీంతో షేర్ల ధరలు భారీగా పెరిగాయి. ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించడంతో మదుపర్లను, మార్కెట్లను డబ్బుల్లో ముంచెత్తాయి. ఈ లాభాలు ముందు ముందు కూడా ఉంటాయని భావిస్తున్నారు. బీజేపీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తే పాలన, విధానాల్లో స్థిరత్వం ఉంటుందనే భావనతో మార్కెట్లు లాభపడ్డాయని చెబుతున్నారు. కేవలం నిమిషం సమయంలో రూ.3.2 లక్షల కోట్లు పెరిగిన మార్కెట్ విలువ కాస్తా.. రోజు మొత్తం మీద రూ.5.33 లక్షల కోట్లు అదనంగా పెరిగింది. ట్రేడింగ్ చివరకు బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.1,51,86,312.05 కోట్లకు చేరుకుంది. శుక్రవారం ముగింపు ఇది రూ.1,46,58,709.68 కోట్లుగా ఉంది. వరుసగా మూడు రోజులు మార్కెట్ లాభాల్లో కొనసాగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.7.48 లక్షల కోట్లకు పెరిగింది.
సెన్సెక్స్, నిఫ్టీ దూకుడు
సెన్సెక్స్ షేర్లలో బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్ మినహా దాదాపు అన్ని కంపెనీల షేర్లు లాభాల్లోనే ఉన్నాయి. సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ 1422 పాయింట్లు, నిఫ్టీ 421 పాయింట్లు పెరిగాయి. సెన్సెక్స్ 1,421.90(3.73%) పాయింట్ల లాభంతో 39,352.67 వద్ద స్థిరపడింది. 39,300 కీలక స్థాయిని అధిగమించింది. నిఫ్టీ కూడా 421.10 పాయింట్ల (3.69%) లాభంతో 11,828.25 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఆల్ టైమ్ గరిష్ఠస్థాయి 11,856కు కొద్ది దూరంలోనే ఉంది. ఒక రోజులో లాభాల విషయంలో నిఫ్టీ పదేళ్లలో అత్యుత్తమంగా రాణించింది. మోడీ మళ్లీ గెలుస్తాడని మార్కెట్లు జోరందుకున్నాయి. కానీ మే 23వ తేదీ తర్వాత గెలిచాక కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, ఆ తర్వాత కొంత స్థిరీకరణ ఉంటుందని భావిస్తున్నారు.
భారీగా పెరిగిన ఈ మూడు కంపెనీల షేర్ల ధరలు
ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేకు అనుకూలంగా ఉండటంతో మార్కెట్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మార్కెట్ల జోరు కనిపించింది. 2014 మే 26న మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పలు షేర్లు భారీ లాభాలను ఆర్జించాయి. బీఎస్ఈలో సుమారు 800 షేర్లు రెండింతలు అయ్యాయి. గత అయిదేళ్లలో పలు షేర్లు ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చి పెట్టాయి. ఇందులో సాధనా నైట్రో కెమ్, టేస్టీ బైట్స్ ఈటబుల్స్, స్టైలమ్ ఇండస్ట్రీస్ వరుసగా 5,605, 3,392, 2,391 శాతం పెరిగింది. మే 26, 2014 నుంచి మే 17, 2019 మధ్య ఈ భారీ పెరుగుదల చోటు చేసుకుంది. మిండా ఇండస్ట్రీస్, ఒలెక్ట్రా గ్రీన్టెక్, బజాజ్ ఫైనాన్స్, కింగ్ఫా సైన్స్ అండ్ టెక్నాలజీస్, అపోలో పైప్స్, ఇండియా బుల్స్ వెంచర్ తదితర కంపెనీలు 1,000 శాతానికి పైగా పెరిగింది.
సాధనా నైట్రో కెమ్
నరేంద్ర మోడీ 2014లో ప్రమాణం చేసిన రోజు సాధనా నైట్రో కెమ్ షేర్ ధర రూ.4.20గా ఉంది. గత శుక్రవారం ముగింపు ధర ఏకంగా రూ.238.50. అంటే సుమారు 5,605 శాతం పెరిగింది. అయిదేళ్ల కిందట ఇందులో రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే సదరు ఇన్వెస్టర్కు ఇప్పుడు రూ.56 లక్షలు వచ్చినట్లు. టేస్టీ బైట్ ఈటబుల్స్ 2014లో రూ.240గా ఉండగా, ఇప్పుడు రూ.8,380గా ఉంది. ఇది 3,391 శాతం పెరిగింది. ఇక, మెడికామెన్ బయోటెక్ 4,631 శాతం, డ్యుకాన్ ఇన్ఫ్రా టెక్నాలజీస్ 4,400 శాతం, యునిప్లై ఇండస్ట్రీస్ 3,059 శాతం, ఎస్పీవీ గ్లోబల్ వెంచర్స్ 2,531 శాతం, మంగళం ఆర్గానిక్స్ 2,529 శాతం, స్టైలామ్ ఇండస్ట్రీస్ 2,391 శాతం, యాక్స్టెల్ ఇండస్ట్రీస్ 2,148 శాతం, అసోసియేటెడ్ ఆల్కాహాల్స్ అండ్ బ్రీవరస్ 2,124 శాతం పెరిగి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించాయి.
1,000 నుంచి 2000 శాతం పెరుగుదల
బీఎస్ఈలో మిందా ఇండస్ట్రీస్, టాన్ఫాక్ ఇండస్ట్రీస్,శివాలిక్ బీమెటల్ కంట్రోల్స్, పద్మనాభ ఇండస్ట్రీస్, ఒలెక్ట్రా గ్రీన్టెక్, సుయోగ్ టెలిమేటిక్స్, ఎన్జీఎల్ పైన్ కెమ్ లిమిటెడ్, సాయ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆర్మా్న ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, పౌషక్ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా, యుకెన్ ఇండియా, హెస్టెర్ బయోసైన్సెస్, కేఈఐ ఇండస్ట్రీస్, సకుమా ఎక్స్పోర్ట్స్, వి2 రిటైల్ లిమిటెడ్, గోయల్ అసోసియేట్స్, వికాస్ ప్రొప్పంట్ అండ్ గ్రానైట్, పర్మనెంట్ మాగ్నెట్స్, డోలత్ ఇన్వెస్ట్మెంట్స్, ధరమ్సి మొరార్జీ కెమికల్స్ కంపెనీ, కింగ్ఫా సైన్స్ అండ్ టెక్నాలజీస్ వంటి సంస్థలు 1000 నుంచి 2000 శాతం మధ్య పెరిగాయి.
బజాజ్ ఫైనాన్స్ భారీ దూకుడు
సెన్సెక్స్లో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ భారీ లాభాల్లో దూసుకెళ్లింది. 2014 మే 26న రూ.202.10 వద్ద ఉన్న ఈ షేరు 2019 మే 17 నాటికి రూ.3,301.20కి చేరింది. 1,533.25 శాతం పెరిగింది. అంటే ఇన్వెస్టర్ రూ.లక్ష పెట్టుబడి పెడితే అయిదేళ్లలో అది రూ.15 లక్షలు అయినట్లు. కొటక్ మహింద్రా బ్యాంక్, హిందూస్తాన్ యూనివర్, హెచ్డీఎఫ్సీ, మారుతి సుజికీ ఇండియా, ఆసియన్ పేయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్ వంటి కంపెనీలు 100 నుంచి 238 శాతానికి పైగా పెరిగాయి. కాగా, టెలికం, లోహ, విద్యుత్ సూచీలు మాత్రం నష్టాల్లో ముగిశాయి. టెలికాం 27 శాతం, లోహ 16 శాతం, విద్యుత్ 16 శాతం చొప్పున క్షీణించాయి.