RCom దివాలా ప్రక్రియ ప్రారంభం, తదుపరి విచారణ మే 30న
నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) గురువారం అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్.కామ్) దివాలా అభ్యర్థనను అంగీకరించింది. ఆర్.కామ్ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. దివాలా ప్కర్యిలో 357రోజుల (మే 30, 2018 నంచి ఏప్రిల్ 30 2019) కాలానికి మినహాయింపు ఇవ్వాలని ఆర్.కామ్ కోరగా ట్రైబ్యునల్ ఓకే చెప్పింది.
ఆర్.కామ్ రుణాలు చెల్లించని పరిస్థితికి
ఎస్బీఐతో పాటు వివిధ బ్యాంకులకు ఆర్.కామ్ రూ.50వేల కోట్ల వరకు అప్పు ఉంది. ఆర్థిక ఇబ్బందులతో రుణాలు చెల్లించని పరిస్థితికి దిగజారింది. దీంతో దివాలా పెట్టేందుకు కంపెనీ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. గురువారం మరోసారి విచారణ జరిపిన ట్రైబ్యునల్ కంపెనీ దివాలా ప్రక్రియకు అనుమతి ఇచ్చింది. సంస్థ బోర్డును రద్దు చేసింది. కొత్త రిసొల్యూషన్ ప్రొఫెషనల్ను అపాయింట్ చేసింది. అంతేకాకుండా ఎస్బీఐ సహా 31 బ్యాంకుల కన్సార్టియంకు రుణదాతల కమిటీ ఏర్పాటుకు అనుమతిచ్చింది.
మినహాయింపు
దివాలా ప్రక్రియలో 357 రోజుల కాలానికి మినహాయింపు ఇవ్వాలని ఆర్.కామ్ కోరగా ట్రైబ్యునల్ అంగీకరించింది. ఇదివరకు దాఖలైన దివాలా పిటిషన్ పైన నేషనల్ కంపెనీ లా అప్పెలట్ ట్రైబ్యునల్, సుప్రీం కోర్టు స్టే విధించాయి. ఈ నేపథ్యంలో ఈ 357 రోజుల కాలానికి మినహాయింపు ఇవ్వాలని ఆర్.కామ్ కోరింది. ఇందుకు ట్రైబ్యునల్ ఒప్పుకుంది. ఈ కేసులో తదుపరి విచారణను మే 30 నాటికి వాయిదా వేసింది. అప్పటి లోగా కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని రిసొల్యూషన్ ప్రొఫెషనల్కు ఆదేశాలు జారీ చేసింది.
ఆర్థిక ఇబ్బందులు
ఆర్.కామ్ గత కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. రెండేళ్ల క్రితం కార్యకలాపాలు నిలిపేసింది. దీంతో ఆర్.కామ్ స్పెక్ట్రంను జియోకు విక్రయించేందుకు సిద్ధపడింది. కానీ వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అనుమతులు అందలేదు.