విజయ్ మాల్యాకు లండన్ కోర్టు భారీ షాక్, ఇప్పుడేం చేస్తారు?: బీజేపీకి బెనిఫిట్!
లండన్: విజయ్ మాల్యాకు యూకే హైకోర్టులో భారీ షాక్ తగిలింది. తనను భారత్కతు అప్పగించే విషయాన్ని ఆయన యూకే కోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు లిఖిత పూర్వక పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు సోమవారం దానిని కొట్టి వేసింది. విజయ్ మాల్యా పై-కోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశముంది. అయితే ఈ మొత్తం తంతు పూర్తి కావడానికి కనీసం ఆరువారాలు పట్టవచ్చు. గత ఏడాది డిసెంబర్ నెలలో మెజిస్ట్రేట్ కోర్టు మాల్యాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఆ కోర్టు జడ్జి మాల్యా కేసుపై తీర్పు చెబుతూ భారత బ్యాంకులకు మాల్యా సమాధానం చెప్పాల్సిందేనని పేర్కొన్నారు.
మనీలాండరింగ్ వివాదంలో రిలయన్స్?
మాల్యా రెన్యూవల్ చేసుకోవచ్చు
భారత్లోని పలు బ్యాంకుల్లో రూ.9,000 కోట్లు లోన్ తీసుకొని, ఇప్పుడు లండన్లో మాల్యా తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అతడిని భారత్ పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడి జాబితాలో చేర్చింది. అతనిని భారత్ రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అతడిని భారత్కు అప్పగించడానికి ఇంగ్లాండ్ హోంసెక్రటరీ సాజిద్ జావిద్ ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఆమోదం తెలిపారు. దీనికి వ్యతిరేకంగా వెస్ట్ మినిస్టర్ కోర్టులో విజయ్ మాల్యా పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ను జస్టిస్ విలియం డేవిస్ తిరస్కరించారని బ్రిటిష్ న్యాయశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. మాల్యా మరోసారి శుక్రవారం లోగా రెన్యూవల్ చేసుకోవచ్చు.
పూర్తిస్థాయి విచారణపై నిర్ణయిస్తారు
దీనిపై విజయ్ మాల్యా లాయర్ల బృందానికి, భారత ప్రభుత్వం తరఫున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసుకు తమ వాదం మరోసారి వినిపించేందుకు స్వల్ప సమయం కేటాయిస్తారు. ఇరువర్గాల వాదనల అనంతరం పూర్తి స్థాయి విచారణ అవసరమా లేదా అనే విషయాన్ని జడ్జి నిర్ణయిస్తారు. అక్కడ కూడా మాల్యా పిటిషన్ కొట్టివేస్తే ఇక అతనిని భారత్కు తీసుకువచ్చేందుకు మార్గం సుగమం అయినట్లే. 2016 మార్చి నుంచి మాల్యా లండన్లో ఉంటున్నాడు. 2017 సంవత్సరం ఏప్రిల్లో స్కాట్లాండ్ యార్డ్ జారీ చేసిన అప్పగింత వారెంట్పై ప్రస్తుతం బెయిల్లో ఉన్నాడు.
మాల్యాను అప్పగిస్తే రెండోవాడు అవుతాడు
మాల్యాకు వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. ఓ వైపు ఆస్తుల్ని దర్యాప్తు సంస్థలు జప్తు చేస్తున్నాయి. మరోవైపు కోర్టుల్లో పోరాడుతున్న మాల్యాకు వ్యతిరేక తీర్పులు వస్తున్నాయి. జైలుకు వెళ్లక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. లగ్జరీ జీవితం గడుపుతున్న మాల్యాను సాధారణ జీవితం గడపాలని ఇటీవలే కోర్టు ఆదేశించింది. లండన్లోని ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాలో ఉన్న సొమ్మును సీజ్ చేసేందుకు బ్యాంకులు యత్నించిన సమయంలో ఈ తీర్పు వచ్చింది. జైలు శిక్షకు బయపడి రుణాలను మొత్తం వడ్డీతోసహా చెల్లిస్తానన్నా బ్యాంకులు అంగీకరించడం లేదు. దీంతో మాల్యాకు ఉన్న చివరి ఆశ కూడా తాజా తీర్పుతో దాదాపు ఆవిరి అయింది. భారత్ - బ్రిటన్ మధ్య అప్పగింత ఒప్పందం 1992లో కుదరగా, 1993లో అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు సమీర్ భాయ్ వినూభాయ్ పటేల్ అనే వ్యక్తిని 2016లో భారత్కు అప్పగించారు. గోద్రా అల్లర్ల కేసులో విచారణ కోసం అతనిని బ్రిటన్ నుంచి భారత్ తీసుకు వచ్చారు. విజయ్ మాల్యా విషయంలో సక్సెస్ అయితే రెండో వ్యక్తిని అప్పగించినట్లవుతుంది.
బీజేపీకి లాభమా?
ఇదిలా ఉండగా, మాల్యాకు వరుస దెబ్బలు, ఇప్పుడు భారత్కు రప్పించే విషయంలో మరోసారి దెబ్బపడటం... సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీకి లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. యూపీఏ హయాంలో మాల్యా భారీ ఎత్తున లోన్లు తీసుకున్నాడు. ఆ తర్వాత పారిపోయాడు. మాల్యాను భారత్కు రప్పిస్తే ఆ క్రెడిట్ బీజేపీకి వెళ్తుందని భావిస్తున్నారు.