ఆర్బీఐ రేట్ కట్ సెంటిమెంట్!: లోకసభ ఎన్నికల్లో గెలుపుపై హిస్టరీ ఏం చెబుతోంది?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం రెపో రేటును పావు శాతం తగ్గించింది. ఎన్నికలకు ముందు రెపో రేటు తగ్గడం అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా శుభసూచకమేనా? గతంలో ఇలాంటి సందర్భంల్లో రేట్ కట్ జరిగినప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు తిరిగి అధికారంలోకి వచ్చాయా? ఇప్పుడు రేట్ కట్ బీజేపీ పార్టీకి లాభిస్తుందా? అంటే చరిత్ర అవుననే అంటుందోని చెబుతున్నారు.
ఇళ్లు, కార్లు కొనేవాళ్లకు గుడ్న్యూస్: మీ ఈఎంఐ తగ్గనుంది!
ఉదాహరణకు గత మూడు లోకసభ ఎన్నికలను పరిశీలిస్తే ఆర్బీఐ రేట్ కట్ తర్వాత ఆయా ప్రభుత్వాలు తిరిగి అధికారంలోకి వచ్చాయంటున్నారు. అదే సమయంలో రేట్ కట్ చేసిన సందర్భాల్లో ఆయా ప్రభుత్వాలు ఓడిపోయాయని చెబుతున్నారు. ఇప్పుడు నిన్న (ఏప్రిల్ 4 గురువారం) రెపో రేటు తగ్గించడం 2019 ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వానికి అడ్వాంటేజ్ కావొచ్చునని అభిప్రాయపడుతున్నారు.
రెపో రేటు తగ్గించడానికి, లోకసభ ఎన్నికలకి లింక్ ఉందా?
ఆర్బీఐ రెపో రేటును 25 బేసిక్ పాయింట్లు తగ్గించింది. ఇది కారు, వెహికిల్, పారిశ్రామిక లోన్లు తీసుకునే వారుకు ఊరట. వారి ఈఎంఐ తగ్గుతుంది. రెపో రేటు తగ్గించడం మోడీ ప్రభుత్వానికి ప్లస్ అవుతుందా? అసలు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి, లోకసభ ఎన్నికల ఫలితాలకు సంబంధం ఉందా? అంటే.. ఆర్బీఐ ప్రకటనకు, ఎన్నికలకు ఎక్కడా నేరుగా సంబంధం లేదు. కానీ గత ఎన్నికలను పరిశీలిస్తే ఇది ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని, ఇది రాజకీయ మూఢనమ్మకంగా భావించినప్పటికీ గత ఫలితాలను చూపిస్తున్నారని అంటున్నారు. పలు కారణాల వల్ల ఆర్బీఐ ఈ ఏడాది జనవరి నుంచి రెండోసారి రెపో రేటును తగ్గించింది. ఒక విధంగా ఇది మోడీ ప్రభుత్వానికి ఊరట అంటున్నారు. రెపో రేటు తగ్గించడం ఈఎంఐతో లోన్లు తీసుకునే వారుకి పెద్ద ఊరట. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఏడాదికి ఆరుసార్లు ద్రవ్య పరపతి విధాన్ని సమీక్షిస్తుంది. ఏప్రిల్, జూన్, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్, ఫిబ్రవరిలలో ఇది ఉంటుంది. అయితే ఏడాది మొత్తానికి ఏప్రిల్ నెల పాలసీని ప్రధానంగా భావిస్తారు.
ఆర్బీఐ పాలసీ - ఎన్నికల ఫలితాలకు లింక్?
గతంలోని డేటా ప్రకారం ఆర్బీఐ మనీ పాలసీకి, లోకసభ ఎన్నికలకు సంబంధం ఇలా ఉందని చెబుతున్నారు. 2014లో ఎన్నికలు ఏప్రిల్ 7వ తేదీ నుంచి మే 12వ తేదీ మధ్య జరిగాయి. మే 16వ తేదీన ఫలితాలు వచ్చాయి. 2014 ఏప్రిల్ 1వ తేదీన ఆర్బీఐ పాలసీ సమీక్ష జరిగింది. ఆ సమయంలో రఘురాం రాజన్ ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. రెపో రేటును అప్పుడు యథాతథంగా (8 శాతం) ఉంచారు. నేటి రేపో రేటు (6 శాతం)తో పోలిస్తే చాలా ఎక్కువ. అప్పుడు (2014) 4 శాతంగా ఉన్న క్యాష్ రిసర్వ్ రేషియో (సీఆర్ఆర్)ను కూడా మార్చలేదు. అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఘోర పరాజయం చవిచూసింది.
2009లో రెండోసారి యూపీఏ గెలుపు
2009లో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 16 - మే 13వ తేదీ మధ్య జరిగాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాన్ని ఏప్రిల్ 21న ప్రకటించింది. అప్పుడు డీ సుబ్బారావు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. 2009 ఎన్నికల సమయంలో రెపో రేటును 25 బేసిక్ పాయింట్లు తగ్గించారు. 5 శాతంగా ఉన్న సీఆర్ఆర్ను మాత్రం మార్చలేదు. అలాగే, ఓవర్సీస్ రెపో రేటును 3.5 శాతం నుంచి 3.25కి తగ్గించింది. అప్పుడు యూపీఏ రెండోసారి గెలిచింది. ఈ గెలుపుకు రైతుల రుణమాఫీయే ఎక్కువ కారణమని భావించారు.
2004లో ఓడిన బీజేపీ
2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో రెపో రేటు తగ్గించలేదు. అప్పుడు ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్య సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. మే 10వ తేదీన ఆర్బీఐ తొలి రివ్యూ పాలసీని ప్రకటించింది. అప్పుడు వైవీ రెడ్డి ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. అప్పుడు రెపో రేటు మార్చలేదు. బ్యాంకు రేటు 6 శాతాన్ని, రేపో రేటు 4.5 శాతాన్ని యథాతథంగా ఉంచారు. అప్పుడు వాజపేయి ప్రభుత్వం ఓడిపోయింది. 2004, 2014లో రెపో రేటు యథాతథంగా ఉంచారు. అప్పుడు ఆయా ప్రభుత్వాలు ఓడిపోయాయి. 2009లో రెపో రేటు తగ్గించారు. నాటి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆర్బీఐకి, ఎన్నికల ఫలితాలకు సంబంధం లేకున్నప్పటికీ దీంతో ఊరట చెందే వర్గాలు ఉంటాయి. ఆ లెక్కన మాత్రమే దీంతో పోల్చుతున్నారు.