ఉద్యోగుల తొలగింపు, రిటైర్మెంట్ ఏజ్పై బీఎస్ఎన్ఎల్ గుడ్న్యూస్: రంగంలోకి ప్రధాని కార్యాలయం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)లో 54వేల ఉద్యోగాలకు కోత విధించనున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై బీఎస్ఎన్ఎల్ చీఫ్ స్పందించారు. ఉద్యోగులను తొలగించడం లేదా రిటైర్మెంట్ ఏజ్ కట్ చేయడం లాంటి ఆలోచనలు లేవని చెప్పారు. బీఎస్ఎన్ఎల్లో 1.76 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. నష్టాల్లో ఉంది. దీంతో నష్టాన్ని భర్తీ చేసేందుకు రిటైర్మెంట్ వయస్సు రెండేళ్లు తగ్గించడం ద్వారా, వీఆర్ఎస్ కోరడం ద్వారా, 4జీ స్పెక్ట్రం వచ్చేలా చేసుకోవడం ద్వారా పూడ్చుకోవాలని భావించినట్లుగా వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ స్పందించింది. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాత్సవ ట్వీట్ చేశారు. రిటైర్మెంట్ ఏజ్ తగ్గించడం, వీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకోలేదని, మీడియాలో వస్తున్న అబద్దపు ప్రచారాన్ని ఖండిస్తున్నామని, ఉద్యోగులకు ఇఫ్పటికే ఆకర్షణీయ వీఆర్ఎస్ ఉందని పేర్కొన్నారు.

మీడియా వార్తలపై ఉద్యోగుల ఆందోళన
మీడియా వార్తలపై బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. వీఆర్ఎస్ను వ్యతిరేకించింది. సంస్థ పునరుద్ధరణకు 4జీ స్పెక్ట్రంను కేటాయించాలని డిమాండ్ చేసింది. సంస్థ వ్యాపారాభివృద్ధికి 4జీ సేవల అవసరం ఉందని, అందుకు అనువైన స్పెక్ట్రంను కేటాయించలేదని చెప్పారు. గత ఏడాదిలో టెలికం మంత్రి మనోజ్ సిన్హా బీఎస్ఎన్ఎల్కు 4జీ స్పెక్ట్రంను కేటాయిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఉద్యోగుల తొలగింపు, బలవంతంపు వీఆర్ఎస్ లేదని, అంతా అబద్దపు ప్రచారమని బీఎస్ఎన్ఎల్ చెబుతోంది.

ఉద్ధీపన పథకాలు
మరోవైపు, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లకు ఉద్దీపన పథకాలు ప్రకటించేందుకు పీఎంఓ సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలుస్తోంది. ప్రధానంగా ఈ సంస్థలు ఎదుర్కొంటున్న మూడు సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించారని సమాచారం. టెలికాం, ఆర్థిక శాఖల అధికారులు, నీతి ఆయోగ్తో రెండ్రోజుల కిందట పీఎంఓ అధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రెండు టెలికాం సంస్థలకు 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపు, వీఆర్ఎస్, సత్వరం ఆర్థికసాయం వంటి అంశాలపై చర్చించారు.

4జీ స్పెక్ట్రం, తక్షణ ఆర్థిక సాయం
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలను పునరుద్ధరించి, స్థిరంగా కొనసాగేలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, అందుకే ప్రధానమంత్రి కార్యాలయం సీనియర్ అధికారి, టెలికాం, ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్ అధికారులతో సమావేశమయ్యారని, టెలికాం సంస్థలకు ఎలాంటి ఉద్దీపన ప్రకటించాలో టెలికాం విభాగం రోడ్ మ్యాప్ రూపొందిస్తుందని చెబుతున్నారు. దీంతో నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పునరుద్ధరణకు సమగ్ర ప్రణాళికను వీలైనంత త్వరగా సమర్పించాలని టెలికాం శాఖను పీఎంవో కోరింది. ప్రధానంగా 4జీ స్పెక్ట్రం, తక్షణ ఆర్థిక సాయంపై దృష్టి సారిస్తున్నారని తెలుస్తోంది. ఉద్యోగుల తగ్గింపు ఉండదని భావిస్తున్నారు.

4జీ స్పెక్ట్రం కేటాయించాలని కోరుతున్న బీఎస్ఎన్ఎల్
టెలికాం సంస్థల్లో అతి తక్కువగా రుణం ఉన్న సంస్థ బీఎస్ఎన్ఎల్. దీనికి రూ.14,000 కోట్ల రుణం ఉంది. రూ.7వేల కోట్లను ప్రభుత్వ ఈక్విటీ వాటాగా చెల్లించి, దేశవ్యాప్తంగా 4జీ స్పెక్ట్రం కేటాయించాలని కోరుతుంది. స్పెక్ట్రం విలువ రూ.14,000 కోట్లు. అయితే బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లలో ఉద్యోగుల సంఖ్య ఎక్కువ. బీఎస్ఎన్ఎల్లో 1.76 వేలు, ఎంటీఎన్ఎల్లో 22వేల మంది ఉద్యోగులు ఉన్నారు.


Click it and Unblock the Notifications