3,600,000,000,000: రాహుల్ గాంధీ మినిమం ఇన్కం గ్యారంటీకి ఏటా ఎంత ఖర్చు, ఎలా సాధ్యం?
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. ఇటీవలి కాలంలో అన్ని పార్టీలు ప్రజలకు 'ఉచిత' పథకాలు ప్రవేశపెడుతూ ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.6వేలు ఇస్తామని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి కౌంటర్గా రాహుల్ గాంధీ కనీస ఆదాయ పథకాన్ని ప్రకటిస్తామని కొద్ది రోజుల క్రితమే చెప్పారు. సోమవారం విధివిధానాలు ప్రకటించారు.
పాకిస్తాన్-చైనా: ఎనిమీ షేర్ల విక్రయం ద్వారా ఖజానాకు రూ.11,300 కోట్లు, అసలు ఏమిటివి?
అన్ని గణాంకాలు చూసుకున్నాం
దేశంలోని పేదలకు కనీస ఆదాయ భరోసా పథకం అమలు చేస్తామని, భారత్లోని 20 శాతం మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని ఆయన తెలిపారు. అంటే అయిదు కోట్ల కుటుంబాల్లోని 25 కోట్ల మంది పేదలు దీని ప్రయోజనాలను పొందవచ్చునని చెప్పారు. వారి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో నేరుగా ఏడాదికి రూ.72,000 వేస్తామన్నారు. అంటే నెలకు రూ.6,000 చొప్పున ఇస్తామన్నారు. దీని కోసం అన్ని గణాంకాలను సరి చూసుకున్నామని, ఇటువంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా అమలు కావడం లేదన్నారు. 21వ శతాబ్దంలోనూ పేదరికం అధికంగా ఉందని, దానిపై తమ పార్టీ చివరి పోరాటం కొనసాగిస్తుందన్నారు.
ఏడాదికి రూ.3.60 లక్షల కోట్లు సాధ్యమేనా?
రాహుల్ గాంధీ కనీస ఆదాయ పథకం సాధ్యాసాధ్యాలను పక్కన పెడితే, ఆ లెక్కన ఎంత మొత్తం అవుతుందని లెక్కలు వేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి నెలకు రూ.6 వేల చొప్పున, ఏడాదికి రూ.72వేలు బ్యాంకు అకౌంట్లో వేస్తారు. దీనిని లెక్కిస్తే ఏడాదికి 3.60 లక్షల కోట్లు (3,600,000,000,000) అవుతుంది. రాహుల్ ప్రకటించిన ఈ పథకం భారత్ జీడీపీతో పోలిస్తే 2 శాతం. ఇలా చేస్తే భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదముందని అంటున్నారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకూడదనుకుంటే ఇతర సంక్షేమ కార్యక్రమాలను తగ్గించడం ద్వారా వనరులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
మోడీ పథకాలకు కేటాయించిన నిధుల కంటే ఎక్కువ
2019-20కి గాను ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా పక్కన పెట్టిన నిధుల మొత్తం కంటే కూడా రాహుల్ గాంధఈ ఈ పథకం కోసం చెప్పిన నిధులు (రూ.3.50 లక్షల కోట్లు) ఎంతో ఎక్కువ. రానున్న ఏడాది కోసం మోడీ ప్రభుత్వం రూ.3.27 లక్షల కోట్లు కేటాయించింది. కానీ కనీస ఆదాయ పథకంకు అంతకంటే ఎక్కువ నిధులు కావాలి.