రైతన్నలకు ఆర్బీఐ నజరానా..!
ముంబయి : మధ్యంతర బడ్జెట్ లో భాగంగా రైతులకు ఏటా 6వేల రూపాయలు ఆర్థికసాయం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ సైతం అన్నదాతలకు మరో వరం ప్రకటించింది. ఇప్పటివరకు ఎలాంటి హామీ లేకుండా ఇస్తున్న వ్యవసాయ రుణాల పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది. లక్ష రూపాయల రుణాన్ని లక్షా 60వేల రూపాయలకు పెంచుతున్నట్లు వెల్లడించింది.
2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 6వ ద్వైమాసిక మానిటరీ పాలసీ రివ్యూ నిర్ణయాలను ప్రకటించిన ఆర్బీఐ అధికారులు.. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేలా కొన్ని విధానాల్లో మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పారు. ద్రవ్యోల్బణంతో పాటు నానాటికీ పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలు అంచనాలోకి తీసుకుని రుణాల పరిమితి పెంపుపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు తాజా నిర్ణయం ఎంతో ఊరటనిస్తుందని వ్యాఖ్యానించారు.
వ్యవసాయ రుణాల పెంపుపై అన్ని బ్యాంకులకు త్వరలోనే ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇప్పటివరకు బ్యాంకులు ఇస్తున్న లక్ష రూపాయల రుణ పరిమితి నిర్ణయం 2010లో తీసుకుంది ఆర్బీఐ. అప్పటినుంచి లక్ష రూపాయల రుణం ఇస్తున్నాయి బ్యాంకులు. ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు దాన్ని లక్షా 60వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.