రైల్వే బడ్జెట్ 2019: ఈసారి రైల్వే టికెట్లపై పెంపు లేనట్టే..!
2019-20 మధ్యంతర బడ్జెట్లో రైల్వేస్కు రికార్డు స్థాయిలో 1.6 లక్షలు కేటాయించింది మోడీ సర్కార్. ఈ బడ్జెట్ క్రితం ఏడాది అంటే 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.48 లక్షల కోట్లుగా ఉంది. పార్లమెంటులో తొలిసారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పీయూష్ గోయల్, 2020 వరకు రూ.64,587 కోట్లు కేటాయింపులు జరిపారు. గతేడాది అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో... రైల్వేలకు కేటాయించిన బడ్జెట్లో అధికశాతం కెపాసిటీ విస్తరణకే వినియోగిస్తామని వెల్లడించారు. ఇక అప్పటి నుంచి రైల్వే రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉన్న 18వేల కిలోమీటర్ల రైల్వేలైన్లను రెట్టింపు చేస్తామన్నారు అరుణ్ జైట్లీ. అంతేకాదు మానవరహిత రైల్వే క్రాసింగ్లను ఎత్తివేస్తామని కూడా ప్రకటించడం జరిగింది.
గతేడాది ఇచ్చిన హామీ మేరకే రైల్వేలో దాదాపుగా మానవరహిత లెవెల్ క్రాసింగ్లను మూసివేసినట్లు మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది వందేభారత్ ఎక్స్ప్రెస్ను పట్టాలెక్కించనున్నామన్నారు. ఇది జరిగితే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని పీయూష్ గోయల్ తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ఇంజిన్ రహిత రైలును మనదేశంలోనే తయారు చేస్తామని తద్వారా ఉద్యోగాలు పెరుగుతాయని వెల్లడించారు.
2019-20 ఆర్థిక సంవత్సరంలో రైల్వే సేవలు మరింత విస్తరించాయని చెప్పిన మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తుతం 96.2శాతం వద్ద నిలిచాయని చెప్పారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఈ సేవలను 95శాతానికి పెంచాలనే లక్ష్యం నిర్దేశించుకున్నామని వెల్లడించారు. అంతేకాదు ఈ ఆర్థిక సంవత్సరం రైల్వేలో అత్యంత సురక్షిత ఏడాదిగా రికార్డు అయ్యిందన్నారు. అయితే మధ్యంతర బడ్జెట్లో రైల్వే ఛార్జీల పెంపుపై ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదు.