సింగిల్ డిజిట్ స్థాయికి ద్రవ్యోల్బణం.. బ్యాంకింగ్ రంగానికి పెద్దపీట : పీయూష్
ఢిల్లీ : ఆర్థిక వృద్ధి రేటులో దేశం దూసుకెళుతోందని ప్రకటించారు కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్. 11వ స్థానంలో ఉన్న భారత్.. ఇవాళ 6వ స్థానానికి చేరుకోవడంలో ప్రధాని నరేంద్ర మోడీ పాత్ర ఉందన్నారు. లోక్సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన గోయల్.. ఈ నాలుగున్నరేళ్లలో చాలా మార్పులు జరిగినట్లు చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని రెండంకెల స్థానం నుంచి సింగిల్ డిజిట్ కు తీసుకొచ్చామని తెలిపారు.
బ్యాంకింగ్ రంగంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టడంతో మెరుగైన ఫలితాలు సాధించడానికి వీలైందన్నారు. పారదర్శకతకు పెద్దపీట వేయడంలో భాగంగా బ్యాంకింగ్ రంగంలో కొత్త కొత్త సంస్కరణలు చేపట్టామని వివరించారు. ఆ మేరకు పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు గణనీయంగా తగ్గాయని చెప్పుకొచ్చారు. మోడీ పాలన కారణంగా ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగినట్లు చెప్పారు. బినామీ చట్టం తీసుకురావడం ద్వారా అక్రమాలను నిరోధించగలిగినట్లు చెప్పిన పీయూష్.. అవినీతి రహిత ప్రభుత్వంగా ముందుకెళుతున్నామని అన్నారు.