క్యాపిటల్ గెయిన్ పన్ను మినహాయింపు.. రెండో ఇంటికి వర్తింపు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టిన తాత్కాలిక బడ్జెట్లో రైతులకు, సామాన్యులకు, ఆదాయపన్నును రూ.5 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడం ద్వారా.. ఇలా ఎన్నో వరాలు కురిపించింది. ఆదాయపన్ను పరిమితి మినహాయింపు ద్వారా మూడు కోట్ల మందికి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పేద రైతులకు రూ.6వేలు ఇవ్వనున్నారు. దీని ద్వారా కనీవినీ ఎరుగని విధంగా 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
పిల్లల చదువు రీత్యా కుటుంబం ఒకచోట తాను మరోచోట ఉండే ఉద్యోగులకు భారీ ఊరట ఇచ్చారు. అటువంటి వారు రెండు చోట్ల ఇళ్లపై చెల్లించే అద్దెలకు మినహాయింపునకు క్లెయిమ్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఉద్యోగులు చెల్లించిన అద్దెకు పన్ను మినహాయింపును రూ.2.4లక్షలకు పెంచారు. మధ్యతరగతి, వేతన జీవులు గృహరుణాల చెల్లింపుల్లో రూ.2లక్షల వరకు పన్ను మినహాయింపును ఇచ్చారు..
ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54 కింద రెండు ఇళ్లపై పెట్టుబడులు పెట్టవచ్చు. దీనికి సంబంధించి రూ.2 కోట్ల వరకు మూలధన లబ్ధి (కేపిటల్స్ గెయిన్స్) నుంచి మినహాయింపు ఉంటుంది. జీవిత కాలంలో ఇది ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది. అలాగే పేదలకు ఇళ్ల పథకం కింద 2020లోపు రిజిస్టర్ చేసుకొన్న గృహ ప్రాజెక్టులకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది.
ఎవరికైనా మూడు ఇళ్లు ఉంటే, అందులో మొదటి రెండు ఇళ్లు ఖాళీగా ఉంటే.. అందులో ఒకదానిని సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద పరిగణిస్తారు. కేవలం మూడో ఇంటికి మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఒక్క ఇంటికే పరిమితమైంది.
ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు మొత్తం 1.53కోట్ల ఇళ్లు నిర్మించి ఇచ్చినట్లు తాత్కాలిక ఆర్థికశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 2025 నాటికి ప్రతీ ఒక్కరికీ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలకు 143 కోట్ల ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేశామన్నారు.
22 పంటలకు కనీస మద్దతు ధరను 1.5రెట్లు పెంచామన్నారు. పశుసంవర్థక, మత్స్యశాఖ రైతులకు రెండు శాతం వడ్డీ రాయితీ కల్పిస్తామన్నారు. తమ ప్రభుత్వం ఉజ్వల పథకం ద్వారా ఆరు కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చామన్నారు. ఈ ఏడాది వరకు ఎనిమిది కోట్ల కుటుంబాలకు కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.