దేశంలో 10 అతిపెద్ద మీడియా, బ్రాడ్కాస్టింగ్ కంపెనీలు
ఆర్థిక సరళీకరణల తర్వాత అన్ని రంగాల్లో పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఈ క్రమంలోనే దేశంలో మీడియా,వినోద రంగాలు శరవేగంగా వృద్ది చెందుతున్నాయి. ఒకప్పుడు సామాజిక బాధ్యతగా మొదలైన వార్త
ఆర్థిక సరళీకరణల తర్వాత అన్ని రంగాల్లో పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఈ క్రమంలోనే దేశంలో మీడియా,వినోద రంగాలు శరవేగంగా వృద్ది చెందుతున్నాయి. ఒకప్పుడు సామాజిక బాధ్యతగా మొదలైన వార్తా పత్రికలు, న్యూస్ చానెళ్లు ప్రస్తుతం ఒక వ్యాపారంగా మారిపోయాయి. కోట్లు పెట్టుబడులు పెట్టి మీడియాను ఒక పరిశ్రమగా నెలకొల్పారు. మీడియా, వినోద వ్యాపారంలో ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్లలో భారతదేశం కూడా ఒకటిగా నిలుస్తోంది. ప్రభుత్వ పరంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రోత్సాహం, శాటిలైట్ చానెళ్ల రాక, ఆఫ్టికల్ ఫైబర్ విస్తరణ వంటివి ప్రాథమిక సేవలు మెరుగుపడేందుకు దోహదపడగా, మార్కెట్ విస్తరణకు ప్రయివేటు పెట్టుబడులు ఎంతగానో దోహదపడ్డాయి. ఈ క్రమంలో దేశంలో అతిపెద్ద 10 మీడియా, బ్రాడ్కాస్టింగ్ సంస్థలుగా ఎదిగిన పది ప్రముఖ కంపెనీల గురించి తెలుసుకుందాం. గత ఆర్థిక సంవత్సరం లెక్కల ఆధారంగా రూపొందించిన జాబితా ఇది.
1. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్
జీ ఎంటర్టైన్మెంట్ దేశంలోనే అతిపెద్ద మీడియా, టెలివిజన్, వినోద కంపెనీల్లో అగ్రస్థానంలో ఉంది. ఈ సంస్థకు 167 దేశాల్లో 50 కోట్ల వీక్షకులు ఉన్నారు. జీటీవీ, జీ సినిమా, జీ ప్రీమియర్, జీ యాక్షన్, జీ క్లాసిక్, టెన్ స్పోర్ట్స్, టెన్ క్రికెట్, టెన్ యాక్షన్ ప్లస్, జీ కేఫ్; జీ ట్రెండ్జ్, జీ సలామ్, జీ జాగరన్, జింగ్ , ఈటీసీ మ్యూజిక్, ఈటీసీ పంజాబ్ వంటివి ఈ సంస్థకు చెందిన చానెళ్లు. 1998లో ఈ సంస్థ జీ సినీ అవార్డులను ప్రారంభించింది.
ఈ సంస్థ నికర లాభం 831.77 కోట్లు ఉండగా రెవెన్యూ 3426.18 కోట్లుగా ఉంది.
2. సన్ టీవీ నెట్వర్క్
దక్షిణ భారతదేశంలో మీడియా ప్రస్థానం సన్ టీవీతో మొదలైందని చెప్పవచ్చు. 1985లో దీని ప్రస్థానం మొదలైంది. 20 ప్రసిద్ద టీవీ చానెళ్లతో దేశంలోనే రెండో అతిపెద్ద టెలివిజన్ నెట్వర్క్గా ఇది చలామణీ అవుతోంది. ఈ నెట్వర్క్ ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా, దక్షిణాఫ్రికా, ఆసియా దేశాల్లో ఉంది. దక్షిణ భారతదేశానికి సంబంధించిన పలు భాషల్లో సినీ అవార్డులను ఇది అందజేస్తోంది. 2001లో ఇండియన్ టెలివిజనీ అకాడమీ అవార్డులను ఈ సంస్థ అందుకుంది. 2003లో ఈ సంస్థ రేడియో కార్యక్రమాలను సైతం ప్రారంభించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45కు పైగా ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లను కలిగి ఉంది.
ఈ సంస్థ నికర లాభం 737.23 కోట్లుండగా రెవెన్యూ 2243.62 కోట్లుగా ఉంది.
3. డీబీ కార్ప్ లిమిటెడ్
దైనిక్ భాస్కర్, దివ్య భాస్కర్, దైనిక్ దివ్య మరాఠి, బిజినెస్ భాస్కర్, డీబీ స్టార్, డీబీ గోల్డ్, డీఎన్ఏ వంటి ప్రముఖ పత్రికలను కలిగి ఉన్న సంస్థ డీబీ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ కంపెనీ 1995లో మల్టీ టెక్ ఎనర్జీ లిమిటెడ్గా మొదలైంది. వివిధ వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని అహా జిందగీ, బాల భాస్కర్, యంగ్ భాస్కర్ వంటి మేగజైన్లను ఇది ప్రారంభించింది. ఒక గంటకు 1.94 మిలియన్ కాపీలను ప్రింట్ చేయగల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద న్యూస్పేపర్ ఉత్పత్తి, పంపిణీ నెట్ వర్క్ను ఇది కలిగి ఉంది.
కంపెనీ నికర లాభం 316.98 కోట్లుండగా రెవెన్యూ 2009 కోట్లుగా ఉంది.
4. జాగరన్ ప్రకాశన్
1975లో జాగరన్ ప్రకాశన్ లిమిటెడ్(జేపీఎల్) మొదలైంది. ఇది ముఖ్యంగా వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, జర్నళ్లు, మీడియా సంబంధిత వ్యాపారంలో తమ విస్తరణను కలిగి ఉంది. 1997లో జాగరన్ తన వెబ్సైట్ను మొదలుపెట్టింది. యాహూ ఉమ్మడి భాగస్వామ్యంతో 2007లో హిందీ న్యూస్ చానల్ను, ఇంటర్నెట్లో కరెంట్ అపైర్స్ను ప్రారంభించింది. ప్రింట్ మాధ్యమంలో వ్యాపార విస్తరణ కోసం నెట్వర్క్18తో ఉమ్మడి భాగస్వామ్య సంస్థను సైతం ప్రారంబించింది.
కంపెనీ నికర లాభం 223.55 కోట్లుండగా రెవెన్యూ 1616.69 కోట్లుగా ఉంది.
5. ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్
1994లో ప్రైవేటు లిమిటెడ్గా మొదలైన ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ ఈరోస్ గ్రూపు సంస్థల్లో ఒకటి. దీనికి భారత్, యూకే, యూఎస్ఏ, సింగపూర్ దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. హోం ఎంటర్టైన్మెంట్, థియేటర్లు, టెలివిజన్, డిజిటల్ న్యూ మీడియా ద్వారా దీనికి మంచి రాబడి వస్తోంది. మొఘల్-ఈ-ఆజమ్, లగే రహో మున్నాభాయ్ వంటి విజయవంతమైన చిత్రాలతో సహా 1000కి పైగా సినిమా హక్కులను ఈ సంస్థ కలిగి ఉంది.
కంపెనీ నికర లాభం 124.19 కోట్లుండగా రెవెన్యూ 1071.70 కోట్లుగా ఉంది.
6. హెచ్టీ మీడియా
రోజువారీ సర్క్యులేషన్ పరంగా చూస్తే రెండో అతిపెద్ద ప్రింట్ మీడియా సంస్థ హిందుస్థాన్ టైమ్స్. హిందుస్థాన్ టైమ్స్ లిమిటెడ్లో హిందుస్థాన్ మీడియా వెంచర్స్ లిమిటెడ్, హెచ్టీ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ లిమిటెడ్, హెచ్టీ డిజిటల్ మీడియా హోల్డింగ్ లిమిటెడ్, హెచ్టీ గ్లోబల్ ఎడ్యేకేషన్, హెచ్టీ బర్దా మీడియా లిమిటెడ్, హెచ్టీ డిజిటల్ మీడియా హోల్డింగ్ లిమిటెడ్, ఈడీవరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్టీ మీడియా వంటివి ఉప సంస్థలుగా ఉన్నాయి.
రేడియో, ఆన్లైన్, ఈవెంట్, మొబైల్ మార్కెటింగ్లో సైతం వీరికి స్థానం ఉంది.
కంపెనీ నికర లాభం 113.67 కోట్లుగా ఉండగా రెవెన్యూ 1436.56 కోట్లుగా ఉంది.
7. ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్(ఇండియా) లిమిటెడ్ (ఈఎన్ఐఎల్)
దేశంలో ప్రముఖ ఎంటర్టైన్మెంట్, మీడియా కంపెనీల్లో ఇది కూడా ఒకటి. ఇది రేడియో బ్రాడ్కాస్టింగ్లో ఎక్కువగా తన ప్రభావాన్ని కలిగి ఉంది. రేడియో మిర్చి ఈ సంస్థకు చెందినదే. బెన్నెట్ కోల్మన్ అండ్ కంపెనీకి చెందిన టైమ్స్ గ్రూపు నుంచి టైమ్స్ ఇన్ఫోటైన్మెంట్ పేరుతో 1999లో ఈ కంపెనీ మొదలైంది. 2010 నాలుగో త్రైమాసికం లెక్కల ప్రకారం 4 కోట్లకు పైగా శ్రోతలు రేడియో మిర్చి వింటున్నారు. కంపెనీ 2014లో ఉన్న ఆదాయం కంటే 2015లో 27% మెరుగుదలను చూపింది.
నికర లాభం 105.97 కోట్లుండగా రెవెన్యూ 438.48 కోట్లుగా ఉంది.
8. టీవీ టుడే నెట్వర్క్
ఇంగ్లీష్, హిందీ భాషల్లో దేశంలో మరో ప్రముఖమైన సంస్థ టీవీ టుడే నెట్వర్క్(టీవీటీఎన్). 1999 డిసెంబరు 28న ఇది ప్రారంభమైంది. ఇండియా నుంచి హిందీ చానల్ను అప్లింక్ చేసిన సంస్థ ఇదే. మనకు బాగా తెలిసిన ఇండియా టుడే మ్యాగజైన్ పబ్లికేషన్ను వీరే చేస్తున్నారు. టీవీటీఎన్కు ఆజ్తక్(హిందీ), హెడ్లైన్స్ టుడే(ఆంగ్లం), తేజ్(హిందీ), బిజినెస్ టుడే(ఆంగ్లం), దిల్లీ ఆజ్ తక్(హిదీ) వంటి చానళ్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన రేడియో చానళ్ 104.8.
కంపెనీ నికర లాభం 81.03 కోట్లుండగా రెవెన్యూ 474.70 కోట్లుగా ఉంది.
9. టీవీ18 బ్రాడ్కాస్ట్ లిమిటెడ్
బ్రాడ్కాస్టింగ్, టెలికాస్టింగ్, రిలేయింగ్, వార్తా ప్రసారాలు కలిగిన సంస్థ టీవీ 18 గ్రూప్. సీఎన్ఎన్ ఐబీఎన్, ఐబీఎన్7 దీనికి చెందిన ప్రసిద్ద చానెళ్లు. కంపెనీకి ప్రధాన ఆదాయ వనరులు మీడియా, వినోదం. ఇదే కంపెనీకి ఐబీఎన్లైవ్.కామ్ వెబ్సైట్ ఉంది. టెలివిజన్, ఆన్లైన్ మీడియా, సినిమా వినోదం, డిజిటల్ వ్యాపారం, మ్యాగజైన్, మొబైల్ కంటెంట్, సంబంధిత వ్యాపారాల్లో ఇది తన విస్తరణను కలిగి ఉంది. గ్రూప్ చానెళ్లు సీఎన్బీసీ టీవీ18, సీఎన్బీసీ ఆవాజ్, సీఎన్బీసీ బజార్, వివిధ భాషల్లో ఈటీవీ చానళ్లు.
కంపెనీ నికర లాభం 14.63 కోట్లుండగా రెవెన్యూ 605.61 కోట్లుగా ఉంది
10. పీవీఆర్
మల్టిప్లెక్స్ థియేటర్ వ్యాపారంలో తనకంటూ ఒక పేరును సంపాదించుకున్న సంస్థ పీవీఆర్ లిమిటెడ్. 1995లో ఈ సంస్థ వ్యాపారాన్ని ప్రారంభించింది.
నికర లాభం 13.62 కోట్లుండగా మొత్తం రెవెన్యూ 1383.98 కోట్లుగా ఉంది.