2015-16లో భారత్లో 10 ఉత్తమ బ్రాండ్లు
కంపెనీల రెవెన్యూ, లాభాలు, భవిష్యత్తు కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని బ్రాండ్ ఫైనాన్స్ భారత్లో 10 ఉత్తమ బ్రాండ్లను ఎంపిక చేసింది. సర్వే ప్రకారం ఎయిర్టెల్ బ్రాండ్ విలువ 28 శాతం పెరగ్గా, మహీంద్రా గ్రూప్ బ్రాండ్ విలువ 37 శాతం పెరిగి 2.95 బిలియన్ డాలర్లకు చేరింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐడీయా సెల్యూలార్, అమూల్ ర్యాంకింగ్లో తమ స్థానాలను మెరుగుపరుచుకోగా; అదానీ ఎంటర్ప్రైజెస్ గతేడాది ఉన్న 26 వ స్థానం నుంచి 60 వ స్థానానికి దిగజారింది. అదే విధంగా సుజ్లాన్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, వోల్టాస్ సైతం తమ ర్యాంకుల్లో తగ్గుదలను కనబరిచాయి.
టాటా గ్రూప్
టాటా గ్రూప్ విలువలో గతేడాది కంటే 11 శాతం తగ్గుదల ఉన్నప్పటికీ ఈ గ్రూప్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఉక్కు పరిశ్రమలో ఒడిదుడుకులు, యూకేలో టాటాకు ఉన్న వ్యాపారాలపై వచ్చిన వార్తల మూలంగా విలువ తగ్గి ఉండొచ్చు. అయితే గతేడాది దీనికి AA రేటింగ్ లభించగా ఈ ఏడాది AA+ వచ్చింది.
కంపెనీ బ్రాండ్ విలు గతేడాది ఉన్న 15.3 బిలియన్ డాలర్ల నుంచి 13.7 బిలియన్ డాలర్లకు తగ్గింది.
ఎల్ఐసీ
2015-16 ఏడాదికి ఎల్ఐసీ రెండో స్థానంలో నిలిచింది. ఎల్ఐసీ బ్రాండు విలువ గతేడాది 4.1 బిలియన్ డాలర్లుండగా ఈ సంవత్సరం 6.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. కంపెనీ రేటింగ్ గతేడాది ఉన్న AA+ నుంచి AAకి చేరింది.
ఎయిర్టెల్
ఎయిర్టెల్ కంపెనీకి బ్రాండ్ ఫైనాన్స్ మూడో స్థానాన్నిచ్చింది. ఈ కంపెనీ విలును 5.7 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది. గతేడాది కంపెనీ విలువ 4.5 బిలియన్ డాలర్లుగా ఉంది. కంపెనీ రేటింగ్ AA+ నుంచి AAA- కి మారి మెరుగుపడింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. గతేడాది ఉన్న 2 వ స్థానం నుంచి దిగజారి 4 వ స్థానం దక్కించుకుంది. కంపెనీ బ్రాండు విలువ గతేడాది ఉన్న 6.5 బిలియన్ డాలర్ల నుంచి తగ్గి 5.7 బిలియన్ డాలర్లకు చేరింది. కంపెనీ రేటింగ్ AA+ వద్ద అలానే ఉంది. ఇది కాస్త ఊరటనిచ్చే విషయం
ఇన్ఫోసిస్
బ్రాండ్ విలువలో ఇన్ఫోసిస్ 9వ స్థానం నుంచి ఎగబాకి 5 వ స్థానం దక్కించుకుంది. కంపెనీ విలువ 3.4 బిలియన్ డాలర్ల నుంచి మెరుగుపడి 4.7 బిలియన్ డాలర్లుగా ఉంది. రేటింగ్ కూడా AA నుంచి AA+కి పెరిగింది
రిలయన్స్ ఇండస్ట్రీస్
రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్రాండు విలువ 3.6 బిలియన్ డాలర్ల నుంచి స్వల్పంగా తగ్గి 3.5 బిలియన్ డాలర్లకు చేరింది. కంపెనీ రేటింగ్ AA+ వద్ద అలానే ఉంది. కంపెనీ స్థానం గతేడాది ఉన్న 5 వ స్థానం నుంచి ఒక్క మెట్టు తగ్గి 6కు చేరింది.
ఓఎన్జీసీ
ప్రభుత్వ రంగ వ్యాపార సంస్థల్లో విదేశాల్లో తగిన ప్రాతినిధ్యం కలిగిన వాటిలో ఓఎన్జీసీ ఒకటి. దీని ప్రధాన కార్యాలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్లో ఉంది.
కంపెనీ ర్యాంక్ 10 వ స్థానం నుంచి బాగా బలపడి 7వ స్థానానికి చేరింది. బ్రాండ్ విలువ సైతం గతేడాది ఉన్న 2.8 బిలియన్ డాలర్ల నుంచి మెరుగుపడి 3.4 బిలియన్ డాలర్లకు చేరింది. రేటింగ్ సైతం AA నుంచి AA+కి పెరిగింది.
ఎల్ అండ్ టీ
నిర్మాణ రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటిస్తున్న సంస్థ ఇది. ఎల్ అండ్ టీ గతేడాదిలాగే 8వ స్థానంలో ఉంది. కంపెనీ విలువ 3.3 బిలియన్ డాలర్లుగా ఉంది. రేటింగ్ AA నుంచి AA+కి పెరిగింది.
ఇండియన్ ఆయిల్
ప్రభుత్వ రంగ చమురు, సహజ వాయు నిర్వహణ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీఎల్). కంపెనీ గతేడాది ర్యాంకును నిలబెట్టుకోలేక 9 వ స్థానానికి పడిపోయింది. కంపెనీ బ్రాండ్ విలువ 3.2 బిలియన్ డాలర్ల నుంచి 3.3 బిలియన్ డాలర్లకు పెరిగింది.
హెచ్సీఎల్ టెక్నాలజీస్
హెచీసీఎల్ టెక్నాలజీస్ సైతం గతేడాది ఉన్న 9 వ స్థానం నుంచి 10 వ స్థానానికి పడిపోయింది. కంపెనీ విలువ 3.2 బిలియన్ డాలర్లుగా ఉండగా రేటింగ్ AA+. గతేడాది ఈ సంస్థ విలువ 3.1 బిలియన్ డాలర్లుగా రేటింగ్ AA నమోదయ్యాయి.