కొత్త మలుపు: మాల్యాపై నివేదికను వెల్లడించండి, కుదరదన్న యూఎస్ఎల్
విజయ్ మాల్యా, యునైటెడ్ స్పిరిట్స్ వివాదం సరికొత్త మలుపు తిరిగింది. యునైటెడ్ స్పిరిట్స్(యూఎస్ఎల్) నుంచి నిధులను తనకు చెందిన యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) గ్రూప్నకు మళ్లించాడని తమ విచారణలో తేలిందని యునైటెడ్ స్పిరిట్స్(యూఎస్ఎల్)లో ఎక్కువ వాటాలను కలిగి ఉన్న డియాజియో పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ విషయానికి సంబంధించిన పూర్తి అంశాలతో కూడిన నివేదికను వెల్లడించాలని యునైటెడ్ స్పిరిట్స్(యూఎస్ఎల్)ను నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎస్ఎస్ఈ) కోరింది. అయితే, అది కంపెనీకి చెందిన సీక్రెట్ సమాచారమని, దానిని బయటకు వెళ్లడించడం కుదరదని యునైటెడ్ స్పిరిట్స్(యూఎస్ఎల్) బదులిచ్చింది.
ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం లేదా అధికారి సంస్ధలకు ఏమైనా నివేదిక ఇచ్చారా అని యునైటెడ్ స్పిరిట్స్(యూఎస్ఎల్)ను ఎన్ఎస్ఈ ప్రశ్నించింది. దీంతో తమ విచారణలో వెల్లడైన విషయాలు, ఏప్రిల్ 27న బోర్డు తీసుకున్న నిర్ణయాలను మాత్రమే వెల్లడించామని తెలిపింది.
ఎన్ఎస్ఈకి నివేదకి ఇవ్వలేమంటూ దానికి గల కారణాలను వెల్లడించింది. 'కంపెనీ బోర్డు సమావేశం కోసం రూపొందించుకున్న నివేదికలో వ్యాపారానికి సంబంధించిన అంశాలున్నాయి. సంస్ధ నిర్వహణ సమాచారం ఉంది. పలు కంపెనీలతో యూఎస్ఎల్కు ఉన్న సంబంధాలు, లావాదేవీలు ఇతర కంపెనీలకు తెలుస్తాయి' అని పేర్కొంది.
'వ్యాపార అంశాలను స్వార్ధపరమైన ప్రయోజనాల కోసం మరికొందరు వినియోగించుకునేందుకు వీలుంటుంది' అని ఎన్ఎస్ఈకి తేల్చి చెప్పింది. అంతే కాదు 2010 నుంచి 2013 మధ్యకాలంలో పలు లావాదేవీలకు చెందిన నిధులు యూబీ గ్రూపు సంస్థలకు మళ్లించినట్లుగా దర్యాప్తులో తేలింది.
యునైటెడ్ స్పిరిట్స్(యూఎస్ఎల్)లో అధిక వాటాను డియాజియో కొనుగోలు చేసినా, ఛైర్మన్, డైరెక్టర్గా విజయ్ మాల్యా కొనసాగుతున్నారు. అది నచ్చిన బోర్డు సభ్యులు ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో మాల్యాను ఛైర్మన్ పదవితో పాటు బోర్డు డైరెక్టర్గా తప్పుకోవాలని సూచించారు.
యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్(యూఎస్ఎల్) బోర్డు పదవి నుంచి తనను తీసివేసే అధికారం కేవలం షేర్ హోల్డర్లకు మాత్రమే ఉందని సంస్థ చైర్మన్ విజయ్ మాల్యా అంటున్నారు. తన పదవుల నుంచి తప్పుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.