త్వరలో: 'ఏ బ్యాంకు ఏటీఎం నుంచైనా నగదు జమ చేయవచ్చు'
ప్రస్తుతం ఏ బ్యాంక్ ఏటీఎం మెషిన్ నుంచైనా నగదు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఖాతాదారులకు ఉంది. అయితే నగదు డిపాజిట్ చేయాలంటే మాత్రం తమ ఖాతా ఉన్న ఏటీఎం మెషిన్ వద్దేకే వెళ్లాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఇకపై ఏ బ్యాంక్ ఖాతాదారైన, మరో బ్యాంక్ ఏటీఎంలో నగదు డిపాటిట్ చేసే సౌకర్యాన్ని త్వరలో తీసుకురానున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ హెచ్ఆర్. ఖాన్ తెలిపారు.
ఇందులో భాగంగా దేశంలోని వివిధ బ్యాంకులు తమ కస్టమర్ల సౌకర్యం కోసం అందుబాటులో ఉంచిన నగదు డిపాజిట్ మెషీన్లు అన్నింటిని నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్తో (ఎన్ఎఫ్ఎస్) అనుసంధానం చేయాలనే ప్రతిపాదన గురించి గురువారం ఆయన దేనా బ్యాంక్ ఇ స్మార్ట్ కార్యక్రమంలో తెలిపారు. ఇలా చేయడం వల్ల ఏ బ్యాంకులోనైనా నగదు డిపాజిట్ మెషిన్లో నగదు డిపాజిట్ చేస్తే మీ ఖాతాను కలిగిన ఉన్న బ్యాంకులో జమ అవుతుంది.
ఇప్పటికే దేశంలోని ఎటిఎంలన్నీ నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్తో అను సంధానం అయ్యాయన్నారు. ప్రస్తుతం బ్యాంకర్ల మధ్య వివాదంగా ఉన్న ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజు గురించి, బ్యాంకులే నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించిందన్నారు. సాంకేతికత, కొత్త విధానం అనేది వినియోగదారులకు లాభదాయకంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు.
ఇక బ్యాంకు ఖాతాలపై సైబర్ దాడులు పెరిగిపోతు్న నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీపై ఆర్బీఐ ప్రత్యేకించి శ్రధ్ధ తీసుకుంటుందన్నారు. ఈ విషయమై దేశంలోని అన్ని బ్యాంకులను అప్రమత్తం చేశామన్నారు. ఇటీవల కాలంలో వాట్స్ యాప్ ద్వారా బ్యాంకు ఖాతాల వివరాలు పరిశీలించుకోవ్చచంటూ విస్తృత ప్రచారంలోకి వచ్చిన యాప్పై స్పందిస్తూ అలాంటి అప్లికేషన్ ఏదీ ఆర్బీఐ డెవలప్ చేయలేదన్నారు. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్కు వచ్చిన బెదిరింపు ఈమెయిల్ వేసిన ప్రశ్నకు గాను ఆయన స్పందించడానికి నిరాకరించారు.