1.10లక్షల హెక్టార్ల భూమి రెడీ: విశాఖ పోర్ట్ సహా.. ఉద్యోగాలు, ఉపాధి కోసం కేంద్రం కీలక నిర్ణయం!
నౌకాశ్రయాల ఆధార పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. దేశంలోని పన్నెండు ప్రధాన నౌకాశ్రయాలకు అనుబంధంగా 1.10 లక్షల హెక్టార్ల భూమిని పరిశ్రమల అభివృద్ధి కోసం కేటాయించినట్లు కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి మన్సుఖ్ మందవీయ తెలిపారు. ఏ పరిశ్రమలో ఏ పోర్ట్ వద్ద నెలకొల్పితే బావుంటుందనే విషయమై అంచనాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు కార్గో నిర్వహణను పెంచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
వర్క్ ఫ్రమ్ హోం: బెంగళూరులో టెక్కీలు ఖాళీ, వీటికి భలే డిమాండ్
విశాఖ సహా 12 నౌకాశ్రయాలు
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంతో పాటు కాండ్లా, ముంబై, జేఎన్పీటీ, మార్మగోవా, న్యూమంగళూర్, కొచ్చి, కామరాజ్ (ఎన్నోర్), వీవో చిదంబరనర్, పారాదీప్, చెన్నై, కోల్కతా(హాల్దియా సహా) నౌకాశ్రయాల సమీపంలో ఈ పారిశ్రామివాడలను అభివద్ధి చేయాలనేది ప్రణాళిక. 'దేశంలోని ప్రధాన ఓడ రేవుల ప్రాంతాల్లో 1,10,000 హెక్టార్ల భూమి ఉంది. ఇందులో కొంత భాగం పరిశ్రమలు, పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగిస్తామ'ని కేంద్రమంత్రి తెలిపారు. ఆయా పోర్ట్లలో ఆయా పరిశ్రమల ఏర్పాటును గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
డబ్బు సంపాదన నా పని కాదు
ఇప్పటి వరకు ఓడరేవులకు చెందిన భూమిని అద్దె సంపాదనకు ఉపయోగించినట్లు తెలిపారు. ఈ భూమి ద్వారా డబ్బులు సంపాదించడం మన పని (ప్రభుత్వం) కాదని, అందుకే నేను దీనిని పరిశ్రమల అభివృద్ధి కోసం, తద్వారా ఉపాధి కల్పన కోసం, కార్గో పెంపు కోసం, దేశీయ ఉత్పత్తిని పెంచడం కోసం ఉపయోగిస్తామని కేంద్రమంత్రి చెప్పారు. మరికొన్ని భూములు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ విభాగాల లీజులో ఉన్నాయన్నారు.
బకాయిల చెల్లింపుకు వన్ టైమ్ సెటిల్మెంట్
ఈ భూములకు సంబంధించి రాని అద్దెలపై వడ్డీ, జరిమానా వడ్డీతో సహా వసూలు చేసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు. అద్దెలు, వడ్డీలు కూడా పెరిగాయని, దీనిని కూడా పరిష్కరిస్తామన్నారు. మేజర్ పోర్టుల్లో బకాయిపడిన మొత్తాలను రికవరీ చేసేందుకు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీంను ప్రవేశ పెట్టిందన్నారు.
కాగ్ నివేదిక.. ప్రభుత్వం ముందడుగు
ఆర్థికవృద్ధికి ఓడరేవుల అభివృద్ధి ఎంతో ముఖ్యమని కేంద్రమంత్రి మన్సుఖ్ తెలిపారు. మనకు 7,500 కిలో మీటర్ల తీర ప్రాంతం ఉందని, ఇది ఆర్థిక వృద్ధికి, ఉపాధికి ఇంధనంగా ఉపయోగపడుతుందన్నారు. జేఎన్పీటీ సెజ్ (రూ.12,554 కోట్లు), పారాదీప్ స్మార్ట్ ఇండస్ట్రియల్ పోర్ట్ సిటీస్-SIPCs (రూ.7,600 కోట్లు), కాండ్ల (రూ.11,147 కోట్లు)లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాగా, ప్రధాన ఓడ రేవుల ప్రాంతాల్లోని భూముల్లో దాదాపు సగం భూమిని వినియోగించుకోవడంలో విఫలమైనట్లు కాగ్ గతంలో ఓ నివేదికలో తెలిపింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం దీనిని అనుసరించి ఈ భూమిని పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థిక వృద్ధి, ఉపాధి తదితర అంశాలపై దృష్టి సారించింది.