ట్యాక్స్ వ్యవస్థను మరింత సరళీకరించాలి: నిర్మలా సీతారామన్
పన్నుకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపార సంస్థలకు సహకరించాలని ట్యాక్స్ ఆఫీసర్స్కు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఆయా అంశాల్లో చొరవ తీసుకొని వ్యవహరించాలన్నారు. జీఎస్టీ వ్యవస్థ అమల్లోకి వచ్చి మూడేళ్లైన సందర్భంగా పన్ను చెల్లింపుదారులకు వ్యవస్థను మరింత సరళతరం చేయాలన్నారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు సహకరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ సాకారం అయ్యేలా చూడాలని సూచించారు. అంతర్జాతీయంగా మన సంస్థలు పోటీపడేలా సహకరించాలన్నారు. పన్ను వ్యవస్థను సరళీకరించాల్సి ఉందన్నారు.
భారత్ దెబ్బ మామూలుగా లేదు, ఆ ఒక్క చైనా కంపెనీకే రూ.45,000 కోట్ల నష్టం
సరళీకృతం చేస్తున్నాం.. ఇంకా చేయాలి
ఇప్పటికే స్టేక్ హోల్డర్స్ నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా క్రమంగా పన్ను అంశాలను సరళీకృతం చేసినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇప్పటికే పలు సరళీకరణ విధానాలు అమలు చేశామని, అయినప్పటికీ ఇందుకు అనుగుణంగా మరిన్ని ప్రయత్నాలు అవసరమని ఆమె చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు పన్ను పరిపాలనను మరింత సరళం చేసేందుకు ఆర్థిక శాఖ ఎప్పటికి అప్పుడు కృషి చేస్తోందన్నారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు ముందుగానే గుర్తించి, వాటిని పరిష్కరించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పారు.
CBIC అధికారులకు అభినందన
జూలై 1న ఆర్థిక శాఖ జీఎస్టీ దినంగా పేర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఓ ప్రకటన విడుదల చేసింది. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి వచ్చే అడ్డంకులను అధిగమించేందుకు అలాగే, వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ మార్కెట్ నినాదాన్ని ముందుకు తీసుకు వెళ్లడంలో జీఎస్టీది కీలక పాత్ర అన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఇచ్చిన వివిధ వెసులుబాటుపై CBIC అధికారులను నిర్మలా సీతారామన్ అభినందించారు.
రిటర్న్ ప్రాసెసింగ్ మరింత వేగవంతం కావాలి
రిటర్న్ ఫైలింగ్ ప్రాసెస్ను మరింత సులభతరం చేయాల్సి ఉందని మరో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. రిటర్న్స్ ప్రాసెసింగ్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను వేగం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ సమయంలో CBIC అధికారుల కృషిని ఠాకూర్ ప్రశంసించారు. రిమోట్ యాక్సెస్ ద్వారా జీఎస్టీ రీఫండ్స్ ప్రాసెస్ చేయడానికి ఐటీ ప్లాట్ఫామ్స్ను మరింత సమర్థవంతంగా ఉపయోగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.