నగదు కొరత, ఈ రంగంలో కోట్లాది ఉద్యోగాలు పోయినట్లే! చైనా వస్తువులు వద్దంటే..
కరోనా మహమ్మారి కారణంగా వివిధ రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా భారత జీడీపీలో దాదాపు 30 శాతం కలిగిన ఎంఎస్ఎంఈలు కొన్ని డిమాండ్ లేక ఉత్పత్తి తగ్గి మూతబడే ప్రమాదకర పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా క్యాష్ షార్టేజ్ వీటికి మనుగడకే ముప్పుగా కనిపిస్తోంది. ఇప్పటికే డిమాండ్ తగ్గి ఉద్యోగాలు పోతున్నాయి. మరిన్ని మూతబడితే మరిన్ని ఉద్యోగాలు పోవడంతో పాటు ఎన్పీఏలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది.
కారు లోన్, కస్టమర్లకు జీపీఎస్ షాక్: ఆరుగురు ఉద్యోగుల్ని తొలగించిన హెచ్డీఎఫ్సీ
కోట్లాది ఉద్యోగాలు పోయాయి
ఓ సర్వే ప్రకారం జూన్ చివరి నాటికి ఎంఎస్ఎంఈ రంగంలో దాదాపు 2.5 కోట్ల నుండి 3 కోట్ల మేరకు ఉద్యోగాలు కోల్పోయినట్లుగా అంచనాలు ఉన్నాయి. డిమాండ్ లేమి కారణంగా ఎంఎస్ఎంఈలు ఇబ్బందుల్లో ఉన్నందున త్వరలో మరో కోటి నుండి కోటిన్నర మందికి పింక్ స్లిప్స్ ఇచ్చే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో నిధుల లేమి కారణంగా తాము నిలదొక్కుకునే పరిస్థితులు లేవని 61 శాతం ఎంఎస్ఎంఈలు ఓ సర్వేలో ఆందోళన వ్యక్తం చేశాయి. ఆగస్ట్తో లోన్ మారటోరియం ముగిసినందున సెప్టెంబర్ నుండి చెల్లించే పరిస్థితులు కూడా లేవంటున్నారు.
చైనా దిగుమతులు తగ్గిస్తే తమకు ఎలాంటి ప్రయోజనం లేదు
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన 59 యాప్స్ను కేంద్రం నిషేధించింది. అంతేకాదు, చాలా వ్యాపారాలు, వివిధ రంగాలు చైనా నుండి దిగుమతులను తగ్గించాలని నిర్ణయించాయి.. భావిస్తున్నాయి. అయితే చైనా నుండి దిగుమతులు తగ్గించడం తమ వ్యాపారాలకు లాభం చేకూర్చదని 42 శాతం ఎంఎస్ఎంఈలు ఓ సర్వేలో అభిప్రాయపడ్డాయి. హఠాత్తుగా తగ్గించడం వల్ల మనకే నష్టమని, ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత దిగుమతులు తగ్గించాలని ఇప్పటికే ఆయా రంగాల నిపుణులు సూచిస్తున్నారు. ఆసక్తికర విషయం ఏమంటే చైనా నుండి దిగుమతులు తగ్గించాలన్న వాదనకు ఎక్కువమంది ఎంఎస్ఎంఈలు మద్దతు పలికారు. అయితే చైనా నుండి దిగుమతులు తగ్గింపు తమ వ్యాపారానికి సహాయకారి కాదని 42 శాతం కంపెనీలు చెప్పాయి.
వేతనాలు తగ్గించాలని...
ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలుదారుల నుండి చెల్లింపులు ఆలస్యం కావడం కూడా ఎంఎస్ఎంఈ లకు నగదు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జూన్ నెలలో చేసిన ఓ సర్వే ప్రకారం దాదాపు 37 శాతం కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం వరకు తగ్గించే పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి. ఏప్రిల్ నెలలో ఈ పరిస్థితి మరింత దారుణంగా కనిపించింది. 42 శాతం కంపెనీలు వేతనాలను సగానికి తగ్గించాలని అభిప్రాయపడ్డారు. ఏప్రిల్తో పోలిస్తే జూన్ నెలలో కాస్త బెట్టర్గా ఉంది. వ్యాపారాలు తిరిగి తెరుచుకుంటున్నాయని, ఈ రంగంలో కనీస నియామకాలు ఇప్పుడిప్పుడు కనిపిస్తున్నాయని, అయినప్పటికీ ఇప్పటికీ ఒత్తిళ్లో ఉన్నట్లు చెబుతున్నారు.
ఆత్మనిర్భర్ భారత్ కొంత ఊరట.. కానీ
తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఈ రంగానికి ఆత్మనిర్భర్ భారత్ ద్వారా రూ.3 లక్షల కోట్లకు పైగా రుణాలు, ఇతర సహకారం, లోన్ మారటోరియం వెసులుబాటు కొంతలో కొంత ప్రయోజనకరమని, ద్రవ్యలోటుతో ఇబ్బంది పడుతున్న ఈ కంపెనీలకు కొంతమేర తీర్చాయని చెబుతున్నారు. అయితే ఎంఎస్ఎంఈలకు కేంద్రం ప్రకటించిన రూ.3 లక్షల కోట్ల ప్యాకేజీ ఈ రంగానికి అవసరమైన దానిలో కేవలం 19 శాతం వాటా మాత్రమేనని ఓ సర్వేలో తేలింది. అంటే ప్రభుత్వం నుండి మరింత భారీ సహకారం అవసరం. ఈ రంగంలో ఎన్పీఏలు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
లోన్ మారటోరియం పొడిగించాలి
లోన్ మారటోరియం ఆగస్ట్తో ముగుస్తుందని, సెప్టెంబర్ నుండి వీటిని చెల్లించే పరిస్థితుల్లో లేమని 61 శాతం ఎంఎస్ఎంఈలు చెప్పగా, మరో 6 నెలలు పొడిగించాలని 37 శాతం కంపెనీలు విజ్ఞప్తి చేశాయి. గత నెలలో 32 శాతం ఎంఎస్ఎంఈలు ఏడాది పాటు పొడిగించాలని కోరారు. అలాగే, కార్పోరేట్, ప్రభుత్వ చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జూన్లో చేసిన సర్వేలో తాము 90 రోజుల నుండి 180 రోజుల సరఫరాకు పేమెంట్స్ అందుకున్నామని 35 శాతం ఎంఎస్ఎంఈలు చెప్పగా, తమకు 180 రోజుల డ్యూస్ ఉన్నాయని 24 శాతం కంపెనీలు వెల్లడించాయి.