ఎంఎస్ఎంఈల రుణ భారం రూ. 5 లక్షల కోట్లు: నిర్మల ప్రకటనపై నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్(ఎంఎస్ఎంఈ)ల కోసం రూ. 3 లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మరో కేంద్రమంత్రి ఈ విషయంపై స్పందించారు. ఎంఎస్ఎంఈల రుణాలు ఇప్పటికే 5 లక్షల కోట్లు ఉన్నాయంటూ నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
భారీ ప్యాకేజీ ప్రకటించినప్పటికీ ఎంఎస్ఎంఈలు ఇంకా ఒత్తిడిలోనే ఉన్నాయంటూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. బకాయిల కుప్పలో కూర్చున్న వారిలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు, పెద్ద సంస్థలు ఉన్నాయన్నారు. కేంద్రం తనవంతుగా బకాయిలను ఎంఎస్ఎంఇలకు రూ .10,000 కోట్లకు తగ్గించిందన్నారు.
ఎంఎస్ఈఎంల రుణాలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం లేదని, అయితే, అది రూ. 5 లక్షల కోట్లపైనే ఉంటుందని నితిన్ తెలిపారు. ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ముందుకు వచ్చి ఉపశమన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికే కేంద్రం అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
కాగా ఎలాంటి పూచీకత్తు లేకుండానే రూ. 3 లక్షల కోట్లు రుణాలుగా ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసింది. దీంతో 45 లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుందని ఆమె తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి ప్రధాని మోడీ ప్రకటించిన రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు.
ఎంఎస్ఎంఈలకు రూ. 3 లక్షల కోట్ల రుణాలు ఎలాంటి పూచీకత్తు లేకుండా ఇస్తున్నామని, నాలుగేళ్ల కాలవ్యవధి, 12 నెలల మారటోరియంతో రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. తీవ్ర ఒత్తిళ్లలో ఉన్న ఎంఎస్ఎంఈలకు రూ. 20వేల కోట్ల సబార్డినేట్ రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో 2 లక్షల పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఎంఎస్ఎంఈ ఫండ్ క్రియేట్ చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.