కేంద్ర ప్రభుత్వం టార్గెట్, ఆ రంగంలోనే 5ఏళ్లలో 5కోట్ల ఉద్యోగాలు
భారత జీడీపీలో ఎంఎస్ఎంఈల సహకారాన్ని ప్రస్తుతం ఉన్న 30 శాతం నుండి 50 శాతానికి పెంచాలని, ఎగుమతులు ప్రస్తుతం ఉన్న 49 శాతం నుండి 60 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బుధవారం అన్నారు. ఎంఎస్ఎంఈలు, స్టార్టప్స్ కోసం నీతి ఆయోగ్ నిర్వహించిన ఆత్మనిర్భర్ భారత్ అరైస్ అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్ వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంఎస్ఎంఈ రంగంలో ఉద్యోగాలు కూడా పెరగాలని ఆయన ఆకాంక్షించారు.
భారత్, బ్రిటన్లలో తీవ్రమాంద్యం, వృద్ధిరేటు దారుణ పతనం
మరో 5 కోట్ల ఉద్యోగాలు
ఎంఎస్ఎంఈ రంగంలో ప్రస్తుతం 11 కోట్ల ఉద్యోగాలు ఉన్నాయని, రానున్న అయిదేళ్లలో మరో 5 కోట్ల ఉద్యోగాలను సృష్టించడమే ప్రభుత్వం లక్ష్యమని గడ్కరీ అన్నారు. అలాగే దేశ జీడీపీలో ఎంఎస్ఎంఈల వాటా ముప్పై శాతం నుండి యాభై శాతానికి, ఎగుమతులు 49 శాతం నుండి అరవై శాతానికి పెంచడంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. వినూత్న ఆలోచనలు, వ్యాపారవేత్తలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త వారికి ఎదిగే అవకాశం ఇవ్వాలని చెప్పారు.
కొత్త టెక్నాలజీని ప్రోత్సహించాలి
పలు విభాగాల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి కొత్త టెక్నాలజీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గడ్కరీ అన్నారు. ఈ సందర్భంగా ఇథనాల్ ఉత్పత్తికి ఉపయోగపడే అదనపు బియ్యం అంశాన్ని ప్రస్తావించారు. దీని వల్ల ఓ వైపు స్టోరేజ్ సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు గ్రీన్ ఫ్యూయల్ అందించడానికి ఉపయోగపడుతోందన్నారు. ఆవిష్కరణలలో రిస్క్ సామర్థ్యాన్ని ప్రోత్సహించడం, కొత్త పరిష్కారాలను కనుగొనడాన్ని ప్రోత్సహించాలన్నారు. ఇలాంటి సమయంలో బొనఫైడ్ మిస్టేక్స్ ఉంటే రక్షణ ఉండాలన్నారు.
15 రంగాల్లోని సవాళ్లపై దృష్టి
ఎంఎస్ఎంఈలు, స్టార్టప్స్ కోసం నీతి ఆయోగ్ నిర్వహించిన ఈ ఆత్మనిర్భర్ భారత్ అరైస్ అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్ వర్చువల్ భేటీలో 15 రంగాలలోని సవాళ్లపై దృష్టి పెట్టేందుకు ఇస్రో, నాలుగు మంత్రిత్వ శాఖలతో నీతి అయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ కలిసి పని చేయనుంది. మరోవైపు, రోడ్డు ప్రమాదాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రయివేట్ పార్ట్నర్ మోడల్ కింద ప్రయివేటు కన్సల్టెంట్ను నియమిస్తుందని గడ్కరీ మరో సందర్భంలో చెప్పారు. ఇంటెలిజెంట్ ట్రాపిక్ సమస్య పరిష్కారం కోసం పీపీపీ మోడల్ అవసరం ఉందన్నారు.