ప్రయాణీకులపై ఆర్టీసీ భారం! కి.మీ.కు ఎంత, ఎప్పటి నుంచి, ఏ సిటీ నుంచి ఎంత?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆర్టీసీ కార్మికులకు గురువారం శుభవార్త చెప్పారు. అదే సమయంలో బస్సుల్లో ప్రయాణించే వారికి చేదువార్త వినిపించారు. దాదాపు రెండు నెలలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. శుక్రవారం (29 నవంబర్) నుంచి ఎలాంటి షరతులు లేకుండా వారు విధుల్లో చేరవచ్చునని చెప్పారు. దీంతో ఆర్టీసీ కార్మికుల కథ సుఖాంతమైంది. అయితే సంస్థ మనుగడ కోసం బస్సు ఛార్జీలు పెంచుతున్నట్లు తెలిపారు.
జగన్ 'డబుల్' బొనాంజా: రేషన్ కార్డుకు ఆదాయ పరిమితి పెంపు
ఎంత పెరుగుతుంది... ఎప్పటి నుంచి అమలు?
ఆర్టీసీ మనుగడ కోసం ఛార్జీలు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. కిలో మీటరుకు 20 పైసల చొప్పున పెరగనుంది. వీటిని సోమవారం (డిసెంబర్ 2) నుంచి అమలు చేయనున్నారు. ప్రస్తుతానికి ఆర్టీసీకి తక్షణ సాయం కింద రూ.100 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారు. సంస్థలో రూ.13 కోట్లు ఉన్నాయి. జీతాలు చెల్లించేందుకు, ఇతర అవసరాల కోసం తక్షణ సాయంగా రూ.100 కోట్లు ఇవ్వనున్నారు.
పెంపు ద్వారా రూ.760 కోట్ల ఆదాయం
ఛార్జీల పెంపుదల ద్వారా రూ.752 కోట్ల నుంచి రూ.760 కోట్ల అదనపు ఆదాయాన్ని అంచనా వేస్తున్నారు. విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (TRS) అధికారంలోకి వచ్చాక ఛార్జీలు పెంచడం ఇది రెండోసారి. దాదాపు నాలుగేళ్ల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మరోసారి ఛార్జీలు పెంచుతోంది.
మొదటిసారి ఓకేరీతిన పెంపుదల...
ఆర్టీసీకి వస్తున్న నష్టాల్లో డీజిల్ ధరల పాత్ర కూడా ఉంది. రెండున్నరేళ్లుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కారణంగా ఆర్టీసీపై గణనీయ ప్రభావం పడుతోంది. ఇదివరకు ఛార్జీలు పెంచినప్పుడు శాతాల్లో పెంచేవారు. ఇప్పుడు అన్ని సర్వీసుల్లో ఒకే మొత్తంలో కిలో మీటరుకు 20 పైసలు పెంచుతున్నారు.
లెక్కలు వేశాకే...
ఆర్టీసీ అధికారులు ధరల పెంపుపై భారీ కసరత్తు చేశారు. కిలో మీటరుకు ఎంత చొప్పున పెరిగితే ఆర్టీసీకి ఎంత ప్రయోజనం అని లెక్కలు వేశారు. 20 పైసలు అయితే ఆదాయం వస్తుందని తేల్చారు. దీంతో అన్ని బస్సులకు ఇదే రీతిన పెంచాలని నిర్ణయించారు.
ఎలా పెరుగుతాయి..
సర్వీసుల వారీగా ప్రస్తుతం ప్రతి కిలో మీటరుకు కనీస ఛార్జీ ఇలా ఉంది...
వెన్నెల బస్సుల్లో కనీస చార్జీ రూ.2.54, గరుడ ప్లాస్ రూ.1.82, గరుడ రూ.1.71, రాజధాని రూ.1.46, వజ్ర రూ.1.61, సూపర్ లగ్జరీ రూ.1.16, డీలక్స్ రూ.0.98, ఎక్స్ప్రెస్ 0.87, పల్లె వెలుగు రూ.0.63గా ఉంది.
సిటీ సర్వీసుల్లో... మెట్రో ఏసీ లగ్జరీ రూ.2.65, మెట్రో డీలక్ రూ.0.90, మెట్రో ఎక్స్ప్రెస్ రూ.0.91, ఆర్డినరీ రూ.0.86గా ఉంది.
హైదరాబాద్ నుంచి ముఖ్య పట్టణాలకు ఎంత పెరుగుతుందంటే?
కిలో మీటరుకు 20 పైసల చొప్పున పెంచితే ముఖ్యమైన పట్టణాలకు కాస్త అటు ఇటుగా ధర ఎంత పెరుగుతుందంటే... ఉదాహరణకు గరుడ ప్లస్ బస్సులో పెరుగుదల...
- అదిలాబాద్ - 300 కిలో మీటర్లు - రూ.60 వరకు పెరగవచ్చు
- నిజామాబాద్ - 180 కిలో మీటర్లు - రూ.38 వరకు పెరగవచ్చు
- కరీంనగర్ - 160 కిలో మీటర్లు - రూ.32 వరకు పెరగవచ్చు
- వరంగల్ - 130 కిలో మీటర్లు - రూ.26 వరకు పెరగవచ్చు
- నల్గొండ - 100 కిలో మీటర్లు - రూ.20 వరకు పెరగవచ్చు
- మహబూబ్ నగర్ - 100 కిలో మీటర్లు - రూ.20 వరకు పెరగవచ్చు
- ఖమ్మం - 200 కిలో మీటర్లు - రూ.40 వరకు పెరగవచ్చు
- విజయవాడ - 265 కిలో మీటర్లు - రూ.53 వరకు పెరగవచ్చు
- బెంగళూరు - 550 కిలో మీటర్లు - రూ.110 వరకు పెరగవచ్చు
- విశాఖపట్నం - 620 కిలో మీటర్లు - రూ.124 వరకు పెరగవచ్చు.
కేంద్రం వాటా...
ఆర్టీసీలో కేంద్రం వాటా 31 శాతంగా ఉంది. 1950లో నాటి ప్రభుత్వం కేవలం రూ.50 ఇచ్చి వాటా తీసుకుంది. నాటి వ్యాల్యూ ప్రకారం ఆ మొత్తం ఇచ్చి వాటా తీసుకుంది. కేంద్రం వాటా 31 శాతం ఉంటడంతో రాష్ట్రానికి రావాల్సింది రూ.22వేల కోట్ల వరకు ఉండటం గమనార్హం.