14 నుండి రోజంతా RTGS సేవలు: లిమిట్స్, ఛార్జీ ఎంతంటే?
రూ.2 లక్షలు అంతకుమించి నగదు బదలీ చేసేందుకు ఉపయోగించే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్(RTGS) సేవలు డిసెంబర్ 14వ తేదీ నుండి రోజంతా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఓ ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 1వ తేదీ నుండి ఆర్టీజీఎస్ 24X7 సేవలు అందుబాటులోకి వస్తాయని భావించినప్పటికీ ఆలస్యమయింది. సోమవారం (14వ తేదీ) నుండి అమలులోకి రానున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
ఇప్పటి వరకు ఉదయం గం.7 నుండి సాయంత్రం గం.6 వరకు అందుబాటులో ఉంది. ఇప్పుడు నిత్యం అందుబాటులో ఉంటుంది. ఏడాది మొత్తం రోజులో ఎప్పుడైనా నగదు బదలీ చేసే వీలున్న దేశాల సరసన ఇప్పుడు భారత్ నిలుస్తుంది.
మారుతున్న బ్యాంకు రూల్స్, డిసెంబర్ 2020 నుండి RTGS
వారికి గుడ్ న్యూస్
ఇప్పటికే నెఫ్ట్, ఐఎంపీఎస్ ద్వారా రోజంతా ట్రాన్సాక్షన్స్ చేసే వెసులుబాటు ఉంది. కానీ గరిష్టంగా రూ.2 లక్షలు మాత్రమే అకౌంట్ నుండి మరో అకౌంట్కు బదలీ చేయవచ్చు. వీటిని ఎక్కువగా రిటైల్ ఖాతాదారులు ఉపయోగిస్తారు. వ్యాపార సంస్థలు, రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తం ట్రాన్సాక్షన్ చేసేవారు RTGSను ఉపయోగిస్తారు.
24 గంటలు అందుబాటులోకి రావడం ఎంతోమందికి, ముఖ్యంగా వ్యాపారులకు గుడ్న్యూస్. ఆర్టీజీఎస్ 26 మార్చి 2004న 4 బ్యాంకుల్లో లాంచ్ చేశారు. ఇప్పుడు రోజుకు 6.35 లక్షల ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తున్నారు. వీటి వ్యాల్యూ రూ.4.17 లక్షల కోట్లు. 237 రుణసంస్థలు అందుబాటులో ఉంచాయి. నవంబర్లో ఆర్టీజీఎస్ సైజ్ రూ.57.96 లక్షల కోట్లు.
డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రోత్సహించేందుకు..
డిజిటల్ ట్రాన్సాక్షన్స్ను ప్రోత్సహించే ఉద్దేశ్యంలో భాగంగా నెఫ్ట్, ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్ మీద ఆర్బీఐ విధించే ఛార్జీలను గత ఏడాది జూలై నుండి రద్దు చేసింది. ఆర్టీజీఎస్ ద్వారా కనీస బదలీ రూ.2 లక్షలు కాగా, గరిష్ట పరిమితి లేదు. ఇప్పటి వరకు ఆర్టీజీఎస్ వల్ల ఉన్న ఇబ్బంది ఏమంటే కేవలం పని దినాల్లో, నిర్ణీత సమయంలో మాత్రమే ఉండటం. ఇప్పుడు రౌండ్ ది క్లాక్ పని చేయనుండటం గమనార్హం.
ఛార్జ్ ఇలా..
మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, బ్యాంకు బ్రాంచీని విజిట్ చేయడం ద్వారా ఆర్టీజీఎస్ను ఉపయోగించి మనీ ట్రాన్సుఫర్ చేసుకోవచ్చు. ఆర్టీజీఎస్ ట్రాన్సుఫర్ పైన విధించే ఛార్జీలను ఆర్బీఐ రద్దు చేసినప్పటికీ, ఆయా బ్యాంకులు సర్వీస్ ఛార్జీని వసూలు చేస్తాయి. రూ.2 లక్షల నుండి రూ.5 లక్షల వరకు ఫండ్ ట్రాన్సుఫర్ పైన బ్యాంకులు గరిష్టంగా రూ.24.50 వసూలు చేస్తాయి. రూ.5 లక్షలకు మించి ఫండ్ ట్రాన్సుఫర్ చేస్తే బ్యాంకులు గరిష్టంగా రూ.49.90 ఛార్జ్ చేస్తాయి. కస్టమర్లు దీనిపై జీఎస్టీ చెల్లించవలసి ఉంటుంది. రూ.2 లక్షలకు మించి ట్రాన్సుఫర్ కోసం ఆర్టీజీఎస్ కాగా, రూ.2 లక్షల లోపు నగదు బదలీకి నెఫ్ట్ను ఉపయోగిస్తారు.