గుడ్న్యూస్, కరోనా పాలసీలు వచ్చాయి: 2 పాలసీలు.. అర్హతలు, ప్రీమియం, మరిన్ని వివరాలు
ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారి వ్యాధి ఖర్చులు భరించేందుకు ఇన్సురెన్స్ రెగ్యులేటరీ IRDAI 29 బీమా కంపెనీలకు స్వల్పకాలిక కరోనా కవచ్ హెల్త్ ఇన్సురెన్స్ పాలసీలు ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతోన్న విషయం తెలిసిందే. కరోనా చికిత్స ఖర్చు ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో బీమా సంస్థలు కరోనా బీమా పాలసీలు ప్రారంభిస్తాయి.
హైదరాబాద్లో 74% తగ్గిన హోమ్సేల్స్, అక్కడ మాత్రం పెరిగాయి
29 సంస్థలు
IRDAI గ్రీన్ సిగ్నల్ నేపథ్యంలో స్వల్పకాలిక కరోనా కవచ్ హెల్త్ ఇన్సురెన్స్ పాలసీని 29 జనరల్, ఆరోగ్య బీమా సంస్థలు శుక్రవారం ప్రారంభించాయి. కరోనా పాలసీలను తీసుకు రావాల్సిన అవసరం ఉందని భావించిన రెగ్యులేటర్ ఇందుకు అనుగుణంగా రెండు బీమా పాలసీలను రూపొందించి నిబంధనలు విడుదల చేసింది. సాధారణ ఆరోగ్య కవచ్, కరోనా రక్షక్ పేర్లతో పాలసీలను జూలై 10వ తేదీలోగా తీసుకు రావాలని సూచించింది. ఇందుకు అనుగుణంగా హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్, మ్యాక్స్ బూపా, ఐసీఐసీఐ లాంబార్డ్, టాటా, భారతీ, ఓరియంటల్, బజాజ్, స్టార్ సహా 29 సంస్థలు పాలసీలతో ముందుకు వచ్చాయి.
ప్రీమియం ఎంత.. కాలపరిమితి
- ఎక్కువ సంస్థలు కరోనా కవచ్ పేరుతో పాలసీలను విడుదల చేశాయి.
- ఇప్పుడు పాలసీ తీసుకున్నప్పటికీ 15 రోజులు వేచి చూసిన తర్వాత పరిహారం చెల్లిస్తారు.
- కరోనా చికిత్స ఖర్చు బాధితులకు భారం కాకుండా పాలసీల్ని రూపొందించారు.
- ప్రీమియం శ్రేణి రూ.447 నుండి రూ.5,630 మధ్య ఉంది. జీఎస్టీ అదనం.
- ఈ పాలసీలు మూడున్నర నెలలు (105 రోజులు), ఆరున్నర నెలలు (195 రోజులు), తొమ్మిదిన్నర నెలలు (285 రోజులు) వ్యవధికి అందుబాటులో ఉన్నాయి. వ్యవధి తీరిన తర్వాత పునరుద్ధరణ ఉండదు
ఆన్లైన్ ద్వారా కొనుగోలు, అర్హతలు
- ఆన్లైన్ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. ఈ పాలసీల ప్రీమియం దేశవ్యాప్తంగా ఒకేలా ఉంటుంది.
- వ్యక్తుల వయసు, కాలపరిమితి ఆధారంగా ప్రీమియంలో మార్పులుంటాయి. ఉదాహరణకు 35 ఏళ్లలోపు వయసు ఉంటే మూడున్నర నెలలకుగాను రూ.50 వేల పాలసీని తీసుకుంటే ప్రీమియం రూ.447గా ఉంటుంది. అలాగే ఆసుపత్రి డెయిలీ క్యాష్ సదుపాయం కోసం ప్రీమియం రూ.3 నుంచి రూ.620గా ఉంటుంది.
- 18-65 ఏళ్ల వయస్సు వారు అర్హులు.
- వ్యక్తిగతంగా, కుటుంబం అంతటికీ వర్తించేలా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు ఉన్నాయి.
- ఫ్యామిలీ ఫ్లోటర్ ఎంచుకుంటే పాలసీదురుపై ఆధారపడిన 3 నెలల నుండి 25 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలను పాలసీలో చేర్పించవచ్చు.
- పాలసీలో చేరేందుకు ముందస్తు పరీక్షలు అవసరం లేదు.
- బీమా సంస్థలు ఏవైనా కరోనా రక్షక్, కరోనా కవచ్ పాలసీలు ఒకేలా ఉంటాయి.
- సంస్థలు తమ ఇష్టానుసారం ప్రీమియం నిర్ణయించుకోవచ్చు. పాలసీదారు వయస్సును బట్టి ప్రీమియం మారుతుంది.
కరోనా కవచ్ వివరాలు
- మూడున్నర నెలలు, ఆరున్నర నెలలు, తొమ్మిదిన్నర నెలల కాలవ్యవధితో ఈ పాలసీలను బీమా కంపెనీలు విక్రయిస్తాయి. కనీస బీమా రూ.50,000, గరిష్ఠ బీమా రూ.5లక్షలు(రూ.50 వేల చొప్పున) ఉంది. ఆప్షనల్ కవర్ను ఎంచుకోవచ్చు.
- ఆసుపత్రిలో చేరినప్పుడు పాలసీ విలువలో 0.5 శాతం చొప్పున 15 రోజుల పాటు చెల్లిస్తారు.
- ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకున్నప్పుడు ఎలాంటి మినహాయింపులు లేకుండా అన్ని రకాల ఫీజులు, ఖర్చులకు పరిహారం లభిస్తుంది.
- ఇంట్లో ఉండి చికిత్స చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తే దానికి అయిన ఖర్చును ఇన్సురెన్స్ సంస్థ చెల్లిస్తుంది. దీనికి ప్రతి రోజు వైద్య నివేదికలు, ఖర్చు వివరాలు సమర్పించాలి.
- ఎంపిక చేసిన ఆసుపత్రులు నుంచి చికిత్స పొందితే నగదు రహిత చికిత్సకు వెసులుబాటు ఉంది. లేదంటే సొంతగా బిల్లు చెల్లించి బీమా సంస్థ నుండి తిరిగి తీసుకోవాలి.
- గరిష్టంగా 14 రోజులు అనుమతిస్తారు.
- ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన వైద్య విధానాల్లో చికిత్స తీసుకున్నా పాలసీ ద్వారా పరిహారం పొందవచ్చు.
కరోనా రక్షక్
- ఈ బీమా పాలసీని సాధారణ బీమా సంస్థలతో పాటు జీవిత బీమా సంస్థలు అందించేందుకు IRDAI అనుమతించింది. దీనిని బెనిఫిట్ పాలసీ అంటారు. కరోనా పాజిటివ్ తేలితే ఈ పాలసీ మొత్తాన్ని కొన్ని నిబంధనలకు లోబడి చెల్లిస్తారు.
- కనీస బీమా రూ.50,000 నుండి రూ.2,50,000 వరకు
- కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యాక 72 గంటలకు మించి ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందితే ఈ పాలసీ విలువ మేరకు పరిహారం ఉంటుంది.
- ఎవరైనా వ్యక్తి రూ.2,50,000 పాలసీ తీసుకుంటే 72 గంటలు గడిచిన తర్వాత చికిత్స మొత్తంతో సంబంధం లేకుండాపాలసీ రూ.2,50,000 చెల్లిస్తుంది. ఆ తర్వాత పాలసీ రద్దవుతుంది.