మోడీ పాలన: ఆరేళ్లలో ఆదాయపు పన్ను మార్పులతో సామాన్యుడికి ప్రయోజనమిలా?
2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బడ్జెట్లో ఎన్నో మార్పులు చేశారు. బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 1వ తేదీకి మార్చారు. బడ్జెట్ పత్రాలను సూటుకేసులో తేవడం పక్కన పట్టి ఎర్రటి రంగులోని సంచిలో తీసుకు వస్తున్నారు. ఇలా ఎన్నో చేశారు. వీటన్నింటితో పాటు ఆదాయపు పన్నులో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి.
2014లో ఆదాయపు పన్నులో భారీ ఊరట
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిసారి అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో ఆదాయపు పన్ను మినహాయింపును రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచారు. సీనియర్ సిటిజన్లకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. 80 ఏళ్లు దాటిన వారికి రూ.5 లక్షలు చేశారు. ఇక సెక్షన్ 80సీ పరిధిని రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచారు. హోమ్ లోన్ వడ్డీపై ట్యాక్స్ ఎక్సెంప్షన్ను రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచారు.
నిన్న బంగారంపై పెరిగిన టారిఫ్, రేపు..: మోడీ టార్గెట్ అదేనా?
2015లో హెల్త్ ఇన్సురెన్స్ డిడక్షన్
2015 బడ్జెట్లో మోడీ ప్రభుత్వం ఆదాయపు పన్ను స్లాబ్లో ఎలాంటి మార్పు చేయలేదు. హెల్త్ ఇన్సురెన్స్ డిడక్షన్ను రూ.15వేల నుంచి రూ.25వేలకు పెంచారు. సీనియర్ సిటిజన్లకు రూ.20వేల నుంచి రూ.30 వేలు ఇచ్చారు. రవాణా అలవెన్స్ మినహాయింపును రూ.800 నుంచి రెండింతలు చేసి రూ.1,600గా చేశారు. రూ.1 కోటికి పైగా ఆదాయం ఉన్న వారిపై సర్ఛార్జీని 10 శాతం నుంచి 12 శాతానికి పెంచారు. సంపద పన్ను తొలగించి రూ.కోటి దాటితే 2 శాతం సర్ఛార్జ్ విధించారు. సెక్షన్ 80సీసీడీ కింద NPSకు మరో రూ.50,000 అదనపు మినహాయింపు ఇచ్చారు.
2016లో రిబేట్ పెంపు
2016లో బడ్జెట్లో సెక్షన్ 87ఏ కింద పన్ను రిబేట్ రూ.2,000 నుంచి రూ.5,000కు పెంచారు. ఆదాయం రూ.5 లక్షలకు మించని వారికి ఇది వర్తిస్తుందని బడ్జెట్లో పేర్కొన్నారు. సెక్షన్ 80జీజీ కింద చెల్లించే అద్దెను రూ.24వేల నుంచి రూ.60వేలకు పెంచారు. రూ.1 కోటి వార్షిక ఆదాయం దాటిన వారిపై మరోసారి సర్ఛార్జీని 15% నుంచి 12% పెంచారు. దీంతో పాటు రూ.10 లక్షలు దాటిన డివిడెండ్లపై 10% ఆదాయపు పన్ను వేశారు.
ఆదాయపు పన్ను శాతం తగ్గింపు
2017 బడ్జెట్లో రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయం ఉన్న వారికి పన్ను 10 శాతం నుంచి 5 శాతానికి మార్చారు. దీంతో రూ.12,500 లబ్ధి చేకూరింది. సెక్షన్ 87ఏ కింద పన్ను రిబేట్ రూ.5,000 నుంచి రూ.2,500 చేశారు. రూ.3.5 లక్షల ఆదాయం కలిగిన వారికి ఇది వర్తిస్తుంది. వార్షిక ఆదాయం రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి ఉంటే 10 శాతం సర్ఛార్జ్ విధించారు.
2018లో రూ.5,800 ప్రయోజనం
2018లో మెడికల్ రీయింబర్సుమెంట్స్, ట్రాన్సుపోర్ట్ అలవెన్స్ స్టాండర్డ్ డిడక్షన్ పరిధిని రూ.40వేలకు పెంచారు. దీంతో రూ.5,800 ప్రయోజనం చేకూరింది. సీనియర్ సిటిజన్ల ఆరోగ్య ఖర్చుల మినహాయింపును రూ.30వేల నుంచి రూ.50వేలకు పెంచారు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పొదుపు ద్వారా వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపు రూ.10వేల నుంచి రూ.50వేలకు పెంచి భారీ ఊరట కల్పించారు. ఆదాయపు పన్ను, కార్పోరేట్ ట్యాక్స్పై ఉన్న 3 శాతం విద్య సెస్ను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్గా 4 శాతం విధించారు. అన్నింటికి మించి దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్పై 10 శాతం పన్ను వేశారు.
పీయూష్ గోయల్ బడ్జెట్
2019లో సార్వత్రిక ఎన్నికలకు ముందు పీయూష్ గోయల్ బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. రూ.5 లక్షల వరకు ఆదాయానికి పన్ను రిబేట్ ప్రకటించారు. వేతన జీవులకు స్టాండర్డ్ డిక్షన్ను రూ.40వేల నుంచి రూ.50వేలకు పెంచారు. రూ.10వేల మినహాయింపు ఫలితంగా 30 శాతం ట్యాక్స్ బ్రాకెట్ ఇండివిడ్యువల్స్కు రూ.3,000 ఆదా అవుతుంది. 2019లో ఎన్నికల అనంతరం నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆదాయపు పన్ను స్లాబ్స్, రేట్లలో మార్పు లేదు.