31లోగా పాన్-ఆధార్ కార్డు లింక్ తప్పనిసరి, ఇలా చేయండి
పాన్ కార్డును, ఆధార్ కార్డును మార్చి 31 తేదీ లోపు లింక్ చేసుకోవడం తప్పనిసరి. ఈ గడువులోగా లింక్ చేయకుంటే రూ.1000 ఆలస్య రుసుము చెల్లించవలసి ఉంటుంది. ఈ మేరకు 2021 ఆర్థిక బిల్లులో ప్రభుత్వం కొత్త సెక్షన్ 234 హెచ్ను ప్రవేశపెట్టింది. పాన్-ఆధార్ లింకింగ్ గడువును కేంద్ర ప్రభుత్వం పలుమార్లు పొడిగించింది. ఇప్పటికే చాలాసార్లు పొడిగించినందున మరోసారి పొడిగించే అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి ఎవరైనా పాన్-ఆధార్ లింక్ చేయకుంటే ఈ 31వ తేదీ లోపు చేసుకోవాలి.
లింక్ చేయకుంటే చిక్కులు
ఏప్రిల్ 1వ తేదీ నుండి పాన్ కార్డు చెల్లకుంటే మరిన్ని సమస్యలు వస్తాయి. అప్పుడు ఆదాయపు పన్ను ఫైల్ చేయడం ఇబ్బందికరం. నాన్-కాంప్లియెన్స్కు అధిక ఫైన్ ఉంటుంది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఆధార్ నెంబర్ను తప్పనిసరిగా పేర్కొనవలసి ఉంటుంది. ఇన్-ఆపరేటివ్ పాన్ కార్డు కారణంగా అధిక టీడీఎస్ రేటును ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్యాక్స్ నిపుణులు చెబుతున్నారు. ఆదాయపు పన్ను శాఖ యాక్ట్ ప్రకారం పాన్ నెంబర్ ఇవ్వని లేదా పని చేయని పాన్ వివరాలను ఇచ్చే వ్యక్తికి అధిక టీడీఎస్ లేదా టీసీఎస్ వర్తిస్తుంది.
ఇలా లింక్ చేయండి
పాన్-ఆధార్ లింక్ చేయడానికి వివిధ మార్గాలు ఉన్నాయి.
ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ను తెరవాలి.
మొదటిసారి లాగిన్ అయినవారు రిజిస్టర్ చేసుకోవాలి.
మీ పాన్ నెంబర్ మీ యూజర్ ఐడీ అవుతుంది.
యూజర్ ఐడీ, పాస్వర్డ్, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ అవాలి.
ఆధార్-పాన్ లింక్ కోసం పాపప్ విండో ఓపెన్ అవుతుంది.
పాన్ కార్డులోని వివరాల ప్రకారం పేరు, పుట్టిన తేదీ తదితర సమాచారం కనిపిస్తుంది.
స్క్రీన్ పైన కనిపిస్తోన్న పాన్ కార్డు వివరాలను ఆధార్ కార్డులో పేర్కొన్న వివరాలతో ధృవీకరించుకోవాలి.
ఈ విషయాలలో ఏవైనా తేడాలు రెండింటిలో ఒకే విధంగా ఉండేలా సరి చేసుకోవాలి.
వివరాలు సరిపోలితే, మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి లింక్ నౌ బటన్ పైన క్లిక్ చేయాలి.
మీ ఆధార్, పాన్ కార్డుతో విజయవంతంగా లింక్ అయినట్లు పాపప్ విండోతో సందేశం వస్తుంది.
ఇలా కూడా లింక్ చేయవచ్చు
https://www.utiitsl.com/, https://www.egov-nsdl.co.in/ వెబ్ సైట్లకు లాగిన్ కావడం ద్వారా లింక్ చేసుకోవచ్చు.
ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ హోం పేజీలో కనిపించే లింక్ ఆధార్ పైన క్లిక్ చేసి కూడా పాన్-ఆధార్ లింక్ చేయవచ్చు.
మార్చి 31 తేదీ లోపు లింక్ చేయకుంటే రూ.1000 ఆలస్య రుసుము చెల్లించవలసి ఉంటుంది.