ప్లాస్టిక్ బదులు.. వెదురు నీళ్ల బాటిల్స్-పేడ సబ్బు, ధర ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రెండు రోజుల క్రితం మహాత్మా గాంధీ జయంతి రోజున ఆవు పేడతో తయారు చేసిన సబ్బులు, వెదురు బొంగు బాటిల్స్ను లాంచ్ చేశారు. రోజు రోజుకు ప్లాస్టిక్ వినియోగం ఎక్కువవుతూ పర్యావరణ కాలుష్యానికి కారణం అవుతోంది. ఈ నేపథ్యంలో సంప్రదాయ ఉత్పత్తులకు ఆధునికతను జోడించి ప్రజలను జాగృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సబ్బులు, బాటిల్స్ తీసుకు వచ్చింది.
ఆ బ్యాంకులతో జాగ్రత్త, ముందుగా ఇవి తెలుసుకోండి!
ఇక ప్లాస్టిక్కు నో
సింగిల్ యూజ్ అంటే ఒక్కసారి మాత్రమే వాడగలిగే ప్లాస్టిక్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ప్లాస్టిక్ బ్యాంకులు, కప్పులు, ప్లేట్లు, చిన్న బాటిల్స్, స్ట్రా వంటివి ఇక నుంచి ఇత్పత్తు చేయరాదు. వాటిని ఉపయోగించరాదు. నిల్వ చేయరాదు. పర్యావరణ పరిరక్షణ కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ప్లాస్టిక్కు బదులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది.
వెదురు బాటిళ్లతో ప్రయోజనాలెన్నో..
సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల శాఖ (MSME) కింద పని చేసే ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (KVIC) వెదురు బాటిళ్లను తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి ఈ బాటిల్స్ను తయారు చేశారు. KVIC ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో బాటిల్స్ తయారు చేశారు. ప్రకృతిలో పెరిగే బొంగులతో పర్యావరణానికి ఎలాంటి హానీ ఉండదు. అంతేకాకుండా ఎక్కువ కాలం మన్నుతాయి.
వెదురు బాటిల్స్, గ్లాస్లు, పేడతో సబ్బులు, షాంపూలు...
ప్లాస్టిక్ బాటిల్స్ స్థానంలో వెదురు బాటిల్స్ వచ్చాయి. అలాగే KVIC ప్లాస్టిక్ గ్లాస్ల స్థానంలో మట్టి గ్లాసులు తయారు చేస్తోంది. కోటికి పైగా గ్లాసులను ఇప్పటికే సిద్ధం చేసింది. ఏడాది చివరికల్లా మూడు కోట్ల వెదురు బాటిల్స్ సిద్ధం చేయనుంది. అలాగే, ఆవు పేడతో తయారు చేసిన సబ్బులు, షాంపూలను ఖాదీ స్టోర్లలో విక్రయిస్తారు. ఇలాంటి వాటితో రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి పర్యావరణానికి మేలు జరగడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
750 మి.లీ. బాటిల్ రూ.300
750 మిల్లీ లీటర్ల వాటర్ బాటిల్ ధర రూ.300గా ఉంది. 900 మిల్లీ లీటర్ల వాటర్ బాటిల్ ధర రూ.560. 125 గ్రాముల సోప్ వేరియంట్ ధర రూ.125. ఇది ఖాదీ స్టోర్లలో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈ బాటిల్స్ తయారీకి త్రిపుర అడవుల వెదురును ఉపయోగిస్తున్నట్లు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ అధ్యక్షులు వినయ్ కుమార్ తెలిపారు. ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగడం ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని, కానీ వెదురు బాటిల్లోని నీరు సహజంగా ఉంటుందని, అలాగే వెదురు నీరు ఆరోగ్యానికి మంచిదన్నారు.
రూ.10,000 కోట్లకు పైగా టర్నోవర్..
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో 20 ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ అయ్యాయని, కాపిటల్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాయని, వీటిని ప్రోత్సహించేందుకు 10 శాతం ఈక్విటీని ప్రభుత్వం అందిస్తుందని గడ్కరీ చెప్పారు. KVIC రానున్న రెండేళ్లలో రూ.10,000 కోట్లకు పైగా టర్నోవర్కు చేరుకోవాలన్నారు. తద్వారా పెద్ద మొత్తంలో ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్..
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులు. ప్లాస్టిక్ సంచులు, కప్పులు, ప్లేట్స్, చిన్న సీసాలు, స్ట్రా వంటివి. వీటిని మళ్లీ ఉపయోగించలేం! వాటి ఉత్పత్తికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. కానీ కాలుష్యాన్ని పెంచుతుంది. అదే వెదురు సహజ ఉత్పత్తులు అయితే ఉపాధి పెరగడంతో పాటు కాలుష్యం తగ్గుతుంది. అలాగే, ఎక్కువ కాలం మన్నుతాయి.