ఏపీ గ్రామసచివాలయ ఉద్యోగాలు: పరీక్ష తేదీ, ఏ భాషలో ఏ ప్రశ్నాపత్రం..
అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగార్థుకు సెప్టెంబర్ 1, 8వ తేదీలలో రెండు విడతలలో రాత పరీక్ష ఉంటుంది. ఈ ఫలితాలను పదిహేను రోజుల్లో ప్రకటిస్తారు. వీటి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉద్యోగాల కోసం జూలై 26వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 1,28,728 పోస్టుల్ని భర్తీ చేస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
పరీక్షలు నిర్వహించే తేదీ... ప్రశ్నాపత్రాలు...
కేటగిరీ 1లోని అయిదు పోస్టులకు సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం, రెండు, మూడు కేటగిరీల్లోని పోస్టులకు మధ్యాహ్నం రాతపరీక్ష ఉంటుంది. కేటగిరీ 3లోనే వార్డు ప్రణాళిక-క్రమబద్దీకరణ కార్యదర్శి, పారిశుద్ధ్యం-పర్యావరణ కార్యదర్శి, సంక్షేమ-అభివృద్ధి కార్యదర్శి ఖాళీలకు 8వతేదీ ఉదయం పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శ్ ఖాళీలకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చి, కమాండ్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానం చేస్తున్నారు. పక్క పక్కన కూర్చునే అభ్యర్థులకు వేర్వేరు ప్రశ్నాపత్రాలు ఇవ్వనున్నారు. కేటగిరీ 1 ఉద్యోగాలకు తెలుగులో ప్రశ్నాపత్రాలు ఉంటాయి. మిగతా కేటగిరీల్లోని ఉద్యోగాలకు ఇంగ్లీష్లో ఉంటాయి.
రెండు రోజులు పరీక్షలు.. ఊరట
సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 8వ తేదీన రాతపరీక్షలు నిర్వహించడం.. రెండు రకాల పోస్టుల పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న ఒక అభ్యర్థికి ఊరట కల్పించేదే. తొలుత సెప్టెంబర్ 1న రాత పరీక్ష నిర్వహించాలని భావించారు. ఒకే అభ్యర్థి రెండు రకాల పోస్టుల పరీక్షలకు హాజరయ్యేలా ఆ రోజున ఉదయం, సాయంత్రం పరీక్షలు పెట్టాలని నిర్ణయించింది. అయితే కొందరు అర్హతలు ఉండి కొన్ని పోస్టులకు పరీక్ష రాయడానికి అవకాశం కోల్పోతారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో కొన్ని పోస్టులకు సెప్టెంబర్ 8వ తేదీన ఉదయం, సాయంత్రం పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు.
గడువులోగా దరఖాస్తు చేయండి...
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు గడువు ఈ నెల (ఆగస్ట్) 10వ తేదీ. ఆ రోజున అర్ధరాత్రి 11.59 నిమిషాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేవారు ముందుగానే అప్లై చేసుకోవడం మంచిది. ఎందుకంటే గడువు దగ్గరయ్యే కొద్ది ఎక్కువ మంది దరఖాస్తు చేస్తుంటారు. అప్పుడు పోర్టల్ స్లో అవుతుంది. కాబట్టి ముందుగానే దరఖాస్తు చేయడం మంచిది.
ఈ ఉద్యోగాల వైపే ఎక్కువగా మొగ్గు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో ఎక్కువగా కేటగిరీ 1 పోస్టులకే దరఖాస్తులు వస్తున్నాయి. దాదాపు పది లక్షల అప్లికేషన్స్ వస్తే ఇందులో 60 శాతం వరకు ఈ కేటగిరీ కిందనే దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత కేటగిరీ 3 పోస్టులకు స్పందన కనిపిస్తోంది. ఆ తర్వాతే కేటగిరీ 2కు స్పందన ఉంది.
ఏడేళ్లు చదివితే.. మహిళా అభ్యర్థులకు ఇలా..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు ప్రధానంగా స్థానికతను గుర్తుంచుకోవాలి. పదో తరగతి వరకు ఏడేళ్ల పాటు ఎక్కడ చదివితే అదే జిల్లా స్థానికతగా పరిగణలోకి తీసుకుంటారు. మహిళా అభ్యర్థులు అయితే పెళ్లై, అత్తవారింటికి వెళ్లిన జిల్లాను నాన్ లోకల్గా పరిగణిస్తారు. ఎంపికైన వారు గ్రామస్థాయిలోనే నివాసం ఉండాలి.
అనుమానాలు ఉంటే...
అభ్యర్థులకు ఏవైనా అనుమానాలు ఉంటే 040- 23310680, 23310726 నెంబర్లను సంప్రదించాలని పురపాలక పరిపాలన శాఖ కమిషనర్ ఓ తెలిపారు. పరీక్ష కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు.