అర్హత, పెన్షన్, రిజిస్ట్రేషన్: పీఎం కిసాన్ మాన్-ధన్ యోజన గురించి తెలుసుకోండి
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల కోసం పలు పథకాలు ప్రవేశపెడుతోంది. రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6వేలు ఇస్తోంది. ఎక్కువమంది చిన్న, మధ్యతరహా రైతులు ఉన్నారు. కాబట్టి ఇది ఎక్కువమందికి లబ్ధి చేకూరుస్తోంది. రూ.2వేల చొప్పున మూడు పర్యాయాలు ఏడాదికి రూ.6వేలు ఇస్తోంది. అలాగే, రైతులకు ప్రధానమంత్రి కిసాన్ మాన్-ధన్ యోజన (PM-KMY) పేరుతో పెన్షన్ పథకాన్ని కూడా తీసుకు వచ్చింది. ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ను శుక్రవారం ప్రారంభించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. మొదటి రోజు 418 మంది రైతులను ఈ పథకంలో చేర్చడం ద్వారా ప్రారంభించినట్లు చెప్పారు.
సరికొత్త SBI వెల్త్: అర్హతలు, ప్రయోజనాలు తెలుసుకోండి
రైతులు చెల్లించే సొమ్ముకు సమానంగా కేంద్రం జమ
మొదటి సంవత్సరంలో ఈ పెన్షన్ స్కీంలో 10 మిలియన్ల మంది రైతులు చేరుతారని కేంద్ర ప్రభుత్వం అంచనా. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ పథకాన్ని అమలు చేయడానికి రూ.10,774.50 కోట్లు కేటాయించింది. ఈ పథకంలో చేరిన రైతులకు 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ వస్తుందని తెలిపారు. 18-40 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన చిన్న, మధ్య తరగతి రైతులకు ఇది ఎంతో ప్రయోజనమన్నారు. రైతులు ఈ పథకంలో చేరినప్పుడు ఉన్న వయస్సు ఆధారంగా నెలకు రూ.55 నుంచి రూ.200 చెల్లించడం ద్వారా పెన్షన్ పొందవచ్చునని చెప్పారు. ఈ పెన్షన్ స్కీంను ఎల్ఐసీ నిర్వహిస్తుంది. రైతులు ప్రతి నెల చెల్లించే సొమ్ముకు సమానంగా కేంద్రం కూడా జమ చేస్తుంది.
భాగస్వామికి 50 శాతం పెన్షన్..
అయిదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు ఈ స్కీంలో చేరేందుకు అర్హులు. పద్దెనిమిదేళ్ల వయస్సు నుంచి నలభై ఏళ్ల లోపు రైతులు, వారి జీవిత భాగస్వాములు ఈ పథకంలో సభ్యులుగా చేరవచ్చు. వయస్సు ప్రాతిపదికగా రైతులు ప్రతినెల రూ.55 నుంచి రూ.200 చెల్లించాలి. సభ్యులు చెల్లించే మొత్తానికి సమానమైన డబ్బును కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. రైతుల వయస్సు 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ డబ్బుతో నెలనెలా రూ.3వేల రూపాయల పింఛన్ అందిస్తారు. సభ్యులుగా ఉన్న రైతులు 60 ఏళ్లు దాటిన తర్వాత మరణిస్తే అతని భార్యకు పింఛన్లో 50 శాతం సొమ్ము అందిస్తారు. రైతు, జీవిత భాగస్వామి లేదా నామినీ మరణిస్తే పేరుకుపోయిన మొత్తాన్ని పెన్షన్ ఫండ్కు జమ చేస్తారు.
మధ్యలో తప్పుకుంటే...
ఈ స్కీంలో చేరాక, అరవై ఏళ్లకు ముందే మరణిస్తే ఆ సభ్యులు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా భాగస్వామికి లేదా నామినీకిగాని ఇస్తారు. సేవింగ్ బ్యాంక్ రేట్స్ వడ్డీ రేటు కట్టి ఇస్తారు. అయిదేళ్ల వరకు క్రమం తప్పకుండా చెల్లిస్తేనే, పింఛన్ పథకం నుంచి తప్పుకుంటే వడ్డీతో సహా తిరిగి పొందవచ్చు. పెన్షన్ కావాలంటే 60 ఏళ్ల వరకు తమ వంతు వాటా చెల్లించాలి.
ఇలా పునరుద్ధరించుకోవచ్చు..
ఏదైనా కారణాల వల్ల తమ వాటాను మధ్యలో చెల్లించనట్లయితే, ఆ తర్వాత తన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలంటే అప్పటి వరకు బకాయిపడిన మొత్తాన్ని వారు నిర్ణయించిన వడ్డీతో కలిపి చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం రైతులకు మరో వెసులుబాటు కూడా కల్పించింది. రైతుకు బదులు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు వారి వాటాల్ని చెల్లించేందుకు కేంద్రం అనుమతించింది.
వీరు అనర్హులు
NPS (నేషనల్ పెన్షన్ స్కీం), ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్-ధన్ యోజన స్కీంల కింద లబ్ధి పొందుతున్నవారు అలాగే, రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు, లోకసభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, కౌన్సిల్ సభ్యులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, పంచాయతీల సర్పంచ్లు, ఆయా పదవులకు చెందిన మాజీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, ఆదాయపన్ను చెల్లింపుదారులు, వైద్యులు, ఇంజినీర్స్, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్స్ వంటి వృత్తుల్లో ఉన్నవారు ఈ పెన్షన్ పొందేందుకు అనర్హులు.
ఎక్కడ, వేటి ద్వారా నమోదు చేసుకోవాలి.
ప్రధానమంత్రి కిసాన్ మాన్-ధన్ యోజన పథకంలో చేరేందుకు కామన్ సర్వీస్ సెంటర్లను సంప్రదించాలి. తమ భూమి 2 హెక్టార్ల కంటే తక్కువ (5 ఏకరాలు లేదా అంతకంటే తక్కువ) అని ధృవీకరిస్తూ, ఇందుకు సంబంధించిన పత్రాలను తీసుకెళ్లాలి. ఆధార్, గ్రామం, ల్యాండ్కు సంబంధించిన వివరాలు ఇవ్వాలి.
పథకంలో చేరేందుకు రూ.30..
ఈ పథకంలో చేరేందుకు రూ.30 ఛార్జ్ ఉంటుంది. కామన్ సర్వీస్ సెంటర్లు (CSC)లు ఈ మొత్తాన్ని ఛార్జ్ చేస్తాయి. కానీ దీనిని కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ స్కీం పథకంలో చేరినవారు PM-KMY స్కీంలోను చేరాలనుకుంటే.. తమ అకౌంట్లో క్రెడిట్ అయిన మొత్తం నుంచి ఆటోమేటిక్గా కట్ అయ్యేలా అనుమతిస్తారు.