రూ.55 చెల్లిస్తే రూ.3,000 పెన్షన్!: ఈ స్కీంకు అర్హులెవరు, ఎలా చేరాలి, లాభాలేమిటి?
న్యూఢిల్లీ: దేశంలోని 3 కోట్ల మందికి పైగా రిటైలర్స్, ట్రేడర్స్కు లబ్ధి చేకూర్చే ప్రధానమంత్రి లఘు వ్యాపారి మాన్ ధాన్ యోజన పెన్షన్ పథకాన్ని కేంద్రమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ నేతృత్వంలోని కార్మిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకానికి ఈ పెన్షన్ పథకం పొడిగింపు స్కీం. ఈ పథకంలో చేరినవారికి, 60 ఏళ్లు దాటిన తర్వాత నెలవారీ పెన్షన్ రూ.3000 వస్తుంది.
PM కిసాన్ నిధి: ప్రతి రైతుకు లబ్ధితో పాటు వీరికి ప్రయోజనాలు.. ఇవీ
ఈ పథకానికి ఎవరు అర్హులు?
ఈ పథకం మే 31వ తేదీన కేంద్ర కేబినెట్ అప్రూవల్ పొందింది. రూ.1.5 కోట్ల లోపు టర్నోవర్ కలిగిన రిటైల్ ట్రేడర్స్, షాప్ కీపర్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ ఈ పథకంలో చేరవచ్చు. వయస్సు 18-40 మధ్య ఉండాలి. 2019-20 ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.750 కోట్లు కేటాయించింది.
ఈ పథకంలో ఎలా చేరవచ్చు
ఆసక్తి కలిగినవారు దేశంలోని 3.25 లక్షల కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా ఈ పథకంలో చేరవచ్చు. ప్రధానమంత్రి లఘు వ్యాపారి మాన్ ధన్ యోజన పథకం జూలై 22, 2019 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 3.25 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లలో ఆసక్తిగలవారు పేర్లు నమోదు చేసుకోవచ్చు.
ఈ పథకంలో ఎవరెవరు చేరవచ్చు
ఈ పథకం నిబంధనల ప్రకారం స్వయం ఉపాధి, దుకాణ యజమానులు, రిటైల్ వ్యాపారులు, రైస్ మిల్లు యజమానులు, ఆయిల్ మిల్లు యజమానులు, వర్క్ షాప్ యజమానులు, కమిషన్ ఏజెంట్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, చిన్న హోటళ్ల యజమానులు, హోటల్స్, రెస్టారెంట్ వంటి ఇతర లఘు వ్యాపారులు ఈ స్కీంలో చేరవచ్చు.
కేంద్రం ఏం చేస్తుంది?
ఈ పథకం కోసం ప్రభుత్వ పెన్షన్ ఫండ్ ఏర్పాటు చేస్తుంది. లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పెన్షన్ ఫండ్ మేనేజర్గా ఉంటుంది. పెన్షన్ ఫండ్, సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ, పెన్షన్ చెల్లింపులకు బాధ్యత వహిస్తుంది. వ్యాపారి చెల్లించే చందాకు సమానంగా కేంద్రం పింఛన్ నిధికి జమ చేస్తుంది.
ఎప్పుడు చేరితే ఎంత జమ చేయాలి?
ఈ పథకంలో చేరేందుకు కనిష్ట వయస్సు 18, గరిష్టం 40. ఏ వయస్సులో చేరినా 60 ఏళ్ల వరకు చెల్లించాలి. పద్దెనిమిది ఏళ్లలో చేరితే నెలకు రూ.55 చెల్లించాలి. 20 ఏళ్లకు చేరితే రూ.61, 25 ఏళ్లకు చేరితే రూ.80, 30 ఏళ్లకు చేరితే రూ.105, 35 ఏళ్లకు చేరితే రూ.150, 40 ఏళ్లకు చేరితే రూ.200 చొప్పున చెల్లించాలి.
ఈ స్కీం వల్ల లాభాలు ఏమిటో తెలుసుకోండి...
ఈ స్కీం కింద వ్యాపారి చెల్లించే నిధికి సమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని పింఛన్ నిధికి జమ చేస్తుంది. అరవై ఏళ్ల నుంచి నెలకు రూ.3వేల పింఛను ఇస్తుంది. మరణానంతరం జీవిత భాగస్వామికి 50% మొత్తం చెల్లిస్తారు. అంటే పెన్షన్దారుకు వచ్చేదాంట్లో సగం ఇస్తారు. కొన్నాళ్లు చెల్లించి మధ్యలో ఆపేసిన వారు, మళ్లీ కొనసాగించాలనుకుంటే పాతబకాయిలను, వడ్డీతో సహా చెల్లించి తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలి. ఈ స్కీంలో చేరిన అనంతరం పదేళ్ల లోపు వైదొలగాలనుకుంటే మీరు చెల్లించిన మొత్తాన్ని సేవింగ్స్ బ్యాంక్ ఖాతా వడ్డీ రేటుతో తిరిగిస్తారు. పదేళ్ల తర్వాత వైదొలిగితే పింఛన్ ఫండ్లో పొందిన వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తారు. ప్రతి నెల చెల్లిస్తూ మధ్యలో చనిపోతే ఆ స్థానంలో వారి జీవిత భాగస్వామిని సభ్యులుగా చేర్చవచ్చు. వారికి కూడా అరవై ఏళ్ల తర్వాత పెన్షన్ ప్రారంభమవుతుంది. జీవిత భాగస్వామి మృతి చెందాక.. ఈ పథకం నుంచి వైదొలగాలనుకుంటే చందా మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లిస్తారు. పథకంలో చేరాక వికలాంగులైనా ఇదే వర్తిస్తుంది. ఈ పథకంలోకి భార్య-భర్త మాత్రమే వస్తారు. NPS, ESI, EPF పరిధిలోకి వచ్చేవారు ఇందులో చేరేందుకు అర్హులు కాదు. 18-40 ఏళ్ళ మధ్య వయస్కులు ఈ పథకంలో చేరి, 60 ఏళ్లు వచ్చేవరకు చెల్లించాలి. అప్పుడే పెన్షన్ వస్తుంది.