1 ఏప్రిల్ 2021 నుంచి పెరగనున్న టర్మ్ ఇన్ష్యూరెన్స్ ప్లాన్ల ప్రీమియం - కారణమిదే..!
2021-22 ఆర్థి సంవత్సరం ప్రారంభం 1 ఏప్రిల్ నుంచి టర్మ్ ఇన్ష్యూరెన్స్ ప్రీమియం ధరలు పెరగనున్నాయి. ఇందుకు ప్రధాన కారణం కోవిడ్ కారణంగా పెరుగుతున్న మరణాల సంఖ్యే. అదే సమయంలో రీ ఇన్ష్యూరెన్స్ ధరలు కూడా పెరిగిన నేపథ్యంలో ప్రీమియం చెల్లింపులపై కూడా ఈ ప్రభావం పడనుంది. కరోనా నేపథ్యంలోనే ఇన్ష్యూరెన్స్ ధరలు పెరగడంతో ఆయా బీమా సంస్థలు అధిక ఖర్చులు భరించేందుకు సిద్ధంగా లేవు. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ సెకండ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో చాలామంది రీఇన్ష్యూరర్లు రేట్లు పెంచారు. అయితే భారత్ లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. కరోనావైరస్ మహమ్మారి కోరలు చాపకముందే రీ ఇన్ష్యూరెన్స్ రేట్లను పెంచడం జరిగింది.
కరోనావైరస్ భారత్లో పడగ విప్పకముందే భారత్లోని బీమా సంస్థలు రీఇన్ష్యూరెన్స్ ధరలపై కఠినంగా వ్యవహరించాయి. ఆయుర్దాయం రేటు మెరుగ్గా ఉన్న యూరోపియన్ దేశాలలో లైఫ్ కవర్ భారత్తో పోలిస్తే తక్కువగా ఉన్నాయన్న విషయాన్ని గ్రహించాయి. దీంతో ప్రపంచ స్థాయి బీమా కంపెనీలు కూడా వారి దేశాల్లో రీఇన్ష్యూరెన్స్ ధరలపై కఠినతరం చేశాయి. ఇదిలా ఉంటే ప్రీమియం పెంచిన వాటిలో కేవలం ప్రైవేట్ బీమా సంస్థలు మాత్రమే ఉండగా... ఎల్ఐసీ మాత్రం టర్మ్ ప్లాన్స్లో ఎటువంటి ప్రీమియం ధరలను పెంచలేదు. పెరిగిన ప్రీమియంరేట్లను తగ్గించే వెసులుబాటు ప్రైవేట్ ఇన్ష్యూరెన్స్ సంస్థలకు లేదు. అయితే ఎల్ఐసీకి ఆ వెసులుబాటు ఉండటంతో ప్రీమియం ధరలను పెంచలేదు.
టర్మ్ ప్లాన్ ప్రీమియంను ప్రైవేట్ బీమాదారులు ఎందుకు పెంచుతున్నారు..?
ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు రిస్క్ కవరేజ్ ఎక్కువగా వర్తించాలంటే బీమా కంపెనీలు రీఇన్ష్యూరెన్స్ ప్రీమియం చెల్లిస్తారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే రిస్క్ కవరేజీని ప్రాథమిక ఇన్ష్యూరర్, మరియు రీఇన్ష్యూరర్ మధ్య సమానంగా పంచుకోవడం జరుగుతుంది. ఒకవేళ రీఇన్ష్యూరర్స్ ధరలను పెంచితే..చివరిగా పాలసీని కొనుగోలు చేసే పాలసీదారుడిపై పెంచిన ప్రీమియం ధర పడుతుంది. దాదాపుగా అన్ని రీఇన్ష్యూరెన్స్ కాంట్రాక్టులు ఏటా జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో రెన్యూవల్ చేయడం జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ప్రీమియం ధరలు దాదాపు 15 నుంచి 20 శాతం మేరా పెరిగాయి. అంటే ఈ ధరలు రీఇన్ష్యూరెన్స్ రివిజన్ తర్వాతే పెరిగాయి.