ఐటీ రిటర్న్స్లో అధిక వ్యాల్యూ ట్రాన్సాక్షన్స్ వివరాలు వద్దు: ఐటీ శాఖ క్లారిటీ
ఆదాయపు పన్ను రిటర్న్స్(ITR)ల్లో అధిక వ్యాల్యూ కలిగిన ట్రాన్సాక్షన్స్ను పన్ను చెల్లింపుదారులు పేర్కొనవల్సిన అవసరం లేదని సంబంధిత వర్గాలు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ITR ఫామ్స్లలో అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని ఓ అధికారి చెప్పారట. రూ.20వేలకు పైగా హోటల్ బిల్లులు, ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులు, రూ.50వేలకు పైగా జీవిత బీమా ప్రీమియంలు, రూ.1 లక్షకు పైగా విరాళాలు, స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజుల వివరాలు ఐటీఆర్లో స్పష్టం చేయాలని వార్తలు వచ్చాయి. అయితే అలాంటి వివరాలు అవసరం లేదని ఆర్థికమంత్రిత్వ శాఖకు చెందిన అధికారి చెప్పారని తెలుస్తోంది.
జియోను ఆ బకాయిలు ఎందుకు అడగొద్దు: సుప్రీంకోర్టు, ఏ ఆధారమూ లేదు.. రిలయన్స్ జియో
చాలా తక్కువమంది పన్నులు చెల్లిస్తున్నారు
'ఆదాయపు పన్ను రిటర్న్స్ సవరించాలనే ప్రతిపాదనలు ఏమీలేవు. పన్నులు చెల్లించే అతను/ఆమె ఎవరైనా అధిక వ్యాల్యూ కలిగిన ట్రాన్సాక్షన్స్ పేర్కొనాల్సిన అవసరం లేదు' అని ఓ అధికారి వెల్లడించారని తెలుస్తోంది. 'దేశంలో కేవలం కొంతమంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారనేది వాస్తవం. పన్నులు చెల్లించాల్సిన వారంతా వాస్తవానికి వాటిని చెల్లించడం లేదు' అని కూడా పేర్కొన్నారు.
ఐటీ శాఖ కఠినంగా వ్యవహరించనుందని...
పన్ను ఎగవేత దారులపై ఐటీ శాఖ కఠినంగా వ్యవహరించనుందని, ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిందేనని, పన్ను ఎగవేతదారులు డొనేషన్స్, కానుకలు, నగలు, ఫీజులు.. ఇలా కొన్నింటిని చూపించి పన్ను ఎగవేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్ర ఆర్థిక శాఖకు ఐటీ శాఖ తెలిపిందని, అయితే దీనిపై కఠినంగా వ్యవహరించాలనే ప్రతిపాదన కేంద్ర ఆర్థిక శాఖ ముందుకు తీసుకు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. ప్రతి వ్యక్తి ట్రాన్సాక్షన్స్పై దృష్టి సారించాలని ఈ మేరకు వారు దాఖలు చేసే ఐటీ రిటర్న్స్పై కన్నేసి ఉంచాలని ఐటీ శాఖ భావించిందని, అంటే ఆర్థికపరమైన సంస్థలు, ఇతర కంపెనీలతో ఒక వర్గం వారు చేసే లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని ఐటీ శాఖకు తెలపాలని పేర్కొన్నదని, ఇదే ప్రతిపాదనను కేంద్రం వద్దకు తీసుకురాగా అందుకు మద్దతు లభించిందని వార్తలు వచ్చాయి.
జాబితా సిద్ధం
అంతేకాదు, ఆర్థిక సంస్థలు, ఇతర కంపెనీలతో ట్యాక్స్పేయర్స్ జరిపే ట్రాన్సాక్షన్స్ పైన దృష్టిసారించిన ఐటీ శాఖ ఇందుకు సంబంధించిన వివరాలు తమతో ఎవరెవరు పంచుకోవాలో ఒక జాబితాను సిద్ధం చేసిందని, ఇందులో బంగారం కొనుగోలు, పలు వస్తువులు, పెయింటింగ్స్, లక్ష రూపాయలకు పైగా విలువ చేసే పాలరాతి ధరలు, స్కూల్ ఫీజులు, రూ.లక్షకు పైగా ఉండే డొనేషన్స్, బిజినెస్ క్లాసులో విమాన ప్రయాణం, విదేశాల ప్రయాణాలు, రూ.20వేలకు మించి హోటల్ బిల్స్, ఏడాదికి లక్షకు పైగా విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తున్నట్లయితే ఆ సమాచారం, రూ.20వేలకు పైగా ఆరోగ్య బీమా, రూ.50వేలకు పైగా జీవిత బీమా కలిగి ఉంటే ఆ సమాచారాన్ని ఐటీ శాఖకు తెలపాలని పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి.
నిజాయితీగా చెల్లించే వారిపై ప్రభావం ఉండదు
కొంతమంది వివిధ రూపాల్లో ఎక్కువ మొత్తంలో ట్రాన్సాక్షన్స్ జరుపుతారు. వాటిని పన్నులు చెల్లించే సమయంలో పొందుపరచడం లేదు. చాలామంది పన్నులు ఎగవేస్తున్నారు. ప్రతి సంవత్సరం రూ.2.5 లక్షలు మాత్రమే ఆదాయం చూపిస్తున్న చాలామంది తమ పిల్లల్ని విలాసవంతమైన స్కూళ్లలో చదివిస్తున్నారు. కొంతమంది తరుచూ విదేశాలకు వెళ్తారు. ఖరీదైన హోటల్స్లో బస చేస్తారు. వీటన్నింటిని మినహాయించి ఆదాయం రూ.2.5 లక్షలుగా పేర్కొంటారు. అలాంటి వారి కోసం నిబంధనలు కఠినతరం చేస్తారని, హై-వ్యాల్యూ ట్రాన్సాక్షన్స్ను ఐటీఆర్లో పొందుపర్చాల్సిన అవసరం లేదని, ఐటీ చట్టం కింద థర్డ్ పార్టీ అధిక మొత్తంలో ట్రాన్సాక్షన్స్కు సంబంధించి సమాచారం ఫైల్ చేస్తుందని అధికారులు వెల్లడించినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో అధికంగా ఖర్చు చేస్తూ పన్ను తప్పించుకునే వారిని గుర్తించడం సులభతరం అవుతుందని భావిస్తున్నట్లుగా చెప్పారు. దీనివల్ల నిజాయితీగా పన్ను చెల్లించేవారిపై ప్రభావం పడదని చెబుతున్నారు. తాజాగా, ఐటీ శాఖ ఐటీఆర్ ఫామ్స్లో మాత్రం అలాంటి ప్రతిపాదన లేదని తెలిపారు.