ఎస్బీఐ ఫలితాలు, ఈ స్టాక్ను కొనుగోలు చేయవచ్చా?
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) గత ఏడాది నాలుగో త్రైమాసిక ఫలితాలను 3రోజుల క్రితం ప్రకటించింది. స్టాండలోన్ నికర లాభాల్లో 41 శాతం వృద్ధి నమోదు చేసింది. జనవరి - మార్చి త్రైమాసికంలో రూ.9114 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంకు నికర లాభం రూ.6451 కోట్లుగా నమోదయింది.
ఎస్బీఐ ఏకీకృత ఆదాయం గత ఏడాది నమోదైన రూ.81,327 కోట్ల నుండి రూ.82,613 కోట్లకు పెరిగింది. ఆ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన బ్యాంకు లాభం 56 శాతం పెరిగింది. బ్యాంకు నికర నిరర్థక ఆస్తులు స్వల్పంగా తగ్గి 1.02 శాతానికి తగ్గాయి. అయితే ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మాత్రం అందుకోలేదు.
మొన్న క్షీణించి, నేడు జంప్
నాలుగో త్రైమాసికం ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకోలేదు. దీంతో ఎస్బీఐ షేర్ శుక్రవారం సెషన్లో 3.89 శాతం క్షీణించి రూ.444.65 వద్ద ముగిసింది. అయితే ఈ రోజు మాత్రం ఈ స్టాక్ అదరగొట్టింది. ఎస్బీఐ స్టాక్ మధ్యాహ్నం గం.11.15 సమయానికి రూ.14.20 లేదా 3.19 శాతం ఎగిసి రూ.458.90 వద్ద ట్రేడ్ అయింది.
ఎస్బీఐ నికర లాభం ఎప్పుడూ లేనంతగా పెరిగింది. వడ్డీయేతర ఆదాయం మాత్రం నిరాశపరిచింది. ఏడాది ప్రాతిపదికన 27 శాతం తగ్గింది. కానీ సీక్వెన్షియల్ ప్రాతిపదికన 37 శాతం పెరిగింది. నికర వడ్డీ ఆదాయ వృద్ధి కేవలం 1.6 శాతం మాత్రమే. ఈ నేపథ్యంలో ఎస్బీఐ స్టాక్ కొనుగోలు చేయవచ్చా? అంటే వివిధ బ్రోకరింగ్ సంస్థలు ఏం చెబుతున్నాయంటే?
నోమురా ఏం చెబుతోంది
ప్రముఖ బ్రోకరేజీ సంస్థ నోమురా ఎస్బీఐ స్టాక్ను రూ.615 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చునని సూచిస్తోంది. క్రెడిట్ కాస్ట్ చారిత్రాత్మకంగా కనిష్టస్థాయిలో ఉందని, నికర వడ్డీ మార్జిన్ లేదా NIM స్థిరంగా ఉందని, వృద్ధి పుంజుకుంటోందని చెబుతోంది.రీసెర్చ్ ఫర్మ్ క్రెడిట్ సూసీ టార్గెట్ ధరను రూ.600 వద్ద స్థిరంగా కొనసాగిస్తోంది. ఈ రీసెర్చ్ ఫర్మ్ FY23, FY24లో అంచనాలను మూడు శాతం మేర తగ్గించింది.
మోర్గాన్ స్టాన్లీ...
మోర్గాన్ స్టాన్లీ ఎస్బీఐ టార్గెట్ ధరను రూ.615 నుండి 580కి తగ్గించింది. తక్కువ ఛార్జీలు, అధిక పెట్టుబడి కేటాయింపుల కారణంగా కంపెనీ లాభాల అంచనాలను పది శాతం కోల్పోయింది.
మకేరీ రీసెర్చ్ హౌస్ ఎస్బీఐ వడ్డీ రేటును రూ.665గా అంచనా వేస్తోంది.కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ టార్గెట్ ధరను రూ.700గా అంచనా వేస్తోంది.