మెగా E-Auction: SBI బంపరాఫర్, 25 పదివేలకు పైగా ఆస్తుల ఆక్షన్
తనఖా పెట్టిన పలు కమర్షియల్, నివాస ఆస్తులను ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఈ-వేలం ద్వారా విక్రయించనుంది. ఈ మెగా ఈవేలం అక్టోబర్ 25వ తేదీన నిర్వహిస్తోంది. ఎస్బీఐ మెగా ఈ-ేలం ద్వారా మార్కెట్ ధర కంటే తక్కువకే ఇళ్లు, ప్లాట్స్, షాప్స్ను బిడ్ వేసి దక్కించుకోవచ్చు. ఆస్తులను కొనుగోలు చేయాలనుకునే వారు ఈ-వేలంలో పాల్గొనవచ్చు. ఆస్తులు కొనుగోలు చేయాలనుకునేవారు ఈ-వేలంలో పాల్గొని బిడ్ దాఖలు చేయవచ్చునని సోషల్ మీడియా అనుసంధాన వేదిక (ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) ద్వారా ఎస్బీఐ వెల్లడించింది.
'బ్యాంకులో తనఖా పెట్టి అప్పులు చెల్లించలేని వారి ఆస్తులను ఈ-వేలం ద్వారా పారదర్శంగా విక్రయిస్తున్నామని, వేలం వేసే ఆస్తులకు సంబంధించి కోర్టు ఉత్తర్వులతో పాటు కావాల్సిన అన్ని పత్రాలు, వివరాలు బిడ్డర్లకు అందజేస్తాం' అని బ్యాంకు ప్రకటనలో తెలిపింది. వేలం కోసం ఉంచిన ఆస్తుల వివరాలను సోషల్ మీడియా ద్వారా ఇచ్చిన ప్రకటనలో అందించిన లింక్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు వేలం వేసే విధానం, కొనుగోలు చేయాలనుకునే వారి ఆస్తి గురించి సందేహాల నివృత్తి కోసం సంబంధిత బ్రాంచీలలో సంప్రదించవచ్చు ఈ-బిడ్డింగ్లో 10,000కు పైగా ఆస్తులు ఉన్నాయి.
పారదర్శకత
దేశంలోని అతిపెద్ద రుణదాత ఎస్బీఐ. ఎస్బీఐ వద్ద ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉంచినప్పుడు చాలా పారదర్శకంగా ఉంటామని, బ్యాంకులో తనఖా పెట్టిన ఆస్తులు/కోర్టు ఆర్డర్ ద్వారా అటాచ్ చేసిన ఆస్తులను ఆదేశాల మేరకు ఈ-వేలంలో జత చేస్తామని తెలిపింది. అన్ని సంబంధిత వివరాలను పొందుపరుస్తామని, అలాగే, ఫ్రీహోల్డ్ లేదా లీజ్ హోల్డ్, వాటి మెజర్మెంట్స్, లొకేషన్ వంటి వివరాలు అందిస్తామని తెలిపింది.
పబ్లిక్ నోటీసులో ఇతర సంబంధిత వివరాలు కూడా పేర్కొంటున్నట్లు తెలిపింది. ఈ-వేలం కోసం జాబితా చేయబడిన ఆస్తుల వివరాలను ప్రకటనలో అందించిన లింక్స్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. బ్రాంచీలలో వేలం కోసం నియమించబడిన కాంటాక్ట్ పర్సన్ కూడా ఉన్నారు. ఈ-వేలంలో పాల్గొనాలనుకునే వారు వీరిని సంప్రదించవచ్చు.
వేలంలో ఇలా పాల్గొనాలి
ఈ-వేలం నోటీసులో పేర్కొన్న నిర్దిష్ట ఆస్తి కోసం EMD. కేవైసీ డాక్యుమెంట్స్, సంబంధిత ఎస్బీఐ శాఖకు సమర్పించాలి. చెల్లుబాటు అయ్యే డిజిటల్ సంతకం అవసరం. బిడ్డర్స్ ఈ-వేలం వేసేవారిని గానీ, మరి ఏ ఇతర అధికారిక ఏజెన్సీని గానీ సంప్రదించి డిజిటల్ సంతకాన్ని పొందవచ్చు.
ఒకసారి బిడ్డర్ EMD డిపాజిట్ చేసి, KYC పత్రాలను సంబంధిత శాఖకు సమర్పించాక ఈ-వేలం వేసేవారు బిడ్డర్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్స్ను ఈ-మెయిల్ ద్వారా పంపిస్తారు. వేలం నిబంధనల ప్రకారం బిడ్డర్స్ ఈ-వేలం తేదీన, చెప్పిన సమయంలో లాగ్-ఇన్ కావడం ద్వారా వేలంలో పాల్గొనాలి.
బిడ్డింగ్లో ఇలా...
ఈ-వేలం వేసేవారు ఈ-మెయిల్ ద్వారా ఇచ్చిన లాగ్-ఇన్ ఐడీ, పాస్వర్డ్స్ను ఉపయోగించి ఈ-వేలం తేదీన, సమయానికి పోర్టల్లోకి లాగ్-ఇన్ కావాలి. నియమ నిబంధనలు, షరతులను అంగీకరిస్తున్నట్లు తెలిపి, పార్టిసిపేట్ బటన్ పైన క్లిక్ చేయాలి. పార్టిసిపేట్ బటన్ పైన క్లిక్ చేశాక కేవైసీ పత్రాలు, EMD వివరాలు, FRQ(ఫస్ట్ రేట్ కొటేషన్) వివరాలు అప్ లోడ్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి. ఆ తర్వాత కోటేషన్ను సమర్పించాలి. ఈ కొటేషన్లో వేసిన ఆస్తి ధర రిజర్వ్డ్ వ్యాల్యూతో సమానంగా గానీ అంతకంటే ఎక్కువ గానీ ఉండాలి.
కోట్ చేసిన ధరను ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఫైనల్ సబ్మిషన్ అనంతరం బిడ్డర్ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్లో లేదా కోట్ చేసిన ధరలో గానీ మార్పులు చేయలేరు. నిర్ణీత తేదీ, సమయం లోపల ఫైనల్ సబ్మిషన్ పూర్తి కావాలి. లేదంటే ఈ బిడ్డింగ్లో పాల్గొనలేరు.