బ్యాంకులన్నీ గుడ్న్యూస్ చెబుతున్నాయి, మీ వడ్డీ రేటు పెరిగింది!
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ప్రయివేట్ రంగ దిగ్గజం HDFC బ్యాంకుతోపాటు వివిధ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీరేట్లను పెంచుతున్నాయి. గత ద్వైమాసిక పరపతి సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించింది. అయినప్పటికీ బ్యాంకులు మాత్రం FD వడ్డీ రేట్లను క్రమంగా పెంచుతున్నాయి. ఇప్పటికే SBI రెండేళ్లు, ఆపై కాలపరిమితి పైన వడ్డీ రేట్లను పెంచింది.
రెండేళ్ల నుండి మూడేళ్ల కాలపరిమితిపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 5.10 శాతం నుండి 5.20 శాతానికి పెంచింది. అయిదేళ్ల కాలపరిమితి వరకు FD వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్లు పెంచి 5.45కు సవరించింది. అయిదేళ్ల నుండి పదేళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటును 5.50 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. ఈ పెంచిన వడ్డీ రేట్లు ఫిబ్రవరి 15వ తేదీ నుండి అమల్లోకి వచ్చాయి.
వడ్డీ రేట్లు పెంచుతున్న బ్యాంకులు
ఆర్బీఐ గత పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్ల జోలికి వెళ్లలేదు. రెపో రేటు, రివర్స్ రెపో రేట్లను స్థిరంగా కొనసాగించింది. రివర్స్ రెపో రేటు పెంచే అవకాశముందని అంచనా వేసినప్పటికీ, ఆర్బీఐ అలా చేయలేదు. ఇందుకు భిన్నంగా దేశీయ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్స్ వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచుతున్నాయి.
దీంతో కరోనా ప్రారంభం నుండి దాదాపు స్థిరంగా ఉన్న FD డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. SBI, HDFC బ్యాంకు తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకు కూడా వడ్డీ రేట్లను పెంచుతున్నాయి.
HDFC వడ్డీ రేటు
HDFC బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల పైన వడ్డీ రేట్లను ఈ నెల 14వ తేదీన సవరించింది. దీని ప్రకారం ఏడాది కాలపరిమితిపై 5 శాతం వడ్డీ రేటు, రెండేళ్ల నుండి మూడేళ్ల కాలపరిమితిపై 5.20 శాతం వడ్డీ రేటు, మూడేళ్ల నుండి అయిదేళ్ల కాలపరిమితిపై 5.45 శాతం వడ్డీ రేటు, అయిదేళ్ల నుండి పదేళ్ల కాలపరిమితిపై 5.60 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.
ఈ బ్యాంకుల్లో...
యకో బ్యాంకు ఏడాది కాలపరిమితి ఫిక్స్డ్ డిపాజిట్ పైన 5.10 శాతం వడ్డీ రేటును, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 శాతం వడ్డీ రేటును అమలు చేస్తోంది. ప్రయివేటు రంగ బ్యాంకుల్లో IDFC ఫస్ట్ బ్యాంకు ఒక ఏడాది కాలానికి 5.75 శాతం వడ్డీ రేటును అమలు చేస్తోంది. యాక్సిస్ బ్యాంకు, కరూర్ వైశ్య బ్యాంకులు 5.15 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తున్నాయి.