ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదా? వడ్డీ, ఇతర ఆదాయాలపై టీడీఎస్ భారం
మీరు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదా? అయితే మీకు వివిధ ఆదాయాలు, వాటిపై వచ్చే వడ్డీ పైన భారీగా టీడీఎస్ పడనుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. ఒక వ్యక్తి రెండేళ్లుగా రూ.50వేల మేరకు టీడీఎస్ లేదా టీసీఎస్ రూపంలో చెల్లిస్తే ఆ వ్యక్తి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుండా ఉంటే, అలాంటి పద్ధతిని నిరుత్సాహపరిచేందుకు కేంద్రం ఈ ప్రతిపాదనను తీసుకు వచ్చారు. రెండేళ్లుగా యాభై వేల రూపాయల వరకు టీడీఎస్ లేదా టీసీఎస్ రూపంలో పన్ను చెల్లించిన వారిపై రెట్టింపు, అంతకంటే ఎక్కువ టీసీఎస్ లేదా టీడీఎస్ వసూలు చేస్తారు.
అందుకే సెక్షన్...
ఈ నిబంధన శాలరీ ఆదాయం, ఎన్నారై చెల్లింపులు, లాటరీ ఆదాయానికి వర్తించదని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుండా ఉంటే వారి నుండి అధిక టీడీఎస్ వసూలు చేయడానికి ఆదాయ పన్ను చట్టానికి కేంద్ర ఆర్థికమంత్రి 206ఏబీ అనే సెక్షన్ను తీసుకు వచ్చారు. దీంతో పాటు కొత్తగా 206 సీసీఏ సెక్షన్ కింద అధిక టీసీఎస్ రేటు వర్తిస్తుంది. పెట్టుబడుల ఆదాయం, యాన్యుటీ పించన్, డివిడెండ్ ద్వారా వచ్చే ఆదాయం, వడ్డీ రూపేణా వచ్చే ఆదాయంపై అధిక టీడీఎస్ విధానం వర్తింపచేస్తారు.
వీటికి వర్తించదు
కొత్త ప్రతిపాదన ప్రకారం సెక్షన్ 19 (శాలరీస్), 192ఏ(పీఎఫ్), 194బీ(లాటరీ గెలుపు వంటివి), 194బీబీ (హార్స్ రేట్ విన్నింగ్), 194ఎల్బీసీ (సెక్యూరిటైజేషన్ ట్రస్ట్ నుండి ఆదాయం) లేదా 194ఎన్(రూ.20 లక్షలకు మించి నగదు ఉపసంహరణ)కు ఇది వర్తించదు.
మరో వ్యూహం
ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసేలా కేంద్ర ప్రభుత్వం మరో వ్యూహం ఇది అని పన్ను నిపుణులు అంటున్నారు. ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేనివారికి... వడ్డీ ఆదాయం, డివిడెండ్ ఆదాయం, బీమా సంస్థల నుండి పొందిన యాన్యుటీ వంటి ఆదాయం కలిగిన వారికి ఇది బ్యాడ్ న్యూస్ కావొచ్చునని అంటున్నారు.