ఆగస్ట్ 1వ తేదీ నుండి ప్రతిరోజు అందుబాటులోకి NACH, ఆర్బీఐ గుడ్న్యూస్
నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(NACH) ఆగస్ట్ 1వ తేదీ నుండి ప్రతి రోజు అందుబాటులో ఉండనుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) శుక్రవారం తెలిపింది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్, వడ్డీ రేటు, డివిడెండ్,ఇతర పేమెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్ వంటి భారీ చెల్లింపులు నిర్వహించేదే NACH. ఇది ఆగస్ట్ 1 నుండి అన్ని రోజులు అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.
ప్రస్తుతం ఈ సేవలు బ్యాంకులు తెరిచిన రోజుల్లో అందుబాటులో ఉంటాయి. కస్టమర్ల సేవలను మరింత బలోపేతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నామని ఆర్బీఐ తెలిపింది. NACH విధానం ద్వారా ఒకరి నుండి పలువురికి డబ్బులు బదీలీ చేయవచ్చు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సుఫర్ విధానం వచ్చాక NACH నమ్మకమైన, సమర్థవంతమైన మార్గంగా ఆర్బీఐ తన ప్రకటనలో తెలిపింది.
కరోనా సమయంలోను ప్రభుత్వ సబ్సిడీలు చెల్లించేందుకు NACH ఉపయోగపడింది. గ్యాస్, విద్యుత్, టెలిఫోన్, వాటర్, వాయిదాల చెల్లింపులకు ఉపయోగిస్తారు. ప్రస్తుతం NACH కేవలం బ్యాంకు వర్కింగ్ డేస్లలో పని చేస్తోందని, ఇప్పటికే RTGS అన్ని రోజులు అందుబాటులోకి రావడడంతో NACHను కూడా అన్ని రోజులు పనిచేసేలా చేయాలని ప్రతిపాదిస్తున్నామని, ఇది ఆగస్ట్ 1వ తేదీ నుండి అమల్లోకి వస్తుందని ప్రకటనలో తెలిపింది.