LIC IPO: మొదటిరోజే ఇన్వెస్టర్లకు షాక్, ఇప్పుడేం చేయాలి?
ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) షేర్లు నష్టాలతో మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన మొదటి రోజునే డీలాపడ్డాయి. ఎల్ఐసీ ఇష్యూ ధర రూ.949 కాగా, రూ.81.80 తక్కువగా రూ.867.20 వద్ద బీఎస్ఈలో నమోదయింది. ఇంట్రాడేలో రూ.860.10కి దిగి వచ్చి, చివరకు 7.75 శాతం నష్టంతో అంటే రూ.73.55 తగ్గి రూ.875.45 వద్ద ముగిసింది. పాలసీదారులకు, రిటైలర్లకు డిస్కౌంట్ వచ్చిన విషయం తెలిసిందే. డిస్కౌంట్ కంటే తక్కువకు ముగిసింది. నిన్న ఒక్కరోజు 27.52 లక్షల షేర్లు చేతులు మారాయి. ఎన్ఎస్ఈలో కూడా ఇష్యూ ధర కంటే రూ.77 తగ్గి రూ.872 వద్ద షేర్ లిస్ట్ అయింది. రూ.860 వద్ద ఇంట్రాడేలో కనిష్టాన్ని నమోదు చేయగా, చివరకు 7.77 శాతం లేదా రూ.73.75 నష్టంతో రూ.875.25 వద్ద ముగిసింది. 4.87 కోట్ల షేర్లు చేతులు మారాయి.
ఎల్ఐసీ మార్కెట్ క్యాప్
మొదటి రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.54 లక్షల కోట్లుగా నమోదయింది. దీంతో దేశీయంగా అత్యధిక మార్కెట్ వ్యాల్యూ కలిగిన ఐదో కంపెనీగా నిలిచింది. మార్కెట్ క్యాప్ పరంగా మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆ తర్వాత టీసీఎస్ ఉన్నాయి. మూడో స్థానంలో HDFC బ్యాంకు, నాలుగో స్థానంలో ఇన్ఫోసిస్ ఉన్నాయి. ఇప్పుడు ఎల్ఐసీ ఐదో స్థానాన్ని ఆక్రమించింది.
పాలసీదారులకు నష్టమే
పాలసీదారులకు ఇష్యూ ధరలో రూ.60 తగ్గింపు లభించింది. అంటే ఒక్కో షేర్ ధర రూ.949 కాగా, వీరికి రూ.889కి వచ్చింది. ఈ లెక్కన ఒక లాట్ను రూ.13,335కు కొనుగోలు చేశారు. కానీ మొదటి రోజు రూ.875 వద్ద ముగిసింది. మొత్తంగా ఒక లాట్ పైన నష్టం రూ.200కు పైన ఉంది. చిన్న ఇన్వెస్టర్లకు రూ.45 డిస్కౌంట్ వచ్చింది. అంటే వీరికి ఒక్కో షేర్కు రూ.904 చొప్పున లాట్కు రూ.13,560. వీరి నష్టం రూ.428కి పైన ఉంది.
అందుకే నష్టం... లాంగ్ టర్మ్ కోసం
మార్కెట్లో అనూహ్య పరిస్థితులు, ఒడిదుడుకుల కారణంగా ఎల్ఐసీ షేర్లు మొదటి రోజు భారీగా నష్టపోయాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. మంచి రిటర్న్స్ కోసం దీర్ఘకాలానికి అట్టిపెట్టుకోవచ్చునని చెబుతున్నారు. పాలసీదారులు, చిన్న ఇన్వెస్టర్లకు ఇష్యూ ధరలో తగ్గింపు కారణంగా మొదటి రోజు వీరి నష్టం పరిమితమైంది. ఇష్యూలో షేర్లు పొందిన చాలామంది ముఖ్యంగా పాలసీదారులు సెకండరీ మార్కెట్లో కొనుగోలుకు మొగ్గు చూపుతారని, దీంతో మున్ముందు ధర పెరుగుతుందని అంటున్నారు. ఎల్ఐసీ ఐపీవోకు 10.85 లక్షల దరఖాస్తులు రాగా, 7 లక్షల మందికి కేటాయింపులు జరిగాయి. దేశంలోనే అత్యధిక దరఖాస్తులు వచ్చిన ఐపీవో ఇదే.
ఏం చేయాలి
ఇష్యూ ధర కంటే తక్కువగా నమోదై, నష్టాల్లో ముగిసింది. ఈ షేర్ను అట్టిపెట్టుకోవచ్చునా అంటే లాంగ్ టర్మ్ కోసం చూస్తే విక్రయించవద్దని సూచిస్తున్నారు. ధర తగ్గినప్పుడు మరిన్ని షేర్లు కొనుగోలు చేయవచ్చునని అంటున్నారు. రూ.800 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని దీర్ఘకాలానికి అట్టిపెట్టుకోవచ్చునని చెబుతున్నారు. ధర తగ్గినప్పుడల్లా షేర్లను కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన వారు స్థిరత్వం వచ్చే వరకు వేచి ఉండాలని సూచిస్తున్నారు.