గుడ్న్యూస్, రిటైల్ టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచిన ఐడీబీఐ
ఐడీబీఐ బ్యాంకు తన ఖాతాదారుల రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్ల పైన వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. బుధవారం నుండి వడ్డీ రేట్ల పెంపు అమల్లోకి వచ్చింది. దేశీయ టర్మ్ డిపాజిట్లు, నాన్ రెసిడెంట్ ఆర్డినరీ(NRO), నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ (NRE) టర్మ్ డిపాజిట్లలో అన్ని కాలపరిమితులపై పెరిగిన వడ్డీ రేట్లు వర్తిస్తాయని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.
కస్టమర్లు తమ ఇల్లు లేదా కార్యాలయం నుండి డిజిటల్గా డిపాజిట్ చేయవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, గో మొబైల్ యాప్ ద్వారా లేదా బ్యాంకు బ్రాంచీకి వెళ్లి డిపాజిట్ చేయవచ్చు. అంతర్జాతీయంగా ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితి, దేశీయంగా ధరలు పెరిగిన నేపథ్యంలో భారత మార్కెట్లలో ఫిక్స్డ్ డిపాజిట్ సురక్షిత మార్గంగా భావిస్తున్నారు. ఐడీబీఐ ఫిక్స్డ్ డిపాజిట్ల పైన అత్యధికంగా 5.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
ఈ బ్యాంకు 91 రోజుల నుండి ఆరు నెలల కాలపరిమితిపై 25 బేసిస్ పాయింట్లు పెంచి 3.75 శాతం నుండి 4 శాతానికి పెంచింది. మూడేళ్ల నుండి అయిదేళ్ల లోపు కాలపరిమితిపై 5.60 శాతానికి, అయిదేళ్ల కాలపరిమితిపై 5.75 శాతానికి, అయిదేళ్ల నుండి ఏడేళ్ల కాలపరిమితిపై 5.75 శాతానికి, ఏడేళ్ల నుండి పదేళ్ల కాలపరిమితిపై 5.75 శాతానికి పెంచింది. ట్యాక్స్ సేవింగ్స్ FD (5 ఏళ్ళు) 5.75 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు సాధారణ రేటు కంటే ఎక్కువగా ఉంటుంది.