గుడ్ న్యూస్: ఇల్లు కొనాలనుకుంటున్నారా... వడ్డీ రేట్లు ఎంత తగ్గాయో తెలుసా?
గృహమే కదా నా స్వర్గ సీమ అన్నాడో కవి. సొంత ఇంట్లో ఉండే భరోసా వేరు. అందుకే సొంత ఇంటి కళలు కనని వారు ఎవరు ఉంటారు చెప్పండి? కానీ అనేక కారణాల వల్ల ఆ కళలు అలాగే మిగిలిపోతాయి. కేవలం కొంత మంది మాత్రమే తాము అనుకున్నది సాధించుకోగలుగుతారు. కానీ సంక్షోభం లోనూ అవకాశాలు లభిస్తాయని చెప్పినట్లు ప్రస్తుతం సొంత ఇంటి కళను నిజం చేసుకునేవారికోసం ఒక అవకాశం కనిపిస్తోంది.
ఇది కరోనా వైరస్ వల్ల లభించిన అవకాశం అని కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కరోనా కంటే ముందు ఇండియా లో వడ్డీ రేట్లకు, ఇప్పుడు ఉన్న వడ్డీ రేట్లకు భారీ తేడా ఉంది. అంతే కాదు ఋణం తీసుకున్నాక కూడా మారటోరియం వినియోగించుకునే అవకాశం కూడా ఉందిప్పుడు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వినియోగదారులు ఇప్పుడు బిల్డర్లతో భేషుగ్గా బేరమాడవచ్చు.
ఎందుకంటే వారికి గత రెండు నెలలుగా వ్యాపారం లేక నిధుల లభ్యత సమస్య ఎదురైంది. ఇప్పుడు వారికి నగదు ప్రవాహం అవసరం. కాబట్టి వారి లాభాల్లో చాలా మట్టుకు తగ్గించుకునేందుకు ముందుకు వస్తారు. కాబట్టి ఇల్లు కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయం అని చెప్పొచ్చు.
పన్ను తగ్గింపు లేదు, అందుకే ప్యాకేజీలో డబ్బులు చేతికి ఇవ్వలేదు: నిర్మల
7% నికి తగ్గిన వడ్డీ...
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమంతా దెబ్బతింది. భారత దేశం కూడా ఇందుకు మినహాయింపు కాదు. మన దేశంలో కూడా రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్ డౌన్ వల్ల అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రజలకు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. బతుకు భారం అయిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ 40 ఏళ్ళ లో చూడనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. జీడీపీ వృద్ధి రేటు నెగటివ్ కు పడిపోయింది.
ఈ సంక్షోభం లో నుంచి దేశాన్ని, ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ (రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ) అనేక చర్యలు చేపట్టాయి. ఆర్బీఐ పలు మార్లు వడ్డీ రేట్లు తగ్గించింది. దీంతో ప్రస్తుతం గృహ రుణాలపై వడ్డీ రేట్లు సుమారు 10-15 ఏళ్ళ కనిష్ఠానికి దిగి వచ్చాయి. దీంతో వినియోగదారులకు ఆర్థికంగా చాలా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.
రూ 30 లక్షలకు రూ 20 వేలే..
ఇండియా లో భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) ఏ విషయంలోనైనా చాలా ముందు ఉంటుంది. ఇదే రుణాలపై వడ్డీ రేట్ల ను శాశించే ట్రెండ్ సృష్టిస్తుంది. సరిగ్గా ఇప్పుడు అలాగే ఎస్బీఐ మరోసారి ఇంటరెస్ట్ రేట్లను తగ్గించి సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేయబోతున్నట్లు వార్త్లు వెలువడుతున్నాయి. వాటి ప్రకారం ఎస్బీఐ గృహ రుణాలపై వద్దే రేట్లను అతి కనిష్టంగా 7.05% కి అందిస్తున్నట్లు తెలిపింది.
దీంతో మిగితా బ్యాంకులు కూడా దీనినే ఫాలో అవుతాయి. కాకపొతే వాటి వడ్డీ రేట్లు కాస్త అధికంగా 7.5% వరకు ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం ఎస్బీఐ లో సుమారు రూ 30,00,000 హోమ్ లోన్ తీసుకుంటే ఈఎంఐ కేవలం రూ 23,000 మేరకు ఉండనుంది. నాలుగు ఐదేళ్ల క్రితం ఇంతే రుణంపై వడ్డీ రేటు 10-11% గా ఉన్న విషయం తెలిసిందే. అప్పుడు ఈఎంఐ సుమారు రూ 30,000 స్థాయిలో ఉండేది.
వారికి మరింత మేలు...
తొలిసారి గృహాలు కొనుగోలు చేసే పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రస్తుతం తగ్గిన గృహ రుణాల వడ్డీ రేట్లతో మరింత మేలు జరగనుంది. అందరికీ గృహాలు కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లోయర్ ఇన్కమ్ గ్రూప్ వర్గాలకు వడ్డీలో 4% రిబేటు, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వారికి వడ్డీ లో 2% రిబేటు లభిస్తుంది. గరిష్టంగా రూ 2.60 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుంది.
ఇది కూడా బ్యాంకులకు నేరుగా ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి... ఆ మేరకు వారు చెల్లించాల్సిన రుణ భారం తగ్గి పోతుంది. ఈ మొత్తాన్ని అసలు కింద జమ చేస్తారు కాబట్టి, మిగిలిన రుణం తక్కువ కాలంలోనే తీరిపోతుంది. కాబట్టి, వచ్చే 6 నెలల నుంచి ఏడాది లోపు కొత్తగా గృహాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఎంతో ప్రయోజనకరం. ఏడాది తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటే పరిస్థితులు మారిపోవచ్చు.