20 ఏళ్ళలో 'డబుల్' బొనాంజా: రోజుకు రూ.95 ఇన్వెస్ట్ చేస్తే రూ.14 లక్షలు
ప్రతిరోజు లేదా ప్రతి నెల ఇలా కొంత మొత్తం పెట్టుబడిగా పెట్టి, కొన్నేళ్ల తర్వాత పెద్ద మొత్తంలో రిటర్న్స్ సహా అసలు మొత్తం అందుకునే ప్లాన్ భవిష్యత్తుకు బాటలు వేయడమే. నిర్ణీత కాలంలో స్వల్ప పెట్టుబడితో ఒకేసారి పెద్ద మొత్తం తీసుకోవడానికి చాలామంది మొగ్గు చూపుతారు. ఇందుకోసం ఎన్నో మార్గాలు ఉన్నాయి. పోస్టాఫీస్ పథకాలు కూడా మంచి రిటర్న్స్ అందిస్తుంటాయి.
ఇలాంటి పథకాల్లో ఒకటి గ్రామ్ సుమంగళ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సురెన్స్ స్కీం. మనీ బ్యాక్తో పాటు ఇన్సురెన్స్ కలిగిన స్కీం ఇది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి ఇది ఎంతో ప్రయోజనకరం. ఈ పథకంలో రెండు రకాలు ఉన్నాయి.
జనవరి-మార్చిలో హౌసింగ్ సేల్స్ జంప్, హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాల జోరు
గ్రామ్ సుమంగళ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సురెన్స్
రోజుకు రూ.95 పెట్టుబడిగా పెడితే స్కీం ముగిసే సమయానికి మీ చేతికి రూ.14 లక్షలు వస్తాయి. రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సురెన్స్ స్కీంను 1995లో ప్రారంభించారు. ఈ పథకం కింద ఆరు విభిన్న పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి గ్రామ్ సుమంగళ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సురెన్స్ స్కీం. నిర్ధిష్ట సమయంలో డబ్బులు అవసరమైన వారికి ఈ పథకం ఎంతో ప్రయోజనకరం. గ్రామ్ సుమంగల్ యోజన స్కీం బీమా పాలసీ కింద రూ.10 లక్షల వరకు అందుకోవచ్చు. మెచ్యూరిటీ తర్వాత జీవించి ఉంటే పాలసీదారుకు మనీబ్యాక్ ప్రయోజనం ఉంది. అనుకోని పరిస్థితుల్లో పాలసీదారు మరణిస్తే నామినీకి మెచ్యూరిటీ అనంతరం అష్యూర్డ్ మొత్తంతో పాటు బోనస్ అందిస్తుంది.
మనీ బ్యాక్ ఇలా
సుమంగల్ స్కీం రెండు కాలపరిమితుల్లో అందుబాటులో ఉంది. ఒకటి 15 సంవత్సరాలు, రెండోది 20 సంవత్సరాలు. ఈ పాలసీ తీసుకోవడానికి కనీస అర్హత 19 ఏళ్లు. 15 ఏళ్ల కాలపరిమితి కలిగిన పాలసీ తీసుకోవడానికి గరిష్ట వయస్సు 45. 20 ఏళ్ల మెచ్యూరిటీ పాలసీ తీసుకుంటే గరిష్ట వయస్సు 40. పదహేనేళ్ల పాలసీ తీసుకుంటే ఆరేళ్లు, తొమ్మిదేళ్లు, పన్నెండేళ్ల తర్వాత ఒక్కోసారి 20 శాతం చొప్పున మనీ బ్యాక్ ఉంటుంది. మెచ్యూరిటీ ముగిసిన తర్వాత మిగతా 40 శాతంతో పాటు బోనస్ లభిస్తుంది.
20 ఏళ్ల పాలసీ తీసుకుంటే 8 ఏళ్లు, 12 ఏళ్లు, 16 ఏళ్ల తర్వాత 20 శాతం చొప్పున వస్తుంది. మిగతా 40 శాతం, బోనస్ 20 ఏళ్ల తర్వాత అందుతుంది.
ప్రీమియం రూ.95
25 ఏళ్ల వయస్సు కలిగిన వారు కనుక ఈ పాలసీని 20 సంవత్సరాలకు తీసుకుంటే రూ.7 లక్షల అష్యూర్డ్ మనీ లభిస్తుంది. ఈ పాలసీ కింద రోజుకు రూ.95, నెలకు రూ.2,853 చెల్లించాలి. క్వార్టర్లీ ప్రీమియం రూ.8,449, 6 నెలల ప్రీమియం రూ.16,715, ఏడాది ప్రీమియం రూ.32,735 ఉంది.
ఎంత ప్రయోజనమంటే
20 సంవత్సరాల పాలసీ తీసుకుంటే 8 ఏళ్లు, 12 ఏళ్లు, 16 ఏళ్లు పూర్తయ్యాక రూ.1.4 లక్షల చొప్పున మనీ బ్యాక్ వస్తుంది. 20 ఏళ్ల మెచ్యూరిటీ అనంతరం మిగతా రూ.2.8 లక్షలు వస్తాయి. ప్రతి వెయ్యి రూపాయలకు ఏడాదికి రూ.48 బోనస్ లభిస్తుంది. రూ.7 లక్షల అష్యూర్డ్ మొత్తంపై ఏడాదికి బోనస్ రూ.33,600 లభిస్తుంది. ఇరవై ఏళ్ల పాలసీరూ.6.72 లక్షలు అవుతుంది. అంటే 20 ఏళ్ల కాలంలో పాలసీదారుకు రూ.13.72 లక్షల మేర లబ్ధి చేకూరుతుంది. రూ.13.72 లక్షల్లో మూడు పర్యాయాలు మనీ బ్యాక్ పాలసీ రూపంలో రూ.4.2 లక్షలు వస్తాయి. మిగతా రూ.9.52 లక్షలు మెచ్యూరిటీ తర్వాత అందుతాయి.