మార్చి నాటికి అన్ని బ్యాంకు అకౌంట్లతో ఆధార్ లింక్, రూపే కార్డు ప్రమోషన్
కస్టమర్ల బ్యాంకు ఖాతాలను ఆధార్ కార్డుతో లింక్ చేయాలని కేంద్రఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బ్యాంకర్లకు సూచించారు. ఇందుకోసం ఆమె డెడ్లైన్ కూడా విధించారు. 2021 మార్చి చివరి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల బ్యాంకుల ఖాతాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని బ్యాంకులకు కేంద్ర ఆర్థికమంత్రి సూచించారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ 73వ వార్షిక సాధారణ సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఆధార్, బ్యాంకు అకౌంట్ల లింకింగ్తో పాటు డిజిటల్ చెల్లింపులు, రూపే కార్డుల జారీ అంశంపై మాట్లాడారు.
అజీమ్ ప్రేమ్జీ విరాళం రోజుకు రూ.22 కోట్లు! రెండో స్థానంలో శివ్నాడర్
డిసెంబర్ నాటికి.. మార్చి 31 నాటికైనా...
డిసెంబర్ నెల నాటికి ఆధార్ కార్డుతో బ్యాంకు ఖాతాల అనుసంధానత పూర్తి చేయాలని, ఒకవేళ ఆ గడువు దాటినా వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా కచ్చితంగా పూర్తి చేయాలని నిర్మలా సీతారామన్ బ్యాంకులను ఆదేశించారు. మార్చి 31వ తేదీ తర్వాత ఆధార్ అనుసంధానం లేని ఖాతాలు మిగిలి ఉన్నాయని చెప్పడానికి వీల్లేదని, అలాంటి మాటలు వినేందుకు తాను సిద్ధంగా లేనని నిర్మల సూటిగా చెప్పారు. అలాగే అవకాశమున్న ఖాతాలకు పాన్ నెంబర్ అనుసంధానతపై కూడా దృష్టి సారించాలన్నారు.
డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించాలి
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని, అలాగే డిజిటల్ కాని చెల్లింపులను బ్యాంకులు నిరుత్సాహపరచాలని నిర్మల సూచించారు. యూపీఐలను ప్రోత్సహించాలన్నారు. యూపీఐ సహా డిజిట్ చెల్లింపు పద్ధతులను ఎక్కువగా వినియోగించేలా చర్యలు తీసుకొని, నగదు ట్రాన్సాక్షన్స్ తగ్గేలా చూడాలన్నారు. ఇతరత్ర విధానాలలో చెల్లింపులను సాధ్యమైనంత మేర ప్రోత్సహించవద్దని కోరారు. మన బ్యాంకుల్లో చెల్లింపులకు యూపీఐ అనేది పర్యాయపదం కావాలని చెప్పారు. దానిని సాధించే దిశగా బ్యాంకులు మరింతగా ప్రయత్నించాలన్నారు.
రూపేకార్డులు ప్రోత్సహించాలి
ఎవరికైనా కార్డు ఇవ్వాలంటే రూపే కార్డుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్మల తెలిపారు. రూపే కార్డును ప్రోత్సహించాలన్నారు. రాబోయే రోజుల్లో రుపే కార్డులు ప్రపంచవ్యాప్తంకావాలని, ప్రతీ ఒక్క భారతీయుడు రుపే కార్డు కలిగి ఉండేలా చూడాలన్నారు. రూపేకార్డు ప్రపంచవ్యాప్తమైతే భారతీయులకు ఆ కార్డు మినహా మరే ఇతర కార్డు అవసరం లేదన్నారు. రూపేకార్డు ద్వారా ఎన్సీపీఐన బ్రాండ్ ఇండియా ప్రోడక్ట్గా తీర్చిదిద్దాలన్నారు.