వ్యాక్సీనేషన్ తర్వాత హాస్పిటల్పాలైతే బీమా ఊరట, సైబర్ ఇన్సురెన్స్కు డిమాండ్
ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళనతో కోవిడ్ వ్యాక్సీన్ తీసుకోవడం గురించి ఆందోళన చెందుతున్నారా? అయితే ఎలాంటి చింత వద్దు! ఎందుకంటే మీ ప్రస్తుత ఆరోగ్య బీమా పాలసీ.. వ్యాక్సీన్ తీసుకోవడం ద్వారా ఆసుపత్రిపాలైనప్పటికీ ఖర్చును భరిస్తుంది. ఈ మేరకు ఇన్సురెన్స్ రెగ్యులేటర్ IRDAI నుండి ఆరోగ్య బీమా కంపెనీలకు కీలక ఆదేశాలు వచ్చాయి. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతోన్న విషయం తెలిసిందే. అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే వ్యాక్సీన్ తీసుకోవడం కోసం చాలామంది సంకోచిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తితే అనే ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో IRDAI నుండి బీమా కొనుగోలుదారులకు సానుకూల వార్త వచ్చింది.

వ్యాక్సీన్ రియాక్షన్కు బీమా.. కానీ
ప్రజలు కరోనా వ్యాక్సిన్లు తీసుకుంటున్న నేపథ్యంలో ఐఆర్డీఏఐ ఈ కీలక నిర్ణయం వెల్లడించింది. ఆరోగ్య బీమా ఉన్నవారు కొవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రియాక్షన్కు గురై, ఆసుపత్రిలో చేరితే ఆ ఖర్చులు కూడా బీమా పరిధిలోకి వస్తాయని గురువారం తెలిపింది. అయితే ఇది షరతులకు లోబడి వర్తిస్తుందని వెల్లడించింది. వ్యాక్సినేషన్ తర్వాత ఏదైనా రియాక్షన్ అయి హాస్పిటల్కు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఇతర అనారోగ్యం వలె ట్రీట్ చేయాల్సి ఉంటుందని, బీమా వర్తిస్తుందని IRDAI నోటిఫికేషన్ వెల్లడిస్తోందని చెబుతున్నారు.

సైబర్ పాలసీకి డిమాండ్
రిమోట్ వర్కింగ్ నేపథ్యంలో సైబర్ ఇన్సురెన్స్ పాలసీకి డిమాండ్ పెరగవచ్చునని IRDAI సీనియర్ అధికారులు భావిస్తున్నారు. కరోనా ప్రభావం చాలాకాలం ఉండటంతో రిమోట్ వర్కింగ్ కొనసాగుతోందని, దీంతో సైబర్ ఉత్పత్తుల పరిమాణం మరింత పెరుగుతుందని అంటున్నారు. హెల్త్, ట్రావెల్ రంగాల్లో క్లెయిమ్స్ భారీగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఆటోమొబైల్ విభాగంలో మాత్రం సాధారణ బీమా సంస్థలు అంత ప్రభావితం కాకపోవచ్చునని చెప్పారు.

ఆరోగ్య సంజీవని
అందరికీ ఆరోగ్య బీమాను చేరువ చేయాలనే లక్ష్యంలో భాగంగా ఆరోగ్య సంజీవని పాలసీ కవరేజీల్లో IRDAI మార్పులు చేసింది. స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో కనీస పరిమితిని రూ.50వేలకు తగ్గించగా, గరిష్ఠ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది.


Click it and Unblock the Notifications