EPF new rule: ఇక ఎక్కడైనా... ఉద్యోగులకు EPFO తీపికబురు
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నగదు చేతిలో ఉండేందుకు వివిధ రకాల నిర్ణయాలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గతంలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సమయంలో ఉపసంహణ వెసులుబాటు కల్పించారు. 100 వరకు ఉన్న కంపెనీల్లో 90 శాతం మంది ఉద్యోగుల వేతనం రూ.15వేల లోపు ఉంటే పీఎఫ్ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. పెద్ద కంపెనీలకు కూడా పీఎఫ్ను మూడు నెలల పాటు 10 శాతం మాత్రమే చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. తాజాగా, ఉద్యోగులకు మరో ఊరట కల్పించింది.
చైనాకు వెళ్లాలంటేనే ఇక భయం, అక్కడి కంపెనీ కోసం భారత్ వద్ద ఉన్న ఆయుధం ఇదే!
ఇతర కార్యాలయాల్లో అభ్యర్థన పరిశీలన
కరోనా నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్లలో పీఎఫ్ ఆఫీస్ల మూసివేత, సిబ్బంది కొరత కారణంగా అధిక పని భారం వంటివి తలెత్తినప్పటికీ ఉద్యోగుల ఆన్లైన్ అభ్యర్థనలను పెండింగులో ఉంచకుండా వేగంగా పరిష్కరించేందుకు ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కొత్త విధానాన్ని తెచ్చింది. దీంతో భవిష్యనిధి, పెన్షన్, పాక్షిక ఉపసంహరణలు, క్లెయిమ్స్ బదలీకి సంబంధించి సభ్యుల అభ్యర్థనలను సంబంధిత పరిధికి చెందిన ప్రాంతీయ ఈపీఎఫ్ఓ ఆఫీస్ పరిష్కరించాల్సిన అవసరం లేదు. బ్యాంకు ఖాతాకు నగదు బదలీ మినహా మిగిలిన ప్రక్రియలను అన్నింటిని ఇతర ప్రాంతాల్లోని పీఎఫ్ కార్యాలయాల్లో పూర్తి చేసుకోవచ్చునని తెలిపింది. పీఎఫ్ సబ్స్క్రైబర్లకు ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తీపి కబురే.
జూన్ 10న ఢిల్లీలో ప్రారంభం
ప్రస్తుత పరిస్థితుల్లో మల్టీ లొకేషన్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది. దీంతో మీ ఆన్లైన్ పీఎఫ్ సెటిల్మెంట్ను దేశంలో ఎక్కడి కార్యాలయమైనా క్లియర్ చేస్తుంది. ఈపీఎఫ్ఓ తన మల్టీ లొకేషన్ క్లెయిమ్ సెటిల్మెంట్ సర్వీసులను జూన్ 10న ప్రారంభించింది. గురుగ్రామ్ రీజియన్లోని ఉద్యోగుల క్లెయిమ్స్ను చండీగఢ్, లుధియానా, జలంధర్ కార్యాలయాల్లోని ఈపీఎఫ్ఓ ఆపీస్ సెటిల్ చేసింది. సెటిల్మెంట్ తర్వాత గురుగ్రామ్ ఆఫీస్ నుంచి సబ్స్క్రైబర్ బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ చేసింది. తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా క్లెయిమ్ సెటిల్మెంట్ వేగంగా జరుగుతుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
కరోనా నేపథ్యంలో పీఎఫ్ ఉపసంహరణలు పెరగడంతో ఈపీఎఫ్ఓ ఇటీవలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫుల్లీ ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఈపీఎప్ కేవైసీ పూర్తిగా ఉంటే ఈ సెటిల్మెంట్ ఆటోమేటిక్గా మూడ్రోజుల్లో పూర్తవుతుంది.
సెటిల్మెంట్
కరోనా - లాక్ డౌన్ సమయంలో ఈపీఎఫ్ఓ రోజుకు 80,000కు పైగా సెటిల్మెంట్స్ చేసింది. రోజుకు సగటున రూ.270 కోట్లు క్లెయిమ్స్ సెటిల్ చేస్తోంది. ఈపీఎఫ్ఓ ఇటీవలే కరోనా ఉపసంహరణ సదుపాయం కల్పించింది. దీని ప్రకారం కొంత మొత్తం ఉపసంహరించుకోవచ్చు.