EPF రాయితీ: చేతికొచ్చే శాలరీ పెరుగుతుందేమో కానీ పన్ను చిక్కులు
కరోనా మహమ్మారి-లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈపీఎఫ్కు సంబంధించి కూడా భారీ ఊరట కల్పించిన విషయం తెలిసిందే. ప్రజల చేతిలో నగదు లభ్యత పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులకు శుభవార్త చెప్పింది. వేతనం మినహా వివిధ రకాల ఇతర ఆదాయాలపై చెల్లించే టీడీఎస్, చెల్లింపులు స్వీకరించే వారు వసూలు చేసే టీసీఎస్లో 25 శాతం తగ్గింపును ప్రకటించింది. ఎంఎస్ఎంఈలకు రూ.3 లక్షల కోట్ల ఉద్దీపన ప్రకటించారు. వీటితో పాటు పీఎఫ్ విషయంలో గుడ్ న్యూస్ చెప్పింది.
'మా ఉద్యోగులకు మోడీ ప్రభుత్వం 2నెలల వేతనం ఇస్తుందని భావించాం'
పీఎఫ్ చెల్లింపుపై ఏం ప్రకటించారంటే?
మూడు నెలలపాటు ఉద్యోగుల, కంపెనీల (పీఎఫ్ గరీబ్ కళ్యాణ్ పరిధిలోకి సంస్థలు) ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ను 12% నుంచి 10% తగ్గించింది కేంద్రం. ఈ నిర్ణయంతో 6.5 లక్షల కంపెనీలకు ప్రయోజనం చేకూరి, వచ్చే మూడు నెలల్లో వాటికి దాదాపు రూ.6,750 కోట్ల మేర లిక్విడిటీ అందుబాటులో వస్తుందని అంచనా. మార్చిలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద చిన్న కంపెనీలకు ప్రకటించిన PF ప్రయోజనాలను మరో 3 నెలల పాటు పొడిగించారు. ఇందులో భాగంగా 100 మంది ఉద్యోగులు ఉండి, అందులో 90% రూ.15,000 కంటే తక్కువ వేతనం పొందితే కంపెనీలు, ఉద్యోగుల తరఫున కేంద్రమే పీఎఫ్ చెల్లిస్తుంది. ఉద్యోగుల చేతిలో డబ్బులు ఉంచేందుకు, కంపెనీలపై భారం తగ్గించేందుకు పైవిధంగా చర్యలు తీసుకుంది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు వర్తించదు. CPSEలు, స్టేట్ PSUలు తమ 12% కాంట్రిబ్యూషన్ అందించాలి.
3.67 లక్షల సంస్థలకు ఉపశమనం
పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం 100 మందికి లోపు ఉద్యోగులు ఉన్న కంపెనీలకు ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ మార్చి, ఏప్రిల్, మే నెలలకు ఇప్పటికే అందించింది. జూన్, జూలై, ఆగస్ట్ నెలల్లోను ఇస్తుంది. దీని ద్వారా 3.67 లక్షల సంస్థలకు ఉపశమనం లభిస్తుంది. పీఎం గరీబ్ కళ్యాణ్ కింద కింద పీఎఫ్ సహకారం అందని కంపెనీలకు ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ 10 శాతానికి మూడు నెలలు తగ్గించిన విషయం తెలిసిందే. ప్రజలు, సంస్థల చేతుల్లో ఎక్కువ మొత్తం ఉంచేందుకు ఇలా చేశారు. కానీ దీంతో టేక్ హోమ్ పెరగవచ్చు కానీ ఆదాయపు పన్ను చిక్కులు కలిగి ఉంటాయి. ఉద్యోగులు, యజమానుల చేతుల్లో డబ్బులు ఉండేలా 12 శాతం నుండి 10 శాతానికి తగ్గించారు. అంటే ఇరువురి చేతుల్లో 2 శాతం అదనంగా కనిపిస్తుంది. ఇది ఆదాయపన్నుపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
కొత్త పన్ను విధానం
ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రెండు ఆదాయపు పన్ను విధానాలు అందుబాటులో ఉన్నాయి. కొత్త పన్ను విధానం ప్రకారం సెక్షన్ 80సీ కింద ఎలాంటి పన్ను ప్రయోజనాలు ఉండవు. కానీ ట్యాక్స్ స్లాబ్స్ను తగ్గించుకునే వెసులుబాటు ఉంది. అయితే నిర్మల ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ ప్రకారం ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ 12 శాతం నుండి 10 శాతానికి తగ్గినా ఎలాంటి తేడా ఉండదు.
పాత పన్ను విధానం
పాత పన్ను విధానం అనుసరిస్తే మాత్రం ఆర్థికమంత్రి ప్రకటించిన ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్కు సంబంధించి సెక్షన్ 80సీ కింద పెట్టుబడులను తగ్గిస్తుంది. అంటే మీరు ఎక్కువ పన్ను చెల్లించాల్సి రావొచ్చు. మీకు ఈ అదనపు మొత్తంతో ఎలాంటి అవసరం లేకుంటే మీరు స్వచ్చంధంగా ప్రావిడెంట్ ఫండ్ (VPF) కాంట్రిబ్యూషన్ చేయవచ్చు లేదా పెంచుకోవచ్చు.
వీటిలో ఇన్వెస్ట్ చేయవచ్చు
ఈపీఎఫ్ వలె వీపీఎఫ్ కాంట్రిబ్యూషన్కు కూడా అదే వడ్డీ రేటు వస్తుంది. వీపీఎఫ్ కోసం మీరు మీ కంపెనీ హెచ్ఆర్ను సంప్రదించవచ్చు. ఒకవేళ మీరు పదవీ విరమణకు చాలా దూరం ఉండి ఉంటే అదనపు నగదు మొత్తాన్ని ELSS (ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం) లేదా PPF (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ) పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ రెండు సెక్షన్లలో 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ELSS (కనీసం 3 ఏళ్లు), PPF (కనీసం 15 ఏళ్లు) పెట్టుబడులు పిల్లల చదువులు లేదా ఇతర అవసరాలకు ఉపయోగపడతాయి. మీరు రిటైర్మెంట్ సేవింగ్స్ గురించి ఆలోచిస్తే ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.