గుడ్ న్యూస్: జీవిత బీమా పాలసీ ప్రీమియం చెల్లింపుల గడువు పెంపు
ఇండియా లో కరోనా వైరస్ రోజు రోజుకూ విస్తరిస్తున్న తరుణంలో ఇన్సూరెన్సు రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐ ఆర్ డీ ఏ ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సర్వం లొక్డౌన్ ఐన సందర్భంగా పాలసీ దారులు సమయానికి ప్రీమియం చెల్లింపులు చేసే పరిస్థితి లేదు కాబట్టి వారి కోసం ఒక వెసులుబాటు కల్పించింది. జీవిత బీమా పాలసీ దారులు తమ ప్రీమియం చెల్లింపులు చేసేందుకు అదనంగా మరో 30 రోజుల గడువును ప్రకటించింది. దీంతో జీవిత బీమా సంస్థ (ఎల్ ఐ సి) సహా అన్ని రకాల జీవిత బీమా పాలసీ దారులకు మరింత గడువు లభించినట్లయింది. ఇకపై వారంతా తమకు లభించే గ్రేస్ పీరియడ్ కు అదనంగా మరో 30 రోజుల గడువును పొందుతారు. ఈ లోగా రెన్యువల్ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఈ మేరకు ఐ ఆర్ డీ ఏ ఒక పత్రిక ప్రకటన లో వెల్లడించింది. ఈ విషయాన్ని ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనంలో పేర్కొంది.
నాలుగు రోజుల్లో రూ.4,000 పెరిగిన బంగారం ధర, నేడు స్వల్ప ఊరట
ఆరోగ్య బీమా కు కూడా...
ప్రస్తుతం ఐ ఆర్ డీ ఏ తీసుకున్న ఈ నిర్ణయం ఆరోగ్య బీమా పాలసీ (హెల్త్ ఇన్సూరెన్సు) లకు కూడా వర్తించనుంది. ఈ మేరకు ఐ ఆర్ డీ ఏ తన పత్రిక ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. ఈ 30 రోజుల ఆలస్యాన్ని బీమా కంపెనీ దయతో పొడిగించినట్లు భావించాలని పేర్కొంది. అంతే కానీ 30 రోజుల ఆలస్యాన్ని ఎట్టి పరిస్థితిలోనూ పాలసీ బ్రేక్ అయినట్లు భావించరాదని ఐ ఆర్ డీ ఏ స్పష్టం చేసింది. అయితే ఈ విషయాన్నీ పాలసీ దారులకు ఇన్సూరెన్స్ కంపెనీలు ముందస్తుగా తెలియజేయాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో అటు జీవిత బీమా పాలసీ లు కొనుగోలు చేసిన వినియోగదారులు, ఇటు ఆరోగ్య బీమా పాలసీ లు తీసుకున్న వినియోగదారులకు కూడా మంచి వెసులుబాటు లభించినట్లయింది.
కర్ఫ్యూ వాతావరణం...
చైనా లో మొదలైన కరోనా వైరస్... ప్రస్తుతం ప్రపంచం మొత్తం వ్యాపించింది. సుమారు 15,000 మంది ప్రాణాలను బలిగొన్న ఈ మహమ్మారి... మరో 3.5 లక్షల మందికి సోకి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇండియా లో కూడా సుమారు 500 మంది ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి ఏడుగురు చనిపోగా... సుమారు 500 మందికి సోకింది. కాబట్టి, ఇండియా లో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎలాగైనా సరే కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. ప్రజలను మార్చి 31 వరకు ఇండ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ అయిపోయింది. అన్ని రకాల సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఐ ఆర్ డీ ఏ సరైన నిర్ణయం తీసుకుందని నిపుణులు పేర్కొంటున్నారు.
రూ 2 లక్షల కోట్ల మార్కెట్...
భారత దేశంలో జీవిత బీమా రంగం క్రమంగా అభివృద్ధి చెందుతోంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే ఇప్పటికీ మనదేశంలో బీమా విస్తృతి తక్కువగానే ఉన్నప్పటికీ... కొత్త పాలసీ ల కొనుగోలు లో ఈ రంగం సగటున 10% వృద్ధి చెందుతోంది. 2019 లో భారత్ లో సుమారు 2.86 కోట్ల మంది పాలసీ దారులు ఉండగా... దాదాపు రూ 2.14 లక్షల కోట్ల కొత్త ప్రీమియం వసూళ్లు జరిగాయి. వీరంతా కలిసి రూ 43.33 లక్షల కోట్ల విలువైన పాలసీ రక్షణ పొందేలా రకరకాల పాలసీ లను కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ఐ ఆర్ డీ ఏ తీసుకున్న నిర్ణయం కోట్ల మంది ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే, దేశంలో పరిస్థితులను అంచనా వేసి ఈ గడువును మరికొంత పొడిగిస్తే చాలా మందికి మేలు జరుగుతుందని వారు సూచిస్తున్నారు.