సెప్టెంబర్ 30లోపు ఈ పనులు పూర్తి చేయాలి... లేదంటే చిక్కులు!
ఆర్థిక అంశాలకు సంబంధించి ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం గడువులోగా కొన్ని పనులు పూర్తి చేయవలసి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(FY22) గడిచిన ఐదు నెలల్లో ఎన్నో గడువులు ముగిశాయి. కేంద్ర ప్రభుత్వం పలు గడువులను పొడిగించింది. ఐటీ రిటర్న్స్ గడువు, ఆటో డెబిట్ ట్రాన్సాక్షన్స్ గడువు వంటి వాటిని ప్రభుత్వం పలుమార్లు పొడిగించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30వ తేదీ వరకు పూర్తి చేయాల్సిన పలు అంశాలను ఇక్కడ పరిశీలిద్దాం.
ఐటీఆర్ ఫైలింగ్
FY21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి సాధారణంగా జూలై చివరి వరకు ఉండే గడువును కేంద్రం సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. సాధారణంగా ప్రతి సంవత్సరం జులై 31వ తేదీ లోపు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువును పెంచారు. ఐటీ రిటర్న్స్ ఇప్పటి వరకు దాఖలు చేయనివారు ఈ నెల పూర్తయ్యే లోపు ప్రక్రియను పూర్తి చేయాలి. ఐటీ రిటర్న్స్ గడువులోగా దాఖలు చేయకుంటే రూ.5 వేల లేట్ ఫీజుతో దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.5 లక్షలకు మించకపోతే లేట్ ఫీజు రూ.1000 కంటే ఎక్కువగా ఉండదు.
ఆటో డెబిట్ ట్రాన్సాక్షన్స్
బ్యాంకు ఖాతా నుండి చేసే ఆటో డెబిట్ చెల్లింపులకు అక్టోబర్ 1వ తేదీ నుండి టు-ఫ్యాక్టర్ అథంటికేషన్ అవసరం. ఇందుకు బ్యాంకు రికార్డుల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేయడం ముఖ్యం. సాధారణంగా మ్యూచువల్ ఫండ్ సిప్స్కు ఆటో డెబిట్ ఆదేశాలు తప్పనిసరి అవుతుంది. పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్స్, రవాణా చెల్లింపులతో పాటు ఇతర సేవలకు సంబంధించి నెలవారీ చేసే ట్రాన్సాక్షన్స్లో ఆటో డెబిట్ ఆప్షన్ వినియోగిస్తారు. ఆటో డెబిట్ చేసే ఐదు రోజుల ముందు లేదా కనీసం 24 గంటలు ముందు బ్యాంకు కస్టమర్లకు అలర్ట్ పంపాలి. ఓటీపీ వెరిఫికేషన్ పూర్తయితే ఆటో డెబిటే పూర్తవుతుంది. దేశంలో డిజిటల్ చెల్లింపులను సురక్షితం చేయడానికి అదనపు ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (AFA)ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్పనిసరి చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ పద్ధతిని తీసుకురావాలని భావించింది. అయితే మరింత గడువును ఇచ్చింది. ఇప్పుడు అక్టోబర్ 1వ తేదీ నుండి ఈ మార్పు తప్పనిసరి.
ఆధార్-పాన్, ఆధార్-పీఎఫ్ లింక్
ఆధార్-పాన్ కార్డును అనుసంధానం చేసేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు ఉంది. ఈ గడువును కూడా కేంద్రం పలుమార్లు పొడిగించింది. ఈ గడువు ముగిసిన తర్వాత ఆధార్ కార్డుతో అనుసంధానించని పాన్ కార్డ్స్ పని చేయవు.
అలాగే, సెప్టెంబర్ నుండి యజమానులు వారి కాంట్రిబ్యూషన్ను ఉద్యోగుల ఖాతాకు క్రెడిట్ చేయాలంటే ఆధార్ను UANకు అనుసందానించాలి.
డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్స్ ఉన్న పెట్టుబడిదారులు సెప్టెంబర్ 30వ తేదీ లోపు KYCని పూర్తి చేయాలి. లేదంటే ఖాతాలు డీ-యాక్టివేట్ కావొచ్చు.