Budget 2021: వారికి నిర్మలమ్మ ట్యాక్స్ ఫ్రీ పెన్షన్ ఇచ్చేనా?
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో అతి క్లిష్టమైన బడ్జెట్ ఇదే అంటున్నారు. ఈ బడ్జెట్లో నిర్మలమ్మ ఏమేం ప్రకటిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Budget 2021-22: స్మార్ట్ఫోన్, గృహోపకరణాల ధరలు పెరుగుతాయా?
గత బడ్జెట్లో పన్ను పరిధిలోకి
కేంద్రం 2020-21 బడ్జెట్లో పెన్షన్ మొత్తాన్ని ఆదాయపు పన్ను పరిధిలోకి చేర్చింది. అంటే అరవై ఏళ్ల నుండి ఎనభై ఏళ్ల మధ్యలో సీనియర్ సిటిజన్ల ఆదాయం రూ.3 లక్షలు దాటితే, అలాగే ఎనభై ఏళ్లకు పైబడిన వారి ఆదాయం రూ.5 లక్షలు మించితే పన్ను విధించేవారు. వివిధ కారణాల వల్ల గత బడ్జెట్ సమయంలో ఆదాయాలు పెంచడం కేంద్రానికి కీలకం. ఈ పరిస్థితుల్లో గత బడ్జెట్లో పన్ను పరిధిలోకి చేర్చింది.
పన్ను మినహాయింపు
2019లో ఆర్థిక మందగమనం, 2020లో కరోనా కారణంగా ఆర్బీఐ రెపో రేటును, రివర్స్ రెపో రేటును తగ్గిస్తోంది. దీంతో డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ. వృద్ధులు చాలామంది బ్యాంకుల్లో డిపాజిట్ ద్వారా వచ్చే ఆదాయంపై ఆధారపడతారు. ఇటీవల వడ్డీ రేట్లు తగ్గడంతో ఆదాయం తగ్గింది. మరోవైపు, పెన్షన్ సొమ్ము, వడ్డీ మొత్తంపై పన్ను ఉంది. కరోనాకు కొత్త బీమా తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లకు ఊరట ఇచ్చేలా పెన్షన్ పైన పన్ను మినహాయింపు పరిధి పెంచడమో లేదా తొలగించడమే చేస్తే ప్రయోజనకరమని భావిస్తున్నారు.
పన్నురహిత పెన్షన్
కరోనా కారణంగా ప్రజల చేతుల్లో నగదు ఉండేలా కేంద్రం అనేక చర్యలు తీసుకుంది. వృద్ధుల ఆదాయ వనరులపై పన్ను మినహాయింపు పలు విధాలుగా ఉపయోగపడుతుంది. దీంతో వారు ఆ మొత్తాలను పెట్టుబడుల రూపంలోకి మారిస్తే ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని, కాబట్టి ప్రభుత్వం పన్నురహిత పెన్షన్ స్కీంను ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు.