కస్టమర్లకు ఐసీఐసీఐ ఝలక్, క్యాష్ డిపాజిట్పై కన్వీనియెన్స్ ఫీజు, వారికి ఊరట..
ప్రయివేటురంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు షాకిచ్చింది. బ్యాంకు పని వేళలు కానీ సమయంలో జరిపే కొన్ని నగదు ట్రాన్సాక్షన్స్ పైన ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలిపింది. సెలవు రోజులు, అలాగే సాధారణ రోజుల్లో సాయంత్రం ఆరు గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల వరకు క్యాష్ యాక్సెప్టర్, రిసైక్లర్ మిషన్లలో చేసే ప్రతి డిపాజిట్ పైన ఛార్జీ వసూలు చేయనున్నట్లు ఐసీఐసీఐ తెలిపింది. ఈ నెల ఒకటో తేదీ నుండి ఈ ఛార్జీలు అమలులోకి వచ్చినట్లు వెల్లడించింది.
రూ.50 ఛార్జ్... నెలలో ఈ మొత్తం దాటితేనే..
క్యాష్ యాక్సెప్టర్, రీసైక్లర్ మిషన్లలో చేసే ప్రతి డిపాజిట్ పైన అదనంగా రూ.50 ట్యాక్స్ను వసూలు చేయనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. వీటిని కన్వీనియెన్స్ ఛార్జీలుగా పేర్కొంది. నవంబర్ 1వ తేదీ నుండి అమలులోకి తెచ్చింది. ఇక్కడ మరో విషయం ఉంది. ఈ మిషన్ల ద్వారా ఖాతాదారుడి నగదు డిపాజిట్ నెలకు రూ.10,000 దాటితే ఈ ఛార్జీలు వర్తిస్తాయని తెలిపింది. ఇది ఒక ట్రాన్సాక్షన్లో కావొచ్చు లేదా ఒకటికి మించి ట్రాన్సాక్షన్స్ కావొచ్చు.
వీరికి ఊరట
సీనియర్ సిటిజన్లు, బేసిక్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్, జన్ ధన్ అకౌంట్స్, వికలాంగులు, విద్యార్థుల ఖాతాలకు ఈ కన్వీనియెన్స్ ఫీజు వర్తించదని ఊరట ఇచ్చింది. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో యాక్సిస్ బ్యాంకు ఈ తరహా ఛార్జీలను ప్రారంభించింది. సాయంత్రం గం.5.00 నుండి ఉదయం గం.9.30 మధ్య చేసే క్యాష్ డిపాజిట్స్ పైన రూ.50 వసూలు చేస్తోంది. అలాగే సెలవు దినాల్లోను దీనిని అమలు చేస్తోంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా...
సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లు బ్యాంకు శాఖకు వచ్చి మూడుసార్లకు మించి నగదు డిపాజిట్ చేసినా, ఉపసంహరించినా నవంబర్ 1వ తేదీ నుండి ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడో తొలుత ప్రకటించింది. నాలుగోసారి నుండి డిపాజిట్ చేయాలంటే ప్రతి ట్రాన్సాక్షన్ పైన రూ.40 నుండి రూ.50 వరకు ఛార్జీ ఉంటుంది. నాలుగోసారి నుంచి నగదు ఉపసంహరణకు ప్రతి ట్రాన్సాక్షన్కు రూ.100 నుండి రూ.125 వరకు ఛార్జీలు విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే బ్యాంకుల సర్వీస్ ఛార్జీ నిర్ణయాన్నిబ్యాంక్ ఆఫ్ బరోడా ఆ తర్వాత వెనక్కి తీసుకుంది.